breaking news
erriswamy
-
కొంపలు ముంచింది 'బెల్ట్షాపు మద్యమే'?
వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదంలో సంచలన నిజాలు వెలుగు చూశాయి. ప్రమాదం జరిగిన రోజు పోలీసులు, అధికారులు భావించినట్లు బస్సు.. బైకర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరగలేదు. ప్రమాదానికి కారణం మద్యం మహమ్మారిగా తేలింది. బైకర్ శివ శంకర్ తన స్నేహితుడితో కలిసి బెల్ట్షాపులో పూటుగా మద్యం సేవించి బైక్ నడిపాడు. బస్సు ప్రమాదానికి 13 నిమిషాల ముందు బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడం, శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందడం, ఆ తర్వాత రోడ్డుపై పడి ఉన్న బైక్ను బస్సు ఢీకొట్టి ఈడ్చుకెళ్లడంతో పెను ప్రమాదం సంభవించి బస్సు దగ్ధమైంది. శివశంకర్తో పాటు బైక్ వెనుక కూర్చున్న అతని స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో ప్రమాదానికి అసలు కారణం తేలింది. మొత్తం ప్రమాదాన్ని నిశితంగా విశ్లేషిస్తే.. ప్రభుత్వం నేషనల్ హైవే పక్కనే మద్యం దుకాణాలకు విచ్చలవిడిగా అనుమతివ్వడం, పల్లెల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్షాపుల్ని పెట్టించడమే కారణమని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.సాక్షి ప్రతినిధి కర్నూలు: దేశ వ్యాప్తంగా ప్రజల ఒళ్లు గగుర్పొడిచేలా చేసిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి కారణం బెల్ట్ షాపులో మద్యం అని తేలింది. రాష్ట్రంలో 16 నెలలుగా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ.. ఊరు, వాడ, గుడి, బడి, హైవే ఏదీ అనర్హం కాదన్నట్లు వెలిసిన మద్యం, బెల్ట్ షాపులు తప్పతాగి డ్రైవింగ్ చేసేందుకు ఉసిగొల్పుతున్నాయని స్పష్టమైంది. అర్ధరాత్రి పూట ఓ బెల్ట్ షాపులో పూటుగా మద్యం తాగి.. ఆపై పల్సర్ బైక్పై ప్రయాణిస్తూ వారు ప్రమాదానికి గురైందే కాక.. మరో 19 మంది నిండు ప్రాణాలు మంటగలవడానికి కారణం ప్రభుత్వ మద్యం పాలసీలోని విచ్చలవిడితనమేనని తేటతెల్లం చేసింది. ‘తప్పతాగి డ్రైవ్ చేసే వారు సూసైడ్ బాంబర్లు (ఆత్మాహుతి దళాలు).. టెర్రరిస్టులు.. ఉగ్రవాదుల కంటే ప్రమాదకం. వీరి వల్ల ఎన్ని ప్రాణాలైనా పోవచ్చు. ఎన్నో కుటుంబాలు వీధినపడే ప్రమాదం ఉంది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి చేసే డ్రైవింగ్ వల్ల ఇతరులకే ఎక్కువ హాని జరుగుతుంది’ అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఇటీవల చెప్పిన మాటలను ప్రజలు సోషల్ మీడియా ద్వారా గుర్తు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఇలా విచ్చలవిడిగా వేళాపాళా లేకుండా ఎక్కడబడితే అక్కడ మద్యం దొరికేలా చేసిన ప్రభుత్వమే ఈ ప్రమాదంలో అసలు ముద్దాయని నెటిజన్లు అదే సోషల్ మీడియా వేదికగా ఏకిపడేస్తుండటం వైరల్ అయ్యింది. 19 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసి పోవడానికి మద్యం మహమ్మారే కారణమని తెలుసుకుని ప్రజలంతా నివ్వెరపోతున్నారు. మద్యం కుటుంబాలను చిదిమేస్తుందని చెప్పేందుకు ఇదే ప్రత్యక్ష్య నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు. 16 నెలలుగా ప్రభుత్వ పెద్దల స్వార్థానికి ఫలితం ఈ దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి తప్పతాగి బైక్పై ప్రయాణంకర్నూలు జిల్లాలో వేమూరి కావేరి బస్సు ప్రమాదం ఘటనలో అసలు నిజాలు వెలుగు చూస్తున్నాయి. మద్యం మహమ్మారే ఈ ప్రమాదానికి అసలు కారణమని నిగ్గు తేలింది. కర్నూలు వాసి శివశంకర్, తుగ్గలి మండలం రాంపల్లి వాసి చాకలి ఎర్రిస్వామి అలియాస్ నాని ఇద్దరూ శుక్రవారం రాత్రి నేషనల్ హైవే పక్కనే ఉన్న లక్ష్మీపురంలో మద్యం సేవించారు. అర్ధరాత్రి వరకూ మద్యం సేవించిన తర్వాత ఎర్రిస్వామిని రాంపల్లిలో వదిలేందుకు రాత్రి 2 గంటలకు పూర్తి మద్యం మత్తులో శివశంకర్ పల్సర్ బైక్లో బయలు దేరాడు. వారిద్దరూ లక్ష్మీపురం నుంచి బయలు దేరారని జిల్లా ఎస్పీ కూడా ప్రకటించారు. పెట్రోల్ కోసం కియా షోరూం ఎదురుగా ఉన్న శివప్రసాద్ ఫ్యూయల్ స్టేషన్కు అర్ధరాత్రి 2.22 గంటలకు 6వ పంప్ వద్దకు వెళ్లి ఆపాడు. పెట్రోలు కోసం సిబ్బందిపై కేకలు వేశారు. ఒకటో పంపు వద్దకు రావాలని సిబ్బంది చెప్పడంతో బైక్ను ఒంటిచేత్తో రౌండ్లు తిప్పి వేగంగా నడిపాడు. అక్కడే కిందపడిపోవాల్సింది తృటిలో తప్పించుకున్నాడు. రూ.300 పెట్రోలు పోయించుకుని 2.26 గంటలకు వెళ్లిపోయాడు. పెట్రోలు బంకు నుంచి సరిగ్గా 5.5 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత బైక్ అదుపు తప్పడంతో కుడి వైపు డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఎగిరిపడిన శివశంకర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఎర్రిస్వామి డివైడర్ మధ్యలోని ఖాళీ స్థలంలో ఉన్న గడ్డిలో పడ్డాడు. దీంతో బతికిపోయాడు. వీరు లక్ష్మీపురంలోని ఓ బెల్ట్షాపులో మద్యం తీసుకుని, అర్ధరాత్రి వరకూ తాగి ఆ తర్వాత బైక్లో బయలుదేరినట్లు తెలుస్తోంది.రోడ్డుపై పడిపోయిన బైక్ను ఢీకొట్టడంతోనే..శివశంకర్ బైక్ పై నుంచి కిందపడిపోయిన తర్వాత గుండెలపై ఒత్తి బతికించేందుకు ఎర్రిస్వామి యత్నించాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత శవాన్ని రోడ్డుకు ఎడమ వైపునకు లాగాడు. ఆ తర్వాత బైక్ను లాగేందుకు ప్రయత్నించాడు. ఇంతలో బస్సు వేగంగా వస్తూ రోడ్డుపై మనిషి ఉండటం చూసి డ్రైవర్ హారన్ కొట్టడంతో ఎర్రిస్వామి పక్కకు పరుగెత్తాడు. మనిషి పక్కకు వెళ్లిపోయాడని అదే వేగంతో బస్సు వచ్చింది. అయితే మనిషి ముందు బైక్ ఉందనే సంగతి డ్రైవర్ లక్ష్మయ్య గుర్తించలేకపోయాడు. దీంతో బైక్ను ఢీకొట్టాడు. దీంతో బస్సు కింద బైక్ ఇరుక్కుపోయి, రోడ్డుపై రాపిడికి గురై మంటలు చెలరేగడం, బైక్ పెట్రోల్ ట్యాంకు పగలడంతో భారీగా మంటలు వ్యాపించడంతో పెను ప్రమాదం జరిగింది. ఈ విషయాలను ఎర్రిస్వామి పోలీసుల విచారణలో స్వయంగా వెల్లడించాడు.బైక్పై రెండో వ్యక్తి ఉన్నట్లు ఎలా తెలిసిందంటే..ప్రమాద స్థలి సమీపంలో రోడ్డుకు ఓ వైపు శివశంకర్ శవం, బస్సు కింద బైక్ ఉంది. డ్రైవర్ కూడా బైక్ను ఢీకొట్టానని చెప్పాడు. దీంతో హోం మంత్రి నుంచి కలెక్టర్, ఎస్పీ వరకూ అందరూ ప్రమాదానికి ఇదే కారణమని నమ్మారు. అయితే పోలీసుల పరిశోదనలో అర్ధరాత్రి శివశంకర్ ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకోవాలని యత్నించారు. అతడి ఆధార్ కార్డు ఆధారంగా తల్లి, సోదరుడిని గుర్తించి శివశంకర్ ఫోన్ నంబరు తెలుసుకుని కాల్ డేటా తీశారు. ఫోన్ చేస్తే శివశంకర్ ఫోన్ కూడా తుగ్గలి మండలం రాంపల్లిలో ఉంది. అది ఎర్రిస్వామి వద్ద ఉండటం గుర్తించారు. దీంతో ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఘటన జరిగిన తీరును ఎర్రిస్వామి స్పష్టంగా వివరించాడు. బైక్ను ఈడ్చుకుంటూ వెళ్లడం, కళ్లముందే ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి దూకడం, ఆపై బస్సు తగలబడటం ఎర్రిస్వామి చూశాడు. ఘటన తర్వాత సీఐ అక్కడికి రావడం, ఫైర్ ఇంజన్ను రప్పించే ప్రయత్నాలు చేస్తుండటం. బస్సులో జనాలు అగ్నికి ఆహుతి అవ్వడం.. ఇదంతా తమ బైక్ వల్లే జరిగిందని, దీంతో తనకు ఏదైనా ఇబ్బంది అవుతుందేమోనని భయపడి అక్కడి నుండి పారిపోయాడు.అబద్ధాలతో పోలీసులను మభ్యపెట్టిన డ్రైవర్ లక్ష్మయ్య ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే లక్ష్మయ్య వాస్తవం చెబితే తన తప్పుతోనే ప్రమాదం జరిగిందని తెలుస్తుందని పోలీసులకు అబద్ధాలు చెప్పాడు. తొలుత బైక్ వెళుతుంటే బస్సు ఢీకొట్టిందని, బైక్ బస్సు కింద ఇరుక్కుపోవడంతో రాపిడికి గురై మంటలు రేగి ప్రమాదం జరిగిందని చెప్పాడు. ఆపై బైక్ తనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఎదురుగా రావడంతో ప్రమాదం జరిగిందని చెప్పాడు. చివరకు ఎర్రిస్వామిని విచారించిన తర్వాత తిరిగి డ్రైవర్ను విచారిస్తే అసలు నిజం ఒప్పుకున్నాడు. బైక్ రోడ్డుపై పడి ఉందని, తాను గుర్తించలేక ఢీకొట్టానని చెప్పాడు. లక్ష్మయ్య వాస్తవం ముందే చెప్పి ఉంటే ప్రమాదానికి అసలు కారణం మద్యం మత్తులో వాహనాన్ని నడిపిన శివశంకరే కారణమని శుక్రవారమే తేలేది.ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు ప్రమాదంపై ఉలిందకొండ పోలీసు స్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య, డోన్ డీఎస్పీ శ్రీనివాసులు, కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబునాయుడుతో పాటు పలువురు సీఐలు, ఎస్ఐల బృందం ఘటన స్థలాన్ని పరిశీలించింది. ఎర్రిస్వామి చెప్పింది నిజమేనా.. ఎక్కడ కిందపడ్డారు.. బస్సు ఎన్నిమీటర్లు బైక్తో దూసుకొచ్చింది.. అనే అంశాలను పరిశీలించి రికార్డు చేశారు. శివశంకర్, ఎర్రిస్వామి ఇద్దరూ లక్ష్మీపురంలో మద్యం సేవించి మద్యం మత్తులోనే నేషనల్హైవే పైకి వచ్చినట్లు గుర్తించారు. మద్యం మత్తులోనే బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టినట్లు తేల్చారు. అలాగే బస్సు నిర్మాణం, ఫిట్నెస్ను ఎంవీఐలు నాగరాజు నాయక్, సుధాకర్రెడ్డిల బృందం పరిశీలించింది. గతుకుల హైవే కూడా పెను ప్రమాదాలకు కారణమే!ఎన్హెన్–44లో గుత్తి నుంచి డోన్, కర్నూలు వరకు రోడ్డు పూర్తి అధ్వానంగా ఉంది. భారీగా గుంతలు ఉన్నాయి. కొన్ని చోట్ల ప్యాచ్ వర్క్లు వేశారు. కొన్ని చోట్ల అలాగే ఉన్నాయి. కర్నూలు–డోన్ మధ్య భారీగా గుంతలు ఉన్నాయి. వర్షం వస్తే వీటిలో నీరు నిలబడి రోడ్డు కూడా కన్పించని పరిస్థితి. రాత్రి వేళల్లో బెంగళూరు–హైదరాబాద్కు బస్సులు, కార్లు, లారీలు వేల సంఖ్యలో ప్రయాణం చేస్తుంటాయి. గుంతల రోడ్డులో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదానికి గురవుతున్నాయి. కొంతమంది వాహనదారులు రోడ్డు బాగోలేదని టోల్ ఫీజు చెల్లించమని గొడవలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎన్హెచ్ అధికారులు రోడ్డు బాగుపై దృష్టి సారించాలి. ఆదాయం కోసం సుప్రీంకోర్టునే సవాల్ చేసిన మద్యం వ్యాపారులునేషనల్ హైవేలకు 500 మీటర్ల పరిధిలో ఎలాంటి మద్యం దుకాణాలు ఉండకూడదని 2016లో సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా మద్యం వ్యాపారులు తమ వ్యాపారానికి ఇబ్బంది వస్తుందని ఆందోళన చెందారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల అండతో మద్యం వ్యాపారులు సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేశారు. దీంతో తిరిగి సుప్రీం రివ్యూ చేసి 2017లో మరో తీర్పు ఇచ్చింది. నేషనల్ హైవే.. కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, జిల్లా, మండల కేంద్రాల మీదుగా వెళుతుంటే అక్కడ మాత్రం మద్యం షాపులు పెట్టుకోవచ్చని తీర్పు ఇచ్చింది. ఈ ప్రాంతాలు కాకుండా ఇతర ప్రాంతాల్లో నేషనల్ హైవేలు ఉంటే అక్కడ 220 మీటర్ల లోపు మద్యం దుకాణాలు పెట్టకూడదని చెప్పింది. దీంతో నేషనల్ హైవేలపై విచ్చలవిడిగా మద్యం దుకాణాలు, బార్లు ఏర్పాటయ్యాయి. నేషనల్ హైవేలకు సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో.. రోడ్డుపై మద్యం దుకాణం బోర్డు పెట్టి, సమీపంలో దుకాణం ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు. దీంతో మద్యం ప్రియులు మందు సేవించి హైవే ఎక్కుతున్నారు.నేషనల్ హైవే పక్కనే భారీగా మద్యం దుకాణాలు⇒ ఈ ఫొటోలోని ఈగల్ బార్ అండ్ రెస్టారెంట్ హైదరాబాద్ – బెంగళూరు నేషనల్ హైవే పక్కనే ఉంది. హైవేపై అటు, ఇటూ వెళ్లే వారికి కన్పించేలా బిల్డింగ్పై భాగంలో ఈగల్ బార్ అని రాశారు. నేషనల్ హైవేపై వెళ్లే వాహనదారులు ఇక్కడ ఆగి మద్యం సేవించి మద్యం మత్తులో స్టీరింగ్ పట్టుకుని హైవే ఎక్కుతున్నారు. ⇒ ఈ ఒక్క బెల్ట్ షాపు, బార్ మాత్రమే కాదు.. ఏపీ–తెలంగాణ సరిహద్దులోని పుల్లూరు టోల్గేట్ నుంచి అనంతపురం జిల్లా సరిహద్దు పోతుదొడ్డి వరకు ఎన్హెచ్–44 పక్కన 10 మద్యం దుకాణాలు, ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. పుల్లూరు నుంచి పోతుదొడ్డి వరకూ 88 కిలోమీటర్లు ఉంది. ఈ 88 కిలోమీటర్ల మధ్యలోని పల్లెల్లో బెల్ట్షాపులు ఎన్ని ఉన్నాయో లెక్కేలేదు! పైగా పెద్ద పంచాయతీల్లో రెండు నుంచి నాలుగు వరకు బెల్ట్షాపులు కూడా ఉన్నాయి. టీడీపీ నేతల కనుసన్నల్లో పల్లెల్లో బెల్ట్షాపులు పుట్టగొడుగుల్లా వెలిసినా ఆబ్కారీ అధికారులు నిస్సహాయంగా ఉన్నారు. పైగా టీడీపీ నేతలతో పాటు ఎక్సైజ్ అధికారులు ఆదాయ మార్గాలకు అలవాటు పడి తూగుతున్నారు. దీంతో నేషనల్ హైవే పొడవునా విచ్చలవిడిగా మద్యం దొరుకుతోంది. దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అతిపెద్ద హైవే ఎన్హెచ్–44పై ఇలాంటి మద్యం దుకాణాలు పెద్ద సంఖ్యలో ఉంటే ఏ స్థాయిలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందో ఇట్టే తెలుస్తోంది.ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్హెచ్–44 పక్కన ఉన్న మద్యం దుకాణాలునిరీక్షణ వైన్స్, పంచలింగాల త్రీపెగ్స్, శ్రీ చక్ర ఆస్పత్రి సమీపంలో, కర్నూలుజీవీఆర్ వైన్స్, చెన్నమ్మ సర్కిల్పీఆర్ వైన్స్, షరీన్ నగర్ఈగల్ బార్ అండ్ రెస్టారెంట్సుంకులమ్మ వైన్స్, కృష్ణానగర్మధులోక్ వైన్స్, చిన్న టేకూరురేణుకా యల్లమ్మ వైన్స్, పెద్దటేకూరుమహేశ్ వైన్స్, ఉలిందకొండబాలాజీ వైన్స్, కంబాలపాడు సర్కిల్, డోన్మంజీర వైన్స్, కొత్తపల్లిఈ ఘటనతో ప్రభుత్వం మేల్కొంటుందా? బస్సు ప్రమాదానికి కారణమైంది లక్ష్మీపురంలోని ఓ బెల్ట్షాపు. ఎక్కడ బెల్ట్షాపులు ఉన్నా ఉపేక్షించమని చెబుతున్న సీఎం చంద్రబాబునాయుడుకు రాష్ట్రంలోని ప్రతీ పల్లెలో విచ్చలవిడిగా బెల్ట్షాపులు వెలిశాయని తెలియదా? ఆంధ్రప్రదేశ్లో బెల్ట్షాపు లేని పల్లె లేదంటే అతిశయోక్తి కాదు. రోడ్డుపై వెళ్లే వాహనదారుడు మందు కావాలంటే 10 నిమిషాల్లో మద్యం షాపు, బెల్ట్షాపు కన్పించే పరిస్థితి. దీంతోనే శివశంకర్ మద్యం తాగి బైక్ నడిపాడు.. అదుపు తప్పి చనిపోయాడు. తనతో పాటు మరో 19 మందిని బలితీసుకున్నాడు. నిజానికి బైకర్ సహా 20 మంది చావుకు అసలైన కారణం మద్యం.. బెల్ట్షాపు. ఈ రెండూ లేకపోతే బస్సు ప్రమాదం జరిగేది కాదు. 20 మంది చనిపోయేవారు కాదు. చనిపోయిన ఏడు రాష్ట్రాల్లోని వారి కుటుంబాలు ఈ రోజు హాయిగా నవ్వుతూ ఉండేవి. కేవలం ప్రభుత్వం, టీడీపీ నేతలు ఆదాయం కోసం విచ్చలవిడిగా నేషనల్ హైవేలపై మద్యం దుకాణాలు, పల్లెల్లో బెల్ట్షాపులు ఏర్పాటు చేయడంతో మందు బాబులకు సులువుగా మద్యం దొరుకుతోంది. ఫలితంగా తప్పతాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికం ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ వల్లనే అని స్పష్టమైంది. నేతల ఆదాయం కంటే, ప్రజల ప్రాణాలు ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వం భావించి మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు. -
కారుతో ఢీ కొట్టి.. మృతదేహంతో 18 కిలోమీటర్లు..
ఆత్మకూరు: ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తిని కారుతో ఢీకొన్నాడు. ఎగిరి కారుపై పడి మృతిచెందిన యువకుడిని అలాగే 15 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. అటుగా వెళుతున్న వాహనదారులు కారు పైభాగంలో మృతదేహం ఉండటాన్ని గుర్తించి అప్రమత్తం చేయడంతో కారును రోడ్డుపక్కన ఆపి ఉడాయించాడు. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన అనంతపురం జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన జెన్నే ఎర్రిస్వామి (35)కి ఆత్మకూరు మండలం సిద్ధరామపురం గ్రామానికి చెందిన మంజులతో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ట్రాక్టర్ మెకానిక్గా జీవనం సాగిస్తున్న ఎర్రిస్వామి ఆదివారం ద్విచక్ర వాహనంపై అత్తారింటికి వచ్చాడు. రాత్రి ద్విచక్ర వాహనంపై అనంతపురానికి బయలుదేరాడు. జాతీయ రహదారిపై వై.కొత్తపల్లి వద్దకు చేరుకోగా.. ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు ఢీకొంది. దీంతో ఎర్రిస్వామి కారు పైభాగంపై పడి మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కారును ఆపకుండా నిర్లక్ష్యంగా ముందుకు దూసుకెళ్లాడు. దాదాపు 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి వద్ద వాహన చోదకులు కారు పైభాగంపై మృతదేహం ఉండటాన్ని గుర్తించి.. కారు డ్రైవర్కు చెప్పారు. దీంతో కారును రోడ్డు పక్కన ఆపి, టాప్పై పడి ఉన్న మృతదేహాన్ని గమనించి అక్కడి నుంచి ఉడాయించాడు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బురద జల్లేందుకే ఆరోపణలు
- న్యాయబద్ధంగా మిస్సమ్మ స్థలాన్ని కొనుగోలు చేశాం - చార్జ్షీట్ వేసినంత మాత్రాన మేము ముద్దాయిలం కాదు - వైకుంఠం ప్రభాకర్ చౌదరిలా మునిసిపల్ ఆస్తులు దోచుకోలేదు? - మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి అనంతపురం న్యూసిటీ : ‘మిస్సమ్మ స్థలం సీఎస్ఐ సంస్థకు చెందినది. ఆ స్థలాన్ని మా కుటుంబం న్యాయబద్ధంగా కొనుగోలు చేసింది. ప్రజల్లో తమకొస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే రాజకీయంగా బురదజల్లుతున్నారు. ప్రభాకర్ చౌదరి ఓ కళంకిత ఎమ్మెల్యే. ఆయనలాగా మేము మునిసిపల్ ఆస్తులను దోచుకోలేదు. సీఐడీ చార్జ్షీట్ వేసినంత మాత్రాన మేము ముద్దాయిలం అవుతామా’ అని మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి అన్నారు. గురువారం బీఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ స్థలంలో ఆయన తన సోదరుడు ఎర్రిస్వామిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పలు ఛానళ్లు, పత్రికలు సీఐడీ కేసు నమోదు చేసిందని, తాము పరారీ అయ్యామని పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా ఉండాల్సిన మీడియా తమను ముద్దాయిలుగా చిత్రీకరించడం ఏంటని ప్రశ్నించారు. తాము పరారీలో ఉన్నట్లు వార్తలు రావడం హాస్యాస్పదమన్నారు. పీఆర్పీ రేటింగ్స్ పెంచుకునేందుకు అత్యుత్సాహం ప్రదర్శించకూడదన్నారు. తమ ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై తాము పరువునష్టం దావా ఎందుకు వేయకూడదని ప్రశ్నించారు. గతంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మునిసిపల్ ఆస్తులను వేలం వేయించి వాటిని ఆక్రమించుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సంఘమిత్ర పేరుతో అపార్ట్మెంట్ల నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వారు అన్నీ గమనిస్తున్నారని, బీఎన్ఆర్ కుటుంబంపై ఉన్న నమ్మకంతోనే ఐదుసార్లు తమకు పట్టం కట్టారని అన్నారు. కళంకిత ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్యవర్తులతో ఓ తప్పుడు నివేదికను తయారు చేసి సీఐడీకి ఫిర్యాదు చేయించారని, దానికి సీఎం చంద్రబాబునాయుడు వంత పాడారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడినప్పటి నుంచి మిస్సమ్మ స్థల వివాదం తెరపైకి వచ్చిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ద్వారా లబ్ధి పొందినవారే తాము కాంగ్రెస్ పార్టీ వీడాక ఈ వివాదానికి ఆజ్యం పోశారన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టారన్నారు. సీఎస్ఐ చట్టబద్ధత కలిగిన సంస్థ అని, అందులో రిటైర్డు జడ్జిలు, ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారని గుర్తు చేశారు. ఫోర్జరీ చేసి స్థలాన్ని ఆక్రమించుకుంటే వారు చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నించారు. తమకు న్యాయస్థానాలపై అపారమైన నమ్మకం, గౌరవం ఉందని, న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పారిపోవాల్సిన అవసరం తమకు ఎంతమాత్రమూ లేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడులాగా స్టే తెచ్చుకోవడానికి కూడా ప్రయత్నించబోమన్నారు. ఈ స్థల వివాదంపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉంటామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కొనుగోలు చేస్తే అక్రమదారులా.. : ఎర్రిస్వామిరెడ్డి ‘ఏడెకరాల స్థలాన్ని న్యాయబద్ధంగా కొనుగోలు చేస్తే మమ్మల్ని అక్రమదారులుగా చిత్రీకరిస్తున్నారు. మరి కొనుగోలే చేయకుండా 20 ఎకరాల్లో భవనాలు, కరెంటు ఆఫీసులు, ప్రహరీ గోడలు నిర్మించివారు ఆక్రమణదారులు కారా?’ అని ఎర్రిస్వామిరెడ్డి ప్రశ్నించారు. 1923లో సీఎస్ఐ సంస్థ ఈ స్థలాన్ని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు సైతం అది సీఎస్ఐ సంస్థకు చెందినదేనని పేర్కొందన్నారు. ఆ సంస్థ నుంచి తాము కొనుగోలు చేశామే తప్ప కబ్జాకు పాల్పడలేదన్నారు. నిజానిజాలు త్వరలోనే వెలువడతాయన్నారు.


