breaking news
gene therapy
-
కంటి వ్యాధులకు జన్యు చికిత్స
న్యూఢిల్లీ: వంశపారంపర్యంగా వచ్చే కంటి వ్యాధులను నయం చేసేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రిలయన్స్ లైఫ్ సైన్సెస్కు లైసెన్స్ ఇచ్చింది. ఈ జన్యు చికిత్సను రిలయన్స్ లైఫ్ మరింత అభివృద్ధి చేసి వాణిజ్యపరం చేయనుంది. జన్యు చికిత్సకు (జీన్ థెరపీ) సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, భారత్లోని ఒక విద్యాసంస్థ నుండి కంపెనీకి బదిలీ చేయడం ఇదే మొదటిసారి అని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఐఐటీ కాన్పూర్కు చెందిన బయాలాజికల్ సైన్సెస్, బయో ఇంజనీరింగ్ విభా గానికి చెందిన జయంధరణ్ గిరిధర రావు, శుభమ్ మౌర్య ఈ పేటెంటెడ్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. జంతువుల్లో దృష్టి లోపాన్ని సరిదిద్దడంలో ఇది మెరుగ్గా పనిచేసిందని ఐఐటీ కాన్పూర్ తెలిపింది. -
‘థెరపీ’ ప్రకటనలపై గూగుల్ బ్యాన్
శాన్ప్రాన్సిస్కో: శాస్త్రీయంగా నిర్థారణ కాని వైద్య చికిత్సలకు సంబంధించిన ప్రకటనలపై నిషేధం విధిస్తున్నట్లు సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ శుక్రవారం ప్రకటించింది. స్టెమ్ సెల్ థెరపీ, సెల్యూలార్ థెరపీ, జీన్ థెరపీల వంటి శాస్త్రీయంగా పూర్తిగా నిర్ధారణకాని ప్రయోగాత్మక వైద్య విధానాలకు సంబంధించిన యాడ్లు ఇకపై గూగుల్లో కనుమరుగు కానున్నాయని గూగుల్ పాలసీ సలహాదారు ఆడ్రిన్నె బిడ్డింగ్స్ తెలిపారు. బయో మెడికల్, సైంటిఫిక్ ఆధారాలు లేని అన్ని వైద్యవిధానాలు, థెరపీ ప్రకటనల నియంత్రణ కోసం కొత్త పాలసీ తీసుకొచ్చినట్లు ఆమె చెప్పారు. రోగాలతో బాధపడుతున్న వారు ఈ తరహా యాడ్స్ కారణంగా తప్పుదోవ పడుతున్నారని గూగుల్ పేర్కొంది. ఇది మెడికల్ పరిశోధనలను తప్పుబట్టడం కాదని, నిర్థారణ కానటువంటి వాటిపై ఓ కన్నేసి ఉంచడం మాత్రమే అని స్పష్టం చేసింది. దీన్ని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్ అధ్యక్షుడు దీపక్ శ్రీవత్సవ స్వాగతించారు. సంపూర్ణ చికిత్సా విధానాలుగా అభివృద్ధిగాని ఇలాంటి చికిత్సలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటివి ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయన్నారు. ఇలాంటి సందేశాలను నియంత్రించడంలో ఆన్లైన్ సర్వీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. -
జన్యు చికిత్సతో పక్షవాతానికి చెక్
లండన్ : పక్షవాత బాధితులకు ఊరటగా మెరుగైన చికిత్సా పద్ధతులను శాస్త్రవేత్తలు ఆవిష్కరించే క్రమంలో జన్యు చికిత్స వేలాది బాధితులకు వరంగా మారనుంది. జీన్ థెరఫీ ద్వారా పక్షవాత రోగులు చచ్చుబడిపోయిన కాళ్లు, చేతులు, భుజాలపై తిరిగి నియంత్రణ సాధించేలా చేయవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పక్షవాతానికి గురైన ఎలుకలపై పరిశోధకులు చేపట్టిన అథ్యయనం సానుకూల ఫలితాలను ఇవ్వడంతో జన్యు చికిత్స ద్వారా అద్భుతాలు ఆవిష్కరించవచ్చని అంచనా వేస్తున్నారు. లండన్లోని కింగ్స్ కాలేజ్కు చెందిన న్యూరోసర్జన్ల బృందం చేపట్టిన ఈ అథ్యయనంలో పక్షవాత చికిత్సలో మేలి మలుపు వంటి అంశాలను గుర్తించారు. ఇక వెన్నుపూస గాయాలతో రోజువారీ పనులు చేసుకునేందుకు ఇబ్బందిపడే వారికి ఆయా అవయవాల్లో తిరిగి కదలిక రావడం అసాధ్యమవుతున్న క్రమంలో తాజా అథ్యయన వివరాలు చికిత్సా పద్ధతులను కొత్తపుంతలు తొక్కిస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. పక్షవాతం, వెన్నుపూస గాయాలతో ఇబ్బంది పడే వారికి సరికొత్త చికిత్సా పద్ధతుల ద్వారా మెరుగైన జీవితాన్ని అందించేలా తమ అథ్యయన ఫలితాలు వెల్లడయ్యాయని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఎలిజమెత్ బ్రాడ్బురీ తెలిపారు. -
మధుమేహానికి జన్యుచికిత్స!
జన్యువుల్లో మార్పులు చేస్తే బోలెడన్ని వ్యాధులకు సమర్థంగా చికిత్స కల్పించవచ్చు. అయితే ఇందుకోసం జన్యువులను కత్తిరించాలి. అవసరమైన కొత్త జన్యువులను చేర్చాలి లేదంటే తొలగించాలి. ఈ మార్పులు చేర్పులు దీర్ఘకాలంలో శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియని కారణంగా ఇప్పటివరకూ జన్యుచికిత్స అంతగా అందుబాటులోకి రాలేదు. సాల్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు ఈ లోటు కూడా తీరనుంది. జన్యు ఎడిటింగ్ టెక్నాలజీ క్రిస్పర్ –క్యాస్ 9 సాయంతో వీరు ఎలాంటి కత్తిరింపులు లేకుండానే మధుమేహంతోపాటు కొన్ని ఇతర జబ్బులను సమర్థంగా నయం చేయగలిగారు. ఎలుకలపై జరిపిన ఈ ప్రయోగాల్లో అవసరమైన జన్యువులను చైతన్యపరచడం లేదంటే ఆఫ్ చేయడం ద్వారా తాము వ్యాధులను నయం చేయగలిగినట్లు ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త జువాన్ కార్లోస్ అంటున్నారు. క్రిస్పర్ క్యాస్ 9 టెక్నాలజీలో జన్యువులను కత్తిరించే క్యాస్ 9 ఎంజైమ్ స్థానంలో తాము చైతన్యం లేని డీక్యాస్ 9ను ఉపయోగించామని, దీనివల్ల ఇది నిర్దిష్ట జన్యువును కచ్చితంగా చేరుకోగలిగినా.. దానికి ఏమాత్రం నష్టం కలిగించదని జువాన్ తెలిపారు. డీక్యాస్ 9 ఎంజైమ్కు కొన్ని రసాయనాలను జోడించడం ద్వారా కావాల్సిన జన్యువులను ఆన్/ఆఫ్ చేయగలదని వివరించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితోపాటు మధుమేహం, మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధులపై తాము ఈ టెక్నాలజీని ప్రయోగించిన సత్ఫలితాలు రాబట్టామన్నారు. -
150 ఏళ్లు జీవిస్తాడట!
లండన్: పెళ్లి పెటాకులు లేకుండా తాను నిక్షేపంగా 150 ఏళ్లు బతుకుతానని ‘యాంటీ ఏజింగ్ ఎక్స్పర్ట్’ డాక్టర్ అలెక్స్ జావోరొంకోవ్ చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతోపాటు వయోభారాన్ని అరికట్టే మందులు, సప్లిమెంట్లు తీసుకుంటూ జీవిస్తానని తెలిపారు. పెళ్లి, పిల్లలు బాదరబందీ లేకుండా తన భావి జీవితాన్ని మొత్తం ఏజింగ్ను అరికట్టే ప్రయోగాలకే అంకితం చేస్తానని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్లోని బయోజెరంటాలోజీ రీసెర్చ్ ఫౌండేషన్కు డైరెక్టర్గా పని చేస్తున్నారు. భవిష్యత్తులో జన్యువుల చికిత్సకు సంబంధించిన వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తాయని, వాటిని కూడా తాను తీసుకుంటానని ఆయన చెప్పారు. మానవుల ఆయుషు ప్రమాణం 150 ఏళ్లకు చేరుకున్నప్పుడు 74 ఏళ్లకు వృద్ధాప్యం ప్రారంభమవుతుందని అన్నారు. జాతీయ గణాంకాల ప్రకారం బ్రిటన్లో ఆయుషు ప్రమాణం మగవాళ్లలో 78.8 ఏళ్లు, ఆడవాళ్లలో 82.8 ఏళ్లని ఆయన చెప్పారు. ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రావడం వల్ల బ్రిటన్లో ఆయుషు ప్రమాణం గణనీయంగా పెరిందన్నారు. మానవుల ఏజింగ్ను అరికట్టే ప్రయోగాలెన్నో ఇప్పటికే విజయం సాధించాయని, అయితే అవి మందుల రూపంలో మనకు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు. -
మనిషి... మారిపోతున్నాడు!
ఒంటిచేత్తో.. వంద కిలోల బరువు ఎత్తగలరా..? ఆగకుండా.. అలసిపోకుండా 20 కిలోమీటర్లు పరుగెత్తగలరా..? నిండు ఆరోగ్యంతో.. 150 ఏళ్లు బతకగలరా..? మరణం తర్వాతా.. జీవితాన్ని కొనసాగించగలరా..? అమ్మో... ఇవన్నీ శక్తికి మించిన పనులే కదూ! ఊహూ... కానేకాదేమో! టెక్నాలజీ సాయంతో ఈ రోజు కాకపోతే రేపైనా మనిషి... శక్తికి మించిన పనులూ.. చకచకా చేసేయొచ్చు! కుదిరితే అమరత్వమూ పొందొచ్చు!! కొత్త కొత్త టెక్నాలజీలు మనిషి చేసే ప్రతి పనినీ సమూలంగా మార్చివేస్తున్నాయి. అయితే మనిషి పనులను మాత్రమే కాదు.. ఏకంగా మనిషినే టెక్నాలజీలు నిలువెల్లా మార్చేస్తాయని అంటున్నారు శాస్త్రవేత్తలు! పరిమితమైన మనిషి శక్తి సామర్థ్యాలను అపరిమితంగా మార్చివేయడమే కాదు.. మనిషిని అమరుడిని చేసేలా.. శరీరంలో సైతం భాగం అయిపోతాయని చెబుతున్నారు. మొత్తం మీద మనిషి.. తన పరిణామ చరిత్రను తాను సృష్టించుకుంటున్న టెక్నాలజీలతోనే మలుపు తిప్పుకుంటాడని.. నిలువెల్లా రూపాంతరం చెంది.. ‘నరయంత్రుడు’ అయిపోతాడనీ అంటున్నారు. ‘ట్రాన్స్హ్యూమనిజం (మానవ రూపాంతరత)’ భావన వీటన్నింటినీ సాధ్యం చేస్తుందని చెబుతున్నారు విశ్లేషకులు. ఏమిటీ ట్రాన్స్హ్యూమనిజం..? పరిమితంగా ఉన్న శక్తి, సామర్థ్యాలను పెంచుకోవాలన్న మనిషి తపన ఈనాటిది కాదు. జైలు జీవితం నుంచి తప్పించుకుని పక్షిలా ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ దూరతీరాలకు వెళ్లిపోవాలని ఆశపడిన ఇకారస్, డియోడలస్లు పక్షి ఈకలతో రెక్కలు కట్టుకొని ఎగిరేందుకు ప్రయత్నించిన గాథ గ్రీకు పురాణాల్లో కనిపిస్తుంది. ఇక హిందూ పురాణాల్లోనైతే.. సాధారణ మనిషికి సైతం అపరిమిత శక్తులు అబ్బినట్లు చెప్పే గాథలు ఎన్నో ఉన్నాయి. అయితే... ఆధునికయుగంలో సాంకేతికతల ద్వారా మనిషి శక్తి, సామర్థ్యాలను అనూహ్యంగా పెంచుకోవడానికి 1960ల నుంచి మొదలైన ఉద్యమాన్నే ‘ట్రాన్స్హ్యూమనిజం’గా చెప్పుకోవచ్చు. ఇలా టెక్నాలజీల సాయంతో అపరిమిత శక్తులు పొందే మనిషిని ‘ట్రాన్స్హ్యూమన్ (రూపాంతర మానవుడు)’గా పిలుస్తున్నారు. ఇప్పటిదాకా సైన్స్ కాల్పనిక సాహిత్యంలో, సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యమైన ఇలాంటి రూపాంతర మనుషులు మనిషి, యంత్రాలు కలగలిసిపోయినట్లుగా ఉంటారు కాబట్టి.. వారిని మనం ‘నరయంత్రులు’గానూ పిలుచుకోవచ్చు! ఇందుకోసం ఉపయోగపడే సాంకేతికతలన్నింటికీ కలిపి ‘మానవ శక్తులను పెంచే సాంకేతికతలు (హ్యూమన్ ఎన్హ్యాన్సింగ్ టెక్నాలజీస్)’ అనే పేరునూ ట్రాన్స్హ్యూమనిజం కోసం ప్రయత్నిస్తున్నవారు ఉపయోగిస్తున్నారు. బాహ్య అస్థిపంజరంతో కొండంత బలం..! వీపుపై 90 కిలోల బరువు వేసుకుని.. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలరా..? అమెరికా పరిశోధకులు రూపొందిస్తున్న బాహ్య అస్థిపంజరం (ఎక్సో స్కెలిటన్)ను ధరిస్తే.. మీరు వంద కిలోల బరువునూ అవలీలగా మోయగలరు. మనిషిపై దాదాపుగా బరువే పడకుండా చూసే ఈ ‘హ్యూమన్ యూనివర్సల్ లోడ్ క్యారియర్-హెచ్యూఎల్సీ’ని లాఖీడ్ మార్టిన్స్ కంపెనీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇంజనీర్లు సంయుక్తంగా రూపొందిస్తున్నారు. దీనిని గనక సైనికులకు అందుబాటులోకి తెస్తే.. ఇక యుద్ధరంగం రూపురేఖలే మారిపోతాయని నిపుణులు అంటున్నారు. మామూలు పౌరులకు సైతం ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కళ్లజోడు కంప్యూటర్తో చిటికెలో పనులు! ఇంతకుముందు మాదిరిగా మన మానసిక శక్తి ఇంతే.. అని ఇకపై సరిపెట్టుకోనవసరం లేదు. మన శక్తుల పరిమితులను దాటి అనేక విషయాలను సాధ్యం చేసిపెట్టే టెక్నాలజీలు ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్నాయి. ఉదాహరణకు.. కళ్లజోడు కంప్యూటర్గా పేరుపొందిన గూగుల్ గ్లాస్నే తీసుకుంటే.. దీన్ని పెట్టుకుని ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా.. అక్కడి భాష తెలియకున్నా.. మనం చకచకా మాట్లాడేయొచ్చు! మనం మన భాషలో మాట్లాడితే చాలు.. ఇది వారి భాషలో చెప్పి.. వారి మాటలను తిరిగి మన భాషలో మనకు చెబుతుంది. అలాగే మన పరిసరాల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమూ లేకుండా దీనికి పురమాయిస్తే.. ముఖ్యమైన సమాచారాన్ని ఇది భద్రం చేసి.. అవసరమైనప్పుడు తిరిగి గుర్తు చేస్తుంది. ప్రస్తుతానికి ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నా.. భవిష్యత్తులో మాత్రం ఇది చాలా పనులను చేసిపెట్టనుంది. జన్యుచికిత్సతో దీర్ఘాయుష్షు! మానవ రూపాంతరతను సాధ్యం చేసే టెక్నాలజీల్లో హ్యూమన్ జెనిటిక్ ఇంజనీరింగ్ కూడా ఒకటి. మన దేహంలో జరిగే అన్ని పనుల వెనకా.. జన్యువులు కీలక పాత్ర పోషిస్తాయన్నది తెలిసిందే. ఆ జన్యువులను నియంత్రించడం ద్వారా అవసరమైన ఫలితాలు రాబట్టుకునే పద్ధతినే మానవ జన్యు ఇంజనీరింగ్గా చెప్పుకోవచ్చు. దీనిద్వారా జీవశాస్త్రపరంగా ఉన్న ఎన్నో పరిమితులను మనిషి అధిగమించవచ్చు. ఔషధాల ద్వారా లేదా ఇతర పద్ధతుల ద్వారా జన్యువులను నియంత్రిస్తూ.. లేదా కత్తిరిస్తూ.. లేదా జతచేస్తూ.. మనిషి ఆరోగ్యాన్ని పెంపొందించి దీర్ఘాయుష్షును ప్రసాదించొచ్చు. ఉదాహరణకు.. స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఇటీవలే జంతువుల్లో ఎన్కోఆర్1 అనే జన్యువును అణచేయడం ద్వారా.. వాటి శరీరాల్లో కండరాల పెరుగుదలను గణనీయంగా పెంచగలిగారు. అంతేకాదు.. కండరాలు దట్టంగా పెరగడమే కాకుండా వాటి కణాల్లో మైటోకాండ్రియాలు కూడా పెద్ద సంఖ్యలో పెరిగాయట. మైటోకాండ్రియాలంటే కణశక్తి భాండాగారాలు. వాటి సంఖ్య పెరగడం అంటే.. పరోక్షంగా.. మన శరీరం శక్తి పెరగడమే! ఈ జన్యుచికిత్సలు మనుషుల్లో ఇప్పుడప్పుడే అయ్యే పని కాకపోవ చ్చు. కానీ.. ఏదోరోజు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. సైబోర్గ్.. మనిషి సహజం అవయవాలు కృత్రిమం చూడటానికి అందరు మనుషుల్లా మామూలుగానే ఉంటారు. కానీ ఎదలో కొట్టుకునే గుండె మాత్రం కృత్రిమం. చక్కగా వినగలుగుతారు. కానీ వారి చెవిలో ఉన్న కాక్లియా మాత్రం పరికరం. ఇంకా.. ఎముకలు, కండరాలు, మెదడుకు అమర్చే కంప్యూటర్ చిప్లు.. పైకి కనిపించని ఎన్నో ఇంప్లాంట్లు, పరికరాలు వారిలో ఉంటాయి. ఇలా.. లోలోపల అవయవాల స్థానంలో కత్రిమ పరికరాలతో జీవిస్తూ.. పైపైకి మామూలుగానే కనిపించే ‘సైబోర్గ్స్’ సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ వస్తున్నారు. మానవ రూపాంతరత సాధించే దిశగా సైబోర్గ్ టెక్నాలజీ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. కంప్యూటర్లోకి మెదడు ఎక్కిస్తే.. అమరత్వం! మనిషి చనిపోతాడు. కానీ.. అతడి జీవితం అక్కడితోనే ముగిసిపోదు. అతడి దేహం మట్టిలో కలిసిపోతుంది. కానీ.. మెదడు మాత్రం కంప్యూటర్లో భద్రంగా ఉంటుంది. కంప్యూటర్ తలకు.. రోబో శరీరం తోడవుతుంది. మరణించిన తర్వాత కూడా మనిషి జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. బంధాలు, బంధుత్వాలు అన్నీ ఉంటాయి. జీవితం తిరిగి కొనసాగుతుంది. ‘మైండ్ అప్లోడింగ్’ టెక్నాలజీతో ఇది సాధ్యం అవుతుందని అంటున్నారు. 2045 నాటికి కంప్యూటర్లోకి మెదడును ఎక్కించడం దాదాపుగా సాధ్యం అవుతుందని, ఆ తర్వాత మరో 90 ఏళ్లలో మనిషి శరీరాల స్థానంలో రోబో శరీరాలు రావడం ఖాయమని అంటున్నారు గూగుల్ కంపెనీ నిపుణులు. ఒకవేళ ఇదే గనక వాస్తవరూపం దాల్చితే మనిషి కొంత మేరకైనా అమరుడు అయినట్లే! - హన్మిరెడ్డి యెద్దుల