breaking news
Indira Gandhi assasination
-
‘నా తండ్రి హంతకులను క్షమిస్తున్నా’
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య ఉదంతంపై ఆయన తనయుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిని పూర్తిగా క్షమించేస్తున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సింగపూర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్.. ఇందిర, రాజీవ్ హత్య ఉదంతాలపై స్పందించారు. ‘నా తండ్రి హత్య తర్వాత మా కుటుంబం ఆ బాధ నుంచి కోలుకోవటానికి చాలా సమయం పట్టింది. ఏది ఏమైనా నేనూ, నా సోదరి(ప్రియాంక వాద్రా) హంతకులను క్షమించేస్తున్నాం’ అని రాహుల్ పేర్కొన్నారు. ఇక ఇందిర, రాజీవ్ హత్యలపై రాహుల్ వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయాల్లో దుష్ట శక్తులతో పోరాడే సమయంలో.. మీరు ఓ వైపు నిలిచినప్పుడు ఖచ్ఛితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక్కడా అదే జరిగింది. మా నాన్నమ్మ, తండ్రి ఆ క్రమంలోనే ప్రాణాలు కోల్పోయారు. అప్పటి పరిస్థితులను బట్టి వాళ్లు చనిపోతారని మా కుటుంబం ముందే ఊహించింది. తాను చనిపోతానని నాన్నమ్మ(ఇందిర) నాతో తరచూ అనేవారు. ఆమె చెప్పినట్లే ఆమెను హతమార్చారు. అది చూశాక మీరు కూడా చనిపోతారని నా తండ్రి(రాజీవ్)తో నేను అన్నాను. ఊహించినట్లే జరిగింది. విధి బలీయమైంది’ అని రాహుల్ ఉద్వేగంగా ప్రసంగించారు. కాగా, గతంలో జయలలిత సీఎంగా ఉన్న సమయంలో రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులను విడుదల చేసేందుకు ప్రతిపాదన చేశారు. అయితే దానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ సమయంలో ఈ వ్యవహారంపై స్పందించేందుకు రాహుల్ విముఖత వ్యక్తం చేశారు. -
ట్వీట్ చేసి ఇరకాటంలో పడ్డ కాంగ్రెస్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇరకాటంలో పడింది. మొన్నటికిమొన్న కశ్మీర్ ను 'భారత్ ఆక్రమిత కశ్మీర్'గా అభివర్ణించి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ దుమారం రేపగా.. తాజాగా దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ 72వ జయంతి సందర్భంగా వివాదాస్పద ట్వీట్ చేసింది. ఇందిరాగాంధీ హత్య సందర్భంలో రాజీవ్ గాంధీ చేసిన ఓ వ్యాఖ్య దుమారం రేపింది. 'ఓ మహావృక్షం కూలినప్పుడు నేల సహజంగానే అదురుతుంది' అంటూ రాజీవ్ అప్పట్లో పేర్కొన్నారు. 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీ తన సిక్కు బాడీగార్డుల చేతిలో హత్యకు గురవ్వగా.. ఆ వెంటనే పెద్ద ఎత్తున సిక్కులపై అలర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో 2,700 మంది సిక్కులు చనిపోయారు. ఈ మరణాలను ఉద్దేశించి రాజీవ్ ఈ వ్యాఖ్య చేసినట్టు భావించడంతో అప్పట్లో దుమారం రేపింది. తాజాగా రాజీవ్ జయంతి సందర్బంగా బెంగాల్ పీసీసీ విభాగం ట్విట్టర్ లో ఈ వ్యాఖ్యను పోస్టు చేసింది. దీనిపై దుమారం రేగడంతో వెంటనే ఆ వ్యాఖ్యను పీసీపీ ట్విట్టర్ నుంచి తొలగించింది. అయినా నెటిజన్లు ఆ ట్వీట్ ప్రింట్ స్క్రీన్లతో హోరెత్తిస్తున్నారు. సిక్కులపై జరిగిన అమానుష గాయాలను మళ్లీ గుర్తుచేసేందుకే కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యను పెట్టిందా? అంటూ వారు కామెంట్ చేస్తున్నారు. అయితే, బెంగాల్ పీసీసీ మాత్రం తాము ఆ ట్వీట్ చేయలేదని పేర్కొంటున్నది.