breaking news
Higher taxes
-
ఆ డ్రింక్స్, మద్యంపై పన్నులు ఇంకా పెంచండి: WHO
సుగర్ డ్రింక్స్, మద్యంపై పన్నులు ఇంకా పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. డబ్ల్యూహెచ్ఓ తాజాగా రెండు కొత్త నివేదికలను విడుదల చేసింది. చక్కెర పానీయాలు, మద్యం చౌకగా మారుతున్నందున, ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయని హెచ్చరించింది.తక్కువ స్థిర పన్ను రేట్లు ఉన్న దేశాల్లో ఈ ఉత్పత్తులు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉన్నాయని, దాంతో ఊబకాయం, డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, ఇతర రుగ్మతల బారిన పడుతున్నారని పేర్కొంది. ముఖ్యంగా బాధితుల్లో పిల్లలు, యువత ఎక్కువగా ఉంటున్నారని ఆవేదన వెలిబుచ్చింది.బలహీన పన్ను వ్యవస్థల వల్ల హానికరమైన ఉత్పత్తులు చౌకగా అందుబాటులో ఉంటున్నప్పటికీ, ఆరోగ్య వ్యవస్థలు వీటి వల్ల ఏర్పడే వ్యాధులు, రుగ్మతల ఆర్థిక భారాన్ని భరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి."పొగాకు, చక్కెర పానీయాలు,ఆల్కహాల్ వంటి ఉత్పత్తులపై పన్నులను పెంచడం ద్వారా, ప్రభుత్వాలు హానికరమైన ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించగలవు. తద్వారా ముఖ్యమైన ఆరోగ్య సేవలకు నిధులను ఆదా చేసుకోవచ్చు. ఆరోగ్య పన్నులు వ్యాధులను నివారించడానికి, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి బలమైన సాధనాల్లో ఒకటి" అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ పేర్కొన్నారు.నివేదికల ప్రకారం.. కనీసం 116 దేశాలు చక్కెర పానీయాలపై పన్ను విధిస్తున్నప్పటికీ ఇవి ఎక్కువగా సోడా పానీయాలపై ఉంటున్నాయి. కానీ పండ్ల రసాలు, తియ్యటి పాల పానీయాలు, రెడీ-టు-డ్రింక్ కాఫీలు, టీలు ఇంకా పన్ను నుండి మినహాయింపు పొందుతున్నాయి. ఎనర్జీ డ్రింక్స్పై 97% దేశాలు పన్ను విధిస్తున్నప్పటికీ, 2023 నుండి ఈ సంఖ్య మారలేదు.అలాగే కనీసం 167 దేశాలు మద్యం, మత్తు పానియాలపై పన్ను విధిస్తుండగా, 12 దేశాలు మద్యాన్ని పూర్తిగా నిషేధించాయి. అయితే, ద్రవ్యోల్బణం, ఆదాయ వృద్ధికి అనుగుణంగా ఈ పన్నులు ఉండకపోవడం వల్ల 2022 నుండి చాలా దేశాల్లో ఆల్కహాల్ ధరలో పెద్ద మార్పు రాలేదు అక్కడవి చవక్కానే దొరుకుతున్నాయి. 25 దేశాల్లో అయితే ఎక్కువగా యూరోప్లో మద్యంపై ఎలాంటి పన్నులూ విధించడం లేదు.ఈ చెక్కెర పానీయాలు, మద్యం వ్యాపారాలతో పరిశ్రమలకు లాభాలు పెరుగుతున్నప్పటికీ, ప్రజలు అనారోగ్య సమస్యల బారినపడి తద్వారా వచ్చే ఆర్థిక భారాన్ని మొత్తం సమాజం భరించాల్సి వస్తోందని డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో “3 బై 35” కార్యక్రమంలో భాగంగా 2035 నాటికి పొగాకు, మద్యం, చక్కెర పానీయాల వాస్తవ ధరలను పెంచే దిశగా పన్నులను పెంచడం, పునఃరూపకల్పన చేయడంపై దృష్టి పెట్టాలని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. -
పెట్రోల్ ఉత్పత్తి ధరకన్నా పన్నులే ఎక్కువ!
ఢిల్లీలో లీటరు ధర రూ.60.70 డీలర్కు పడేది రూ.27.24 న్యూఢిల్లీ: పెట్రోలు ఉత్పత్తి వాస్తవ వ్యయంకన్నా... పన్నులు, సుంకాలే అధికంగా ఉండడం- వినియోగదారుకు ఈ కమోడిటీ ధర చుక్కలు చూపిస్తోంది. ఏడాది కాలంలో ఐదుసార్లు పెట్రోలుపై ఎక్సైజ్ సుంకాలను కేంద్రం పెంచింది. దీని కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు కనిష్ట స్థాయిల్లో కదలాడుతున్నా... ఈ ప్రయోజనం సాధారణ ప్రజలకు అందకుండా పోతోంది. ఒక ఉన్నత స్థాయి అధికారి తెలిపిన వివరాల ప్రకారం... ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.60.70. వినియోగదారుడి నుంచి వసూలు చేస్తున్న రూ. 60.70లో రూ. 31.20 పన్నులు, సుంకాలే. అక్టోబర్ ద్వితీయార్థంలో సగటు ప్రాతిపదికన పెట్రోల్ లీటరుకు రిఫైనరీల్లో ఉత్పత్తి చేయడానికి రూ.24.75 ఖర్చయ్యింది. కంపెనీ లాభం, ఇతర వ్యయాలు కలుపుకుంటే... పెట్రోల్ పంప్ డీలర్కు లీటర్ ధర రూ.27.24 పడింది. ఈ ధరకు కేంద్రం వసూలు చేసిన ఎక్సైజ్ సుంకం రూ.19.06 దీనికి కలుపుకోవాల్సి ఉంటుంది. డీలర్ కమిషన్ రూ.2.26. వ్యాలూ యాడెడ్ ట్యాక్స్ లేదా అమ్మకం పన్ను వాటా రూ.12.14. వెరసి ఢిల్లీలో ధర లీటరుకు రూ.60.70కి చేరుతోంది. ఇక డీజిల్ విషయానికి వస్తే.. ఢిల్లీలో లీటరుకు రూ.45.93. అయితే రిఫైనరీలో ఉత్పత్తి వ్యయం రూ.24.86. లాభాల మార్జిన్లు, రిటైల్ పెట్రోల్ పంప్స్కు కంపెనీ రవాణా వ్యయాలను కలుపుకుంటే... ఈ వ్యయం రూ.27.05కు చేరుతోంది. అయితే ఎక్సైజ్ సుంకం రూ.10.66. డీలర్ కమిషన్ రూ.1.43. వ్యాట్ రూ.6.79. వెరసి వినియోగదారుని వరకూ వచ్చే సరికి విలువ రూ.45.93కు చేరుతోంది. ఇంకా పెరగాల్సిందే... కానీ నవంబర్ 7న ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్పై లీటర్కు రూ. 1.60 పెంచింది. డీజిల్కు సంబంధించి ఈ ధర 40 పైసలు పెరిగింది. అయితే ఆయిల్ కంపెనీలు ఈ పెంపును వినియోగదారులకు బదలాయించలేదు. కంపెనీల నిర్ణయం మరొకలాగా ఉంటే... వినియోగదారుపై మరింత భారం తప్పేది కాదు. 8 వారాల కనిష్టానికి రూపాయి డాలర్తో పోలిస్తే 68 పైసలు డౌన్ 66.44 వద్ద క్లోజింగ్ ముంబై: బ్యాంకులు, దిగుమతి సంస్థల నుంచి డాలర్లకు డిమాండ్ కొనసాగడంతో రూపాయి మారకం విలువ ఏకంగా 8 వారాల కనిష్టానికి పడిపోయింది. సోమవారం డాలర్తో పోలిస్తే 68 పైసలు క్షీణించి 66.44 వద్ద క్లోజయ్యింది. సెప్టెంబర్ 16నాటి 66.46 క్లోజింగ్ తర్వాత ఈ స్థాయికి రూపాయి క్షీణించడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం మూడు ట్రేడింగ్ రోజుల్లో దేశీ కరెన్సీ విలువ 95 పైసల మేర (దాదాపు 1.44%) పతనమైనట్లయింది. అమెరికాలో ఉద్యోగాల గణాంకాలు మెరుగుపడటం వల్ల అక్కడ వడ్డీ రేట్లు పెరగొచ్చన్న అంచనాల నడుమ డాలరు విలువ గణనీయంగా పెరిగింది. -
రూపాయిపై ఆందోళన అక్కర్లేదు: జైట్లీ
న్యూఢిల్లీ: దేశీ కరెన్సీ విలువకు తీవ్రమైన ముప్పేమీ లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్య సభలో చెప్పారు. గత కొద్దిరోజులుగా పడుతూ వస్తున్న డాలరుతో రూపాయి మారకం విలువ మళ్లీ స్థిరపడుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కాగా, అమెరికా డాలరు విలువ అంతర్జాతీయంగా బలపడుతుండటంతో.. వర్ధమాన దేశాల కరెన్సీల న్నీ భారీగా పడిపోతున్నాయని.. వాటితో పోలిస్తే.. మన రూపాయి కాస్త మెరుగైన స్థితిలోనే ఉందని ఆయన జైట్లీ పేర్కొన్నారు. 61 స్థాయి నుంచి రూపాయి వేగంగా 64 సమీపానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 63.30 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో తగ్గుతున్న చమురు ధరలవల్ల చేకూరే ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయించనున్నట్లు జైట్లీ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలో తగ్గుతున్న చమురు ధరలవల్ల చేకూరే ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయించనున్నట్లు జైట్లీ చెప్పారు. మరోపక్క పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం పెంపును సమర్థించుకుంటూ సామాజిక పథకాల వ్యయాలకు నిధులను పెంచుకోవలసి ఉన్నదని చెప్పారు. అధిక పన్నుల విధానం .. ‘ప్రజా వ్యతిరేకం’ దేశాన్ని నడిపేందుకు మరింత అధిక పన్నులు విధించాలన్న ఆలోచనకు ప్రభుత్వం పూర్తి విరుద్ధమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఇలాంటివి ప్రజా వ్యతిరేక విధానాలని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, గణనీయమైన పన్ను రాబడులను ప్రభుత్వం వదిలేసుకుంటోందన్న ఆందోళనలను కూడా ఆయన కొట్టి పారేశారు. గృహ నిర్మాణ రంగానికి సంబంధించి పన్ను మినహాయింపులను ప్రస్తావిస్తూ.. ప్రజలకు శ్రేయస్కరమైనదనే ఉద్దేశంతోనే దీన్ని ప్రకటించామని జైట్లీ పేర్కొన్నారు.


