‘చాపరాయి’ ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత
అనంతపురం ఎడ్యుకేషన్ : తూర్పుగోదావరి జిల్లా చాపరాయిలో గిరిజనులు విషజ్వరాలతో మృతి చెందిన ఘటనకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని గిరిజన సంఘాల నాయకులు అన్నారు. సోమవారం నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ చాపరాయిలో మూడు వారాల్లో 16 మంది అనారోగ్యంతో మృత్యువాత పడ్డారని ఆవేదన చెందారు. ప్రభుత్వం కనీస ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో గిరిజనులకు సరైన వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు లేవని, తండాల్లో తాగునీటి సౌకర్యం కూడా లేదని విచారం వెలిబుచ్చారు. ఏదైనా అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లాలంటే సరైన రోడ్లు లేవన్నారు. అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ కేవలం రూ.2కే 20 లీటర్ల తాగునీరు ఇస్తామని చెప్పిన చంద్రబాబు దాన్ని ఎందుకు ఆచరణలో పెట్టలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజన తండాలు, ఏజెన్సీల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. సమావేశంలో జీవీఎస్ నాయకులు మల్లికార్జున, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ సాకే చిరంజీవి, విద్యార్థి విభాగం రాజునాయక్, వై.సుధాకర్, శీనానాయక్, భాస్కర్నాయక్, రమేష్నాయక్ పాల్గొన్నారు.