breaking news
eat godavari
-
‘అందుకే గిరిజన గ్రామాలు ముంపునకు గురయ్యాయి’
సాక్షి, తూర్పు గోదావరి : రానున్న రెండేళ్లలో రాజమండ్రికి స్మార్ట్ సిటీ స్టేటస్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రాజమండ్రి ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీ, తిరుపతి, షిరిడి వంటి ప్రాంతాలకు విమానం నడపాలని సంబంధిత మంత్రిత్వ శాఖను కోరినట్లు వెల్లడించారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలను పార్లమెంటులో ప్రస్తావించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించాలని కోరామని తెలిపారు. అదే విధంగా దివాన్ చెరువు నుంచి జొన్నాడ జంక్షన్ వరకు ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలని కోరగా.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. రాజమండ్రిలో అంతర్జాతీయ స్థాయి స్టేడియం ఏర్పాటు చేయాలని సంబంధిత మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ‘గోదావరి నదీ జలాలను కాలుష్యం బారి నుంచి కాపాడాలని జలశక్తి మంత్రిని కోరాం. రూ. 780 కోట్లతో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టును కూడా తయారు చేసి పంపాము. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థుల ఉన్నత చదువులకై వడ్డీలేని రుణాలు ఇవ్వాలని హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖను కోరాం. శేషాద్రి, జన్మభూమి రైళ్లకు అనపర్తిలో స్టాప్ కల్పించాలని విఙ్ఞప్తి చేశాం. ఇక శేషాద్రికి ఇప్పటికే అనుమతి లభించింది. అదే విధంగా ఫోర్ లైన్ రోడ్లను వెంటనే పూర్తి చేయాలని మంత్రి నితిన్ గడ్కరీని కోరాము’ అని ఎంపీ భరత్ పేర్కొన్నారు. పోలవరం సందర్శన పేరుతో గత ప్రభుత్వం వందల కోట్లు దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు. పోలవరంలో ముందు చూపు లేకుండా కాపర్ డ్యాం నిర్మించడంతో గిరిజన గ్రామాలు ముంపు బారిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ప్రాణనష్టం లేకుండా సహాయక చర్యలు చేపట్టగలిగామని తెలిపారు. ఇక రాజమండ్రి సిటీ బ్యూటిఫికేషన్ కోసం త్వరలో చర్యలు చేపట్టి...నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని ఎంపీ భరత్ హామీ ఇచ్చారు. ‘గత ప్రభుత్వం ఇండోర్ స్టేడియం మంజూరు అయిందని హడావిడి చేసింది. ఇందుకోసం కేటాయించిన 13 కోట్ల రూపాయలను టీడీపీ ప్రభుత్వం పసుపు కుంకుమ పథకానికి తరలించింది. రాజమండ్రిలో ఒలంపిక్ స్థాయి ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తాం. క్రీడలను విద్యతో సమానంగా ఆదరించాలి. 2020 ఒలంపిక్స్లో అధిక మెడల్స్ వచ్చేలా కృషి చేయాలి’ అని పిలుపునిచ్చారు. అదే విధంగా కోనసీమలో ఓఎన్జీసీ గ్యాస్ చమురు లీకేజీల గురించి కూడా పార్లమెంటులో ప్రస్తావించినట్లు ఎంపీ భరత్ తెలిపారు. రాష్ట్రానికి అత్యధికంగా పరిశ్రమలు తెచ్చే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. -
ఇంటింటా కన్నీరు
ఉన్న ఇళ్లు పీకేసుకున్నాం.. కొత్త ఇళ్లకు దిక్కులేదు.. రేషన్ కార్డు లేదు, పింఛను తొలగించేశారు గడప గడపలో సమస్యల చిట్టా సౌకర్యాలు మాట దేవుడెరుగు కనీసం ఉండటానికి గూడు కూడా ఇవ్వని సర్కార్ తీరుపై జనం ఆగ్రహంతో ఉన్నారు. పాత ఇళ్లు పీకేసుకుని ఎదురుచూస్తుంటే, కొత్త ఇళ్లు ఇవ్వకపోవడంతో బాధితులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. జిల్లాలో 11 నియోజకవర్గాల్లో జరిగిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో ఇళ్లు లేక, ప్రభుత్వం రుణాలు మంజూరు చేయక ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారు ఏకరవుపెట్టారు. – సాక్షి ప్రతినిధి, కాకినాడ ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లంకుర్రులో పక్కా గృహాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో పూరిల్లే దిక్కయ్యాయని పట్టపగలు మధు ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ కేంద్రం జగ్గంపేట మండలం గుర్రప్పాలెంలో ఇళ్లకు రుణాలు ఇస్తామని చెప్పి కాళ్లరిగేలా తిప్పుకున్నా, తాటాకింటిలో అవస్థలు తప్పడం లేదని పాలిశెట్టి భవాని చెప్పారు. అర్హత కలిగినా పింఛను ఇవ్వడం లేదని తాడిపూడి సింహాచలం పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ హుకుంపేట, బొమ్మూరులో ఆధార్, రేషన్, పింఛను వీటిలో ఏ ఒక్కటి ఇవ్వలేదని హుకుంపేట వరలక్ష్మికాలనీకి చెందిన పచ్చిపులుసు సత్యవతి అనే వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పదేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నా, ఇల్లు ఇవ్వలేదని, రేషన్కార్డు లేదని నల్లగుంట్ల రూప వాపోయింది. వర్షం వస్తే రోడ్లు మునిగిపోతున్నాయని పామర్తి గోవిందు, బొమ్మూరు నవభారత్నగర్లో ఖాళీ స్థలాలతో దోమలు పెరిగిపోయాయని ఎన్.చంటి తెలిపాడు. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందని ఎ.లక్ష్మణరావు చెప్పాడు. కల్లుగీత కార్మికుడి కంటతడి మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం నేలటూరులో కార్పొరేషన్ల రుణాలు అధికార పార్టీ వారికే కట్టబెట్టుకుంటున్నారని స్థానికులు ఆరోపించారు. కల్లుగీత కార్మికునిగా గుర్తింపు కార్డు ఉన్నా ప్రయోజనం లేదని చోడేlశ్రీనివాస్ కంటతడిపెట్టాడు. ఇప్పనపాడులో వసతుల లేమితో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రెయినేజీలు లేక అపరిశుభ్రత తాండవిస్తోందని, దోమల బెడద అధికంగా ఉందని కాలనీలో లాజరు గోడు వెళ్లగక్కాడు. నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం పంచాయతీ శివారు కిత్తమూరుపేటలో మహానేత వైఎస్ హయాంలో ఇచ్చిన పింఛన్లను ఇప్పుడు తొలగించారని గ్రామస్తులు మొరబెట్టుకున్నారు. చాలా మంది పింఛన్లుlతొలగించారని తమడాల వెంకాయమ్మ బావురుమంది. రెండేళ్లుగా అడుగుతున్నా రోడ్లు వేయలేదని మోడేజు రాజేశ్వరి గ్రామస్తుల సమస్యను ఏకరవుపెట్టింది. వైఎస్ హయాంలో రూ.200 పింఛను ఇచ్చేవారని, కాలు, చేయి పనిచేయదని వైద్యుల సర్టిఫికెట్ ఉన్నా పింఛను మాత్రం ఇవ్వడం లేదని మాడేం కాసులమ్మ కన్నీరుమున్నీరైంది. రైతుల అవస్థలు పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం క్రాపలో పకృతి వైపరీత్యాలతో నష్టపోయి 200 ఎకరాల్లో గత్యతరం లేక పంట విరామం ప్రకటించామని పలువురు రైతులు వివరించారు. పకృతి వైపరీత్యాల వల్ల ఏటా పంట నష్టపోతున్నా, పరిహారం అందడం లేదని రైతు ఎం.సూర్యభాస్కరరావు ఆవేదన వ్యక్తం చేశాడు. పెద్దాపురం నియోజకవర్గం కట్టమూరులో మంత్రి చేతులతో రుణమాఫీ పత్రం తీసుకున్నా, ఇప్పటికీ మాఫీ కాలేదని పెద్ది నాగేశ్వరరావు అనే రైతు ఘొల్లుమన్నాడు. భర్త చనిపోయి రెండేళ్లయినా, ఇప్పటివరకూ వింతంతు పింఛను ఇవ్వలేదని గోనాతి సూర్యావతి కంటతడిపెట్టింది. మహిళలు కన్నీటిపర్యంతం అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడిలో వికలాంగ పింఛను రావటం లేదని జాలెం సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశాడు. హౌసింగ్ రుణం ఇవ్వలేదని పడమటి గోపాలరావు, డ్వాక్రా రుణమాఫీ కాలేదని పి.గంగామణి వాపోయారు. పిఠాపురం పట్టణం రథాలపేటలో డ్రెయినేజీలు అస్తవ్యస్థంగా మారాయని కొత్తపల్లి బేబీ తెలిపింది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం రాజేంద్రనగర్లో రేషన్కార్డు ఇచ్చారు కానీ, స్లిప్లు ఇవ్వకపోవడంతో రేషన్ ఇవ్వడం లేదని పరుచూరి నూకరత్నం ఆవేదన వ్యక్తం చేసింది. రెండేళ్ల నుంచి ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయలేదని కుండా భద్రావతి కన్నీటిపర్యంతమైంది.