breaking news
Caricatures
-
విరుష్కల పెళ్లి క్యారికేచర్ వైరల్
ముంబై : ప్రముఖ సెలబ్రిటీ జంట విరాట్ కోహ్లి, అనుష్క శర్మల పెళ్లి క్యారికేచర్ ఒకటి ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. దానిపై అభిమానులు విపరీతంగా మనసు పారేసుకున్నారు. విరుష్కల జంట పెళ్లి బట్టలతో ఉన్నట్లు గీసిన క్యారికేచర్ అది. శుక్రవారం అనుష్క శర్మ తన తాజా వెబ్ సిరీస్ ‘‘పాతాల్ లోక్’’ను ప్రమోట్ చేయటానికి ఇన్స్టాగ్రామ్లో వెబ్ సిరీస్కు సంబంధించిన ఓ ఫొటోను ఆమె షేర్ చేశారు. అయితే ఆ ఫొటోలోని విరుష్కల పెళ్లి క్యారికేచర్ అభిమానుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. క్యారికేచర్పై అభిమానులు స్పందిస్తూ.. ‘‘ ఆ పేయింటింగ్ నా మనసు గెలుచుకుంది.. ఫొటోలోని బ్యాక్ గ్రౌండ్లో ఉన్న పేయింటింగ్ కోసం బ్రతుకుతున్నా.. క్యారికేచర్ అద్భుతంగా ఉంది ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( కరోనాపై పోరు: విరుష్కల మరో విరాళం ) కాగా, లాక్డౌన్ కారణంగా ఇంటికి పరిమితమైన విరాట్ కోహ్లి, అనుష్కల జంట సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. తమకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు ఇద్దరు. కరోనాపై పోరుకు విరాళాలు ఇవ్వటమే కాకుండా, లాక్డౌన్ కారణంగా మహిళలపై పెరుగుతున్న గృహ హింసపై స్పందించి తమ మంచి మనసు చాటుకున్నారు. చదవండి : ఆ సర్వేలో కోహ్లి జంట టాప్..! -
అంతర్జాతీయ జ్యూరీగా కార్టూనిస్టు శంకర్
సాక్షి, హైదరాబాద్: కార్టూన్లు, క్యారికేచర్ల రంగంలో వినూత్న పోటీ ముగిసింది. అభిశంసన వరకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఇరాన్ కార్టూన్ డాట్ కామ్ నిర్వహించిన ఈ పోటీలో ప్రపంచవ్యాప్తంగా 79 దేశాల నుంచి 625 మంది ఆర్టిస్టులు భాగస్వాములయ్యారు. తాము గీసిన 1,864 ఆర్ట్ వర్కులను పోటీకి పంపించారు. ఇందులో భారత్తో పాటు బ్రెజిల్, ఇండోనేషియా, అర్జెంటీనా, చైనా, కొలంబియా, మెక్సికో, ఈజిప్టు, పోలండ్, రుమేనియా, స్పెయిన్, టర్కీ, ఉక్రెయిన్ తదితర దేశాల ప్రముఖ కార్టూనిస్టులు, క్యారికేచరిస్టులు తమ ఎంట్రీలను పంపించారు. ఈ ప్రతిష్టాత్మకమైన పోటీకి అంతర్జాతీయ జ్యూరీగా ‘సాక్షి’చీఫ్ కార్టూనిస్ట్ శంకర్ వ్యవహరించారు. ఈ పోటీ కోసం వచ్చిన కార్టూన్లు, క్యారికేచర్లను శంకర్తో పాటు ఇండోనేషియాకు చెందిన కార్టూనిస్టు జీతెత్లు పరిశీలించి విజేతను ఎంపిక చేశారు. ఈ పోటీ విజేతలను ఈనెల 11న ప్రకటించి ఇరాన్లోని టెహ్రాన్ నగరంలో అవార్డులను అందజేయనున్నారు. ఈ అవార్డులను అంతర్జాతీయ జ్యూరీలు శంకర్, జీతెత్ల చేతుల మీదుగా అందజేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఫెడరేషన్ ఆఫ్ కార్టూనిస్ట్స్ ఆర్గనైజేషన్స్ (ఫెకో) అధ్యక్షుడు పీటర్ నువెండ్జిక్, ఉపా«ధ్యక్షుడు విలియం రీజింగ్లు కూడా హాజరు కానున్నారు. అంతర్జాతీయ స్థాయి కార్టూన్ల పోటీకి శంకర్ న్యాయనిర్ణేతగా వ్యవహరించడంతో పాటు, అవార్డుల ప్రదానోత్సవానికి ఇరాన్ వెళ్లడం ఇది రెండోసారి కావడం గమనార్హం. మరో విశేషమేమిటంటే ఈ కార్టూన్ల పోటీకి లోగోగా ట్రంప్పై శంకర్ గీసిన కేరికేచర్నే ఉపయోగించడం భారత కార్టూనిస్టు రంగానికి వన్నె తెచ్చింది. -
చెదిరిన గీత
దివికేగిన కార్టూన్ క్వీన్ తొలి మహిళా కార్టూనిస్టు రాగతి పండరి జీవితం విభిన్న భావాల మిళితం. అనేక అనుభూతుల సంగమం. హృదయానికి బాధ కలిగితే విషాదం వెల్లువవుతుంది. సంతోషం అతిశయిస్తే ఆనందం పల్లవిస్తుంది. చిలిపితనం పులకింతలు పెడితే పెదాలపై నవ్వు పరవళ్లు తొక్కుతుంది. నవ్వు టానిక్లా పని చేస్తుంది. యాంత్రిక జీవితంలో నిరాశను కాసేపైనా తరిమి కొట్టే కిక్ ఇస్తుంది. ఈ ‘గీతా’సత్యాన్ని రాగతి పండరి చిన్ననాటనే గ్రహించారు. తన జీవితంలో తొణికిన విషాదాన్ని పక్కకు నెట్టి పదిమందికీ నవ్వుల పూలు పంచిపెడుతూ బతుకును ధన్యం చేసుకున్నారు. తామేడుస్తూ ఎందరినో ఏడ్పించే వారు ఎక్కువయ్యే లోకంలో, తాను నవ్వుతూ పదిమందిని నవ్విస్తూ ఆ రంగంలో అగ్రగణ్యురాలిగా ఖ్యాతిని సొంతం చేసుకున్నారు. వైకల్యాన్ని ఓడించి ఆహ్లాదాన్ని అందరికీ పంచి పెడుతూ హాస్య ప్రపంచాన మకుటం లేని మహారాణిగా వెలుగొందిన రాగతి పండరి అభిమానులకు విషాదం మిగిల్చి జీవితం నుంచి సెలవు తీసుకున్నారు. విశాఖపట్నం-కల్చరల్: జీవితంలో అన్ని సదుపాయాలూ ఉండి, ముందుకు దూసుకుపోయే అవకాశాలు కలిగిన వారెందరో చతికిలబడుతూ ఉంటే ఆకాశమే అవధిగా రాగతి పండరి అద్భుతాలు సాధించారు. కేవలం ఎనిమిదేళ్ల వయస్సులో ఓ పత్రికలో కార్టూన్ ప్రచురితమయ్యే స్థాయిని సాధించారంటే అందుకు ఆమె సాధన, తపన ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. జిజ్ఞాస కొద్దీ నేర్చుకుంటూ, ఆసక్తి కొద్దీ గమనిస్తూ, తనకు తానుగానే సాధన చేస్తూ ఆమె ఉన్నత లక్ష్యాల దిశగా సాగిపోయారు. పాఠశాలకు వెళ్లి చదువుకునే పరిస్థితి లేని రాగతి పండరి, ఇంట్లో సోదరి చెప్పగా చదువు నేర్చుకున్నారు. తోచినట్టు గీతలు గీసి, అలాగే బొమ్మలు సాధన చేసి, క్రమంగా పూర్తి స్థాయి కార్టూనిస్టుగా ఎదగడానికి అవసరమైన సత్తా సంపాదించారు. ప్రముఖ కార్టూనిస్టు జయదేవ్ వ్యంగ్య చిత్రాలను పత్రికల్లో చూసి, మురిసిపోయి, తానుకూడా అదే రీతిలో నేర్పు సంపాదించాలని ఆరాటపడి... అలా నిర్విరామంగా బొమ్మలు గీసి, రాతలు రాసి ఓ స్థాయికి చేరుకున్నారు. చూడగానే ‘ఇది రాగతి పండరి కార్టూన్’ అన్న గుర్తింపు వచ్చేలా నేర్పు సంపాదించారు. తెలుగునాట తొలి మహిళా కార్టూనిస్టుగా ఖ్యాతి పొందారు. దేశంలోనూ ఈ ఖ్యాతికి ఆమె అర్హురాలే. ఎన్నో కార్టూన్లు... మరెన్నో శీర్షికలు పండరి మొదటి కార్టూన్ ఎనిమిదో ఏటే జ్యోతి వార పత్రికలో ప్రచురితమైంది. మొత్తం 16 వేలకు పైగా కార్టూన్లు వేశారు. వ్యంగ్య చిత్రాలకు సంబంధించి ఆమె కర స్పర్శ సోకని ప్రక్రియ లేదు. క్లిష్టమైన రాజకీయ కార్టూన్లను సుదీర్ఘ కాలం పాటు ‘రాజకీయ చెదరంగం’ శీర్షిక కింద గీసి ఆ విధంగా కూడా తనకు అవగాహన అనల్పమని రుజువు చేసుకున్నారు. నవగ్రహం- అనుగ్రహం పేరున ఇద్దరు అమ్మాయిల కార్టూన్ ఫీచర్, శ్రీమతి పేరున మహిళామణి స్ట్రిప్ కార్టూన్.. ప్రతి పండగకు ప్రత్యేక పేజీ కార్టూన్లు.. అవీ ఇవీ అని కాకుండా నిర్విరామంగా వ్యంగ్య చిత్రాలు సృజించారు. తెలుగులో అన్ని పత్రికలకు తన వ్యంగ్య చిత్రాల వెలుగులు పంచి ఇచ్చారు. తెలుగు కార్టూన్ సామ్రాజ్యానికి ఆమె మకుటం లేని మహారాణి అని జయదేవ్ చేత ప్రశంసలు పొందారు. ‘మీవి కేవలం కార్టూన్లే కాదు.. నేటి కాలపు తెలుగు మధ్యతరగతి వారి చరిత్ర’ అని బాపు ప్రశంసలు అందుకున్నారు. ముగ్ధులైన మహారథులు.. తనంత తానుగా సాధన చేస్తూ, తప్పులు సరిదిద్దుకుంటూ ఒక్కో మెట్టే ఎక్కి ఉన్నత స్థాయికి చేరిన విశిష్టత పండరిది. అందుకే ఆమె ప్రతిభ మహామహులను సైతం ముగ్థులను చేసింది. కార్టూన్లు సాధన చేసిన మొదట్లో తాను గీసిన చిత్రాలను చెన్నైలో నివసించే కార్టూనిస్టు జయదేవ్కు పండరి పంపారు. ఆయన జవాబు రాస్తూ, ఆమె కార్టూన్లను మెచ్చుకోవడమే కాకుండా, అవసరమైన సలహాలు, సూచనలు చేశారు. కొంత కాలానికి ఆయన స్వయంగా విశాఖపట్నం వచ్చి తన శిష్యురాలిని అభినందించారు.. బాపు అంతటి వాడు రచన మాస పత్రికలో 2005లో ప్రచురించిన వినాయక చవితి కార్టూన్ మెచ్చుకొంటూ లేఖ రాశారు. పండరి కార్టూన్కు బాపు బొమ్మ గీశారు. బాధాకరం ప్రముఖ కార్టూనిస్టు రాగతి పండరి అకాల మృతికి పలువురు చిత్రకారులు సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. అచ్చమైన తెలుగు నుడికారపు హాస్యంతో కార్టూన్లు సృషించిన రాగతి పండరి చిరస్మరణీయురాలని కార్టూనిస్ట్ హరి ఒక ప్రకటనలో నివాళులర్పించారు. భార్య, భర్త, పక్కింటి వాళ్లు, ఆఫీసు... ఇలా చిన్నచిన్న విషయాలమీద చక్కటి హాస్యాన్ని పంచగలిగే శైలి ఆమెదన్నారు. తెలుగు కార్టూన్కి ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన వారిలో ఆమె ఒకరుగా శ్లాఘించారు. మహిళా కార్టూన్లు ఎక్కువగా వేసినా మహిళలను కించపరిచేలా కార్టూన్ వేయకపోవడం పండరి ప్రత్యేకతన్నారు. తీరని లోటు ప్రముఖ కార్టూనిస్ట్ రాగతి పండరి అకాల మరణం కార్టూన్ రంగానికి తీరని లోటని చిత్రకారుడు, షిప్యార్డు రచయితల సంఘం, చిత్రకళా పరిషత్ సంఘ కార్యదర్శి సుంకర చలపతిరావు అన్నారు. ఆమె మృతికి చింతిస్తూ గురువారం చిత్రకళా పరిషత్ సంఘం వద్ద సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాగతి పండరి వివిధ అంశాలకు సంబంధించి సుమారు 15 వేల కార్టూన్లు గీశారని, ఆమె ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కళారత్న బిరుదును ప్రదానం చేసిందన్నారు. మద్రాస్ తెలుగు అకాడమీ ఆమెను ఉగాది పురస్కారంతో గౌరవించిందన్నారు. నవ్వుల పువ్వులు ‘దగ్గర చూపా, దూరం చూపా? మీకేంటి ప్రాబ్లెం?’ అని డాక్టర్ ప్రశ్నిస్తే.. ‘ఎవరైనా పచ్చగా ఉంటే చూడలేకపోతున్నాను డాక్టర్’ అనే కడుపు మంట పేషెంట్.. ‘మా నాన్న నాకు వేరే వాడితో పెళ్లి కుదురుస్తున్నాడు.. నువ్విలాగే చూస్తూ కూచుంటావా?’ అని ప్రేయసి అంటే ‘ లేదు రాధా.. నీ పెళ్లికి తప్పక వస్తాను’ అనే కపట ప్రేమికుడు.. ‘పక్కింటి వాళ్ల పిల్లాడ్ని చేర్పించిన కాన్వెంట్లో ఇంగ్లిష్ సరిగ్గా చెప్పడం లేదల్లే ఉందండీ.. ఇంకా ఆవిడ్ని అమ్మా అనే పిలుస్తున్నాడట పాపం’ అని జాలిపడే పరభాషాభిమానీ.. ‘మా ఆవిడ నగలు ఎక్కడ దాచిందో క్లూ ఇస్తా గానీ అందులో నాకో రెండొంతులు ఇస్తావా?’ అని దొంగతోనే బేరం పెట్టే గడుసు భర్తా.. ‘ఏంటీ.. మనవాడు తీరిగ్గా కూర్చుని చదువుకుంటున్నాడూ?’ అని ఆరా తీసే భర్తకి, ‘పాపం.. వాడి సెల్ ఫోన్ పోయిందటండీ’ అని సర్ది చెప్పే జాలి భార్యా.. ఒకటా రెండా.. వందలు.. ఊహూ.. వేలు.. అవును వేలాది పాత్రలు.. లక్షలాది విలక్షణ, విభిన్న స్వభావాలు.. వ్యక్తిత్వాలు.. జీవితంలో అడుగడుగునా తారసపడే రకరకాల వైవిధ్యభరితమైన ప్రవృత్తులు.. అమాయక మాలోకాలు.. గడుసు పిండాలు.. ఇలా ఎన్నో పాత్రలు రాగతి పండరి కార్టూన్లలో ప్రాణం పోసుకొని నవ్వులు పూయించాయి. -
స్కూళ్లలో బోధించాలి!
కార్టూన్లపై ఆర్.కె. లక్ష్మణ్ ఇంటర్వ్యూ: పన్నాల సుబ్రహ్మణ్యభట్టు మంచి బొమ్మలతో పాటు రాజకీయ వ్యంగ్య చిత్రాలకు తలమానికం వంటి ఆలోచనలతో ఎక్కడా వన్నె తగ్గకుండా, ప్రజాదరణ కోల్పోకుండా, తేలిపోని చిత్రాలు వేసినవారు ఆంగ్లపత్రికా రంగంలో ఇద్దరే ఇద్దరు. వారు ఇద్దరూ ‘ఆకుంచె శ్రీమంతులు’. బంగారు కుంచెతో పుట్టినవారి క్రింద లెక్క. వారు - శంకర్, ఆర్.కె. లక్ష్మణ్. అతి తక్కువ లైన్లతో రంగులు పూసిన గీతల క్యారికేచర్లు అనే పోలికల హెచ్చుతగ్గుల ఆలోచనాత్మకమైన ముఖ కవళికల రూపురేఖలు దిద్దగల్గిన దిగ్దంతులు వాళ్లిద్దరే. మరొకరు జన్మించరేమో! లక్ష్మణ్ ‘ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ’లో అతి తక్కువ గీతలతో గీసిన రంగు బొమ్మలను కాపీ చేస్తూ నా మిత్రుడూ, నేనూ 1965లో సెలవులు గడుపుతుండేవాళ్ళం. మొహంలో కండలు నిర్ణయించే గీతలు, వ్యక్తి పోలికలకు పారా కాసే రేఖలు పట్టుకోవడానికి తంటాలుపడుతూ ఉండేవాళ్ళం. పెద్ద కుర్చీలో కూర్చున్న చిన్న లాల్బహదూర్ శాస్త్రి బొమ్మను కాపీ చేయడం దగ్గర నుండి ఆరంభమయిన నా యాత్ర త్వరగానే ముగిసింది కానీ, ఆ బొమ్మలు గీసిన మహానుభావుణ్ణి చూడాలన్న కోరిక మాత్రం నాలుగు దశాబ్దాలకు గానీ తీరలేదు. అదీ నాటకీయంగా కుదిరింది. ఆమధ్య ‘విజయవాడ పుస్తక ప్రదర్శన’కు అతిథిగా వచ్చిన ఆర్.కె. లక్ష్మణ్ గారిని దుర్గ గుడికి తీసుకెళ్లడం నా పని. ఆయనకు దేవాలయ సందర్శనం అప్పుడు చేయడం ఇష్టం లేదు. శ్రీమతి కమలా లక్ష్మణ్ తప్పదన్నారు. ప్రత్యేక ఏర్పాట్లతో ఆవిడ ముందు వరుసకు పదోన్నతి పొందారు. లక్ష్మణ్గారు వెనుకబడ్డారు. క్యూలో చాలాసేపు పట్టింది. ‘మీకూ తప్పలేదు చూశారా’ అని నేను నవ్వాను. ‘ఇదే మనకు ఆహారం’ అన్నారాయన. నెత్తి మీద అక్కడే కోతి కిచకిచలు. ‘‘హనుమంతుడు కూడా నిరసన తెలియజెబుతున్నాడు చూశావా’’ అన్నారు. ప్రక్కనే ఎవరి చంకలోనో ఉన్న పిల్లాడు ఆయనకు ముద్దు వచ్చాడు. ఆయన ఆ పిల్లవాడి బుగ్గ మీద చిటికేశారు. తండ్రికి కోపం లాంటి విసుగొచ్చింది. రెండేళ్ళు నిండని తన పసిపిల్లాణ్ణి తాకిన పరాయివాడంటే సద్భావం కలగలేదు. ఆయనకు ‘‘మనం ఆమోదయోగ్యులం కాదు కదా! నాకు తెలుసు’’ అన్నారు ఆర్.కె. లక్ష్మణ్. కమలగారు దర్శనం చేసుకున్నారు. ఈయన ఆనందంగా బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో నేను ఆయన్ని తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేయాలి. ఆయనకు చెప్పలేదు ఇంటర్వ్యూ అని! ఆయన కాదంటే మొదటికే మోసం వస్తుంది. ‘‘మీకు దండలు వేయడానికి అక్కడ ఒకాయన చాలాసేపు నుంచి వెయిటింగ్. సాధారణ మనిషి ఒకరు ఎదురుచూస్తున్నా’’రని చెప్పి రేడియో స్టేషనుకి తీసుకెళ్ళాను. సంతోషించారు. నాలుగు మాటలు... మీ అభిమానులు సంతోషిస్తారని మైకు ముందు మొదలుపెట్టాను. చివరన ‘‘అభిమాని మంచి ప్రశ్నలు వేశాడే’’ అని నవ్వారు. ఆ ఇంటర్వ్యూ ఇంగ్లీషులో సాగింది. అందులోని కొన్ని భాగాలు: ప్రశ్న: మీలాటి గొప్ప కార్టూనిస్టులు అరుదుగా కనబడతారు ఏ దేశంలోనైనా! కోపం వస్తే నివారించుకోవడానికి కార్టూన్లను వేసుకుంటూ ఉంటారా? నిజం చెప్పండి. ఆర్.కె. లక్ష్మణ్: కోపం అని అనుకోను, వంగ్య వ్యాఖ్య అంటాను. ప్రజల మీద, ముఖ్యంగా రాజకీయ నాయకుల మూర్ఖత్వం మీద, నాయకులం అనుకుని దేశాన్ని నడిపించే నాయకుల మీద! నాయకులే కాదు, మామూలు ప్రజలు కూడా! తప్పని తెలిసే రోడ్లను ఆక్రమించేవారు, మార్గమధ్యంలో నించునేవారు, లారీలు వస్తున్నా రోడ్లు దాటేవారు, ఎర్రదీపాన్ని ధిక్కరించేవారు - అందరూ నాకు కార్టూనుకు పనికొచ్చే సంగతులే. ఇది వేయాలన్న ఆలోచన తటాలున వస్తుందా? ఆర్.కె: లేదు. గంటలకొద్దీ మథనపడితే కానీ రాదు. అది కాదని, ఇది కాదని, చివరికి ఎంపిక చేసుకుని రేపటికి పనికివస్తుందో రాదో చూసుకునీ - చాలా తంటాలుపడాలి. చాలా అలసిపోయాననిపిస్తుందా? ఆర్.కె: నిజమే. అయిదారు గంటలు శ్రమపడితే కానీ కార్టూన్ గీయడానికి ఆ రోజుకు ఆలోచన రాదు. అదో నిరంతర ప్రక్రియ. ఇక్కడ కూర్చున్నా అదే ధ్యాస. బుర్రలో కదలాడుతూ ఉంటుంది. కానీ గీతల్లో గ్రాఫిక్గా రిజిస్టర్ కాదు. అక్కడ సంఘటనలో ఏదో వ్యంగ్యం తారాడుతూనే ఉంటుంది. తరచూ, రోజుకో ఆలోచనను ఎలా దింపగల్గుతున్నారు? ఆర్.కె: నాకు భోజనం పెట్టేదే అది. చేయక తప్పదు. కార్టూనిస్టును కాకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇంజనీరుగా ఇళ్లు కడుతూ ఉండేవాడినేమో! మంచి కార్టూన్ కాకపోయినా ప్రచురించి, పాఠకులు పొగిడితే, బాగుందంటే - మీరు వాళ్ళను చూసి నవ్వుకున్న సందర్భాలున్నాయా? ఆర్.కె: బాగుండని కార్టూనే ప్రతిరోజూ వేస్తున్నాను. వేసినందుకు విచారిస్తాను. రేపు మంచిది వేద్దామని ఆశపడతాను. నా కార్టూను విజయానికి వీళ్ళు కారకులు అని ఎవరినైనా చెప్తారా? ఆర్.కె: నా దేశం, నా ప్రజాప్రతినిధులు. వీళ్లు తెంపు లేకుండా నా జీవితంలో ప్రతిరోజూ ఆలోచనలు సరఫరా చేస్తున్నవారు. వీళ్ళే కారకులు నా విజయానికి! ఇక కార్టూను గీసే యంత్రాంగంలో ఏయే నాయకులు సదుపాయంగా, గీతలకు ఆదర్శవంతంగా కనబడతారు? ఆర్.కె: దీనికి సమాధానం కష్టం. క్యారికేచర్ కళాకారుడికి నెహ్రూ బొమ్మ గీయడం కష్టంగా ఉంటుంది. అయితే గాంధీ దేశానికి సేవ చేయడానికే జన్మించలేదు, కార్టూనిస్టులకీ సదుపాయం కల్గించాడు. ఆయన రూపం అలాంటిది. బట్టతల, పెద్ద చెవులు, చట్టిముక్కు, ముఖంమీద ఎప్పుడూ నవ్వు, దుస్తులు, ధోతీ, కండువా, నడుము వద్ద వేలాడుతున్న జేబు గడియారం - అన్నీ క్యారికేచర్ వేసేవాళ్ళ కోసమా అన్నట్లుంటాయి. కార్టూన్లకు పనికి వచ్చే వస్తువులకు వస్తే నెహ్రూ గారి యుగం బాగా ఉత్సాహం కలిగించేదిగా చెప్పుకోవచ్చా? ఆర్.కె: అబ్బే! అన్ని కాలాలూ ప్రోత్సాహజనకాలే. నెహ్రూ యుగమనేమీ లేదు. ఆ మాటకొస్తే మీ తెలుగు ప్రాంతం నుంచి వచ్చిన పి.వి. నరసింహారావు నా కార్టూన్ల అయిడియాలకి చాలా ఉపయోగపడ్డారు. రాజకీయ వ్యంగ్య చిత్రాలనే మా మీద బలంగా రుద్దుతున్నారెందుకు? సాంఘిక పరిస్థితుల మీద, కుటుంబ విషయాల మీద కార్టూన్లకు ప్రాముఖ్యం లేదేం? ఆర్.కె: ఇప్పటికిప్పుడు ఈ ప్రశ్న నీకు తోచినదనుకోవడం లేదు. మన దేశంలో రాజకీయాలు లేకుండా సాంఘిక జీవనం లేదు. సోషల్ లైఫ్ లేకుండా రాజకీయాలు లేవు. గుడికెళ్ళు. ఇవాళ వెళ్ళాం కదా! ఇద్దరు ఎంపిలు, ఎమ్మెల్యేలు వచ్చి గర్భగుడిలోకి సామాన్య ప్రజలను వెళ్ళనీయకుండా అడ్డుపడ్డారు కదా! దేవాలయం పవిత్రమైన స్థలం. అందరూ సమానమే. కానీ రాజకీయ నాయకులొచ్చి - రేపు మళ్ళీ ఈ పదవుల్లో ఉంటారో ఉండరో తెలియని రాజకీయ నాయకులు వచ్చి - దర్శనాన్ని రాజకీయం చేశారు. పుస్తక ప్రదర్శన ఆరంభించడానికి రాజకీయ నాయకుడు కావాలి. మీ ఇంటికి నీరు సరఫరా కావాలంటే స్థానిక ఎం.పి. సాయపడాలి. సాంఘిక విషయాల కంటే మనం రాజకీయాలే ఎక్కువ చర్చిస్తాం. అందుకని మన దేశంలో రాజకీయ జీవితం, సాంఘిక జీవితం అని విడివిడిగా లేవు. ఇక్కడ ఒకే పాత్రల వరుస వ్యంగ్య చిత్రాలు - స్ట్రిప్ కార్టూన్లు - వృద్ధి చెందలేదేం? ఆర్.కె: ఇంగ్లండ్లోనూ పెంపొందలేదు. అమెరికా వారు వీటిని ముందు ఆరంభించారు. వారే కొనసాగించారు. మన దేశంలో ఇది నడిచే వ్యవహారం కాదు. ఏం ఎక్కువ చిత్రాలు వరుసగా ఏక్షన్తో వేయాల్సి ఉండడం వల్లనా? ఆర్.కె: అలాగని కాదు. దాంట్లో సృజనాత్మకత ఉండదు. అంతేకాకుండా కార్టూనిస్టు అనేవాడు బొమ్మగీయడం అనే ఆలోచనలో నుంచి జన్మిస్తాడు. కార్టూన్లు గీయడం పాఠశాలలో బోధించడం లేదు. బోధించాలి.రచయితలకు ముందు తరం వారి రచనలు ఆదర్శంగా ఉంటాయి. ఎక్కడ నుంచి ఆలోచన తోస్తుందో వారి రచనలు చెప్పి, సాయపడతాయి. ఆర్.కె: కాదు. చిత్రకారుడికీ, రచయితకీ చాలా భేదాలున్నాయి. రచయితకి దృశ్యం సాక్షాత్కరించే గుణం ఉండదు. ఉదాహరణకు బేట్మాన్, ఫాంటమ్ పాత్రలు ఆకాశహర్మ్యాల నుండి వీధిలోకి ఎగురుతూ రావడం, దాన్ని చూపటం - ఒక దర్శనీయ అనుభవం. రచయిత రచించగలడు, కాని ఎలా ఎగురుతుందో చూపించే విధంగా ఊహించలేడు. ఆ రెండూ రాయడం, ఊహించగలగడం కలిసి రావాలి. బొమ్మలు వేయడం, వాటిని కార్టూన్లుగా మలచడంలో మీ మీద ఇతర వ్యంగ్య చిత్రకారుని ప్రభావం ఎవరిది ఉంది? ఆర్.కె: నా మీద డేవిడ్లో అనే వ్యంగ్య చిత్రకారుడి ప్రభావం చాలా ఉంది. ఇప్పుడు ఆయనను ఎవరూ గుర్తుంచుకోరు. చాలా గొప్ప కార్టూనిస్టు... ఇంగ్లండులో. తరువాత ‘సర్’ బిరుదు పొందాడు. సరే ఇంగ్లండులోనే కార్టూన్ కళ ఆరంభమైంది. యూరప్లో ప్రారంభం కాలేదు. చిన్నప్పటి నుండీ నా మీద అమిత ప్రభావం చూపాడు ఆయన. అతని ఆలోచనలు నాకు అప్పుడు అర్థమయ్యేవి కావు. ఐర్లండ్ విప్లవం మీద ఉండేవి. డ్రాయింగ్లు మాత్రం బలమైన ప్రభావం చూపాయి. డ్రాయింగ్లో పనితనాన్ని నిర్లక్ష్యంగా చూడకూడదు. ఒక పద్ధతిలో మనిషి కార్టూనులో నిలబడినా, చేతులు పెట్టుకొని ఒక విదంగా నిద్రపోతున్నా - ఉదాహరణకి ‘గౌడా’లా -ఆ పోజు ఎలా వస్తుంది? నువ్వు మంచి డ్రాయింగ్ వేసే కళాకారుడివి కాగలిగినప్పుడే సాధ్యమవుతుంది. ముందు డ్రాయింగ్ చిత్రకారుడు, తరువాత కార్టూనిస్టు, తర్వాతే వ్యంగ్యం చూపగల సెటైరిస్టు కాగలరు. వ్యంగ్య రచయితలకీ, కార్టూనిస్టులకీ మధ్య కామిక్ ఊహాశక్తి సంబంధమైన పోలికలున్నాయా? ఆర్.కె: నేను వ్యంగ్య రచనలు చేపట్టలేదు. మనం చూసేవాటిలో ప్రతిదాన్లోనూ ఒక వ్యంగ్య దృష్టి ఉంటుంది. ప్రతివాడి అనుభవాన్నీ వ్యంగ్యాత్మకంగా మలచవచ్చు. వ్యంగ్యం రాసేవారికీ, వ్యంగ్య రచయితలైన వోలటైర్, షాలాంటి వాళ్లకీ మధ్యన; వ్యంగ్య రచయితలైన వారికీ కార్టూనిస్టులకీ మధ్య బంధం ఒకటి ఉంది. మంచి డ్రాయింగులు కాకుల మూకనీ, జంతువులనీ వాష్ డ్రాయింగ్లో చాలా బలంగా, అందంగా చిత్రిస్తూ బొమ్మలు వేశారు కదా! ఆర్.కె: నా చిన్నతనం నుండి నాకు కాకులంటే ఎంతో అభిమానం. మన దేశంలో ప్రతి పిల్లవాడూ కిటికీలో నుంచి మొదట చూసేది కాకిని. పచ్చటి చెట్టు వెనుక ఉంటే కాకి కనబడుతుంది. ముందు కాకి, వెనుక నీలాకాశం ఉంటుంది. ఎక్కడైనా అది సిద్ధంగా అందరికీ కనబడుతుంది. నెమలి అనే అంద వికారమైన పక్షినీ, పావురాన్నీ ఎవరూ గమనించకపోవచ్చు. అందుకే, నేను ఈ కాకి అనే పక్షినే చిత్రిస్తూ ఆనందించాను. హైందవ చిత్రకళ, వాస్తుకళ, శిల్పాలు మిమ్మల్ని అబ్బురపరచలేదా? ఆర్.కె: లేదు. దానికి కారణం ఉంది. భారతీయ వాస్తు శిల్పకళలు పరిణతి చెందిన శైలితో విలసిల్లుతూ ఉంటాయి. దుర్గామాత చాలా ఎత్తుగా కనబడుతుంది. ఎంత ఎత్తు అంటే ముందు నిల్చున్న అర్చకుడు చాలా చిన్నవాడుగా ఉంటాడు. వాస్తు శిల్పాలలో భాగాల విభజన వాస్తుకళను గమనించేవారికి చాలా ఆసక్తిని కలిగిస్తుంది, మురిపిస్తుంది. పురాణ పాత్రల నుండి కార్టూనిస్టులు చాలా విషయాలు గీయగలరేమో? అసంఖ్యాకమైన ఆలోచనలు పుడతాయి - పురాణాల నుండి! కానీ నేను పూర్తిగా వద్దనుకున్నాను. మతపరమైనవి కదా అని మానివేశారా? ఆర్.కె: అలాగని కాదు. అవి సందర్భాలను చిన్నగా చిత్రింప చేస్తాయి. విపులంగా తెలివిగా చెప్పనీయవు. రావణుడికి పదితలలు కదా అని ఒక తల బీదరికం, మరొకటి అజ్ఞానం, అనారోగ్యం... అలా చిత్రిస్తూపోవడం గొప్పకాదు. కార్టూన్ అంటేనే సూక్ష్మీకరించి చెప్పడం కూడా కదా? ఆర్.కె: కాదు కాదు. కార్టూన్లో వ్యంగ్యం ఉంటుంది. దెప్పిపొడుస్తున్న వ్యాఖ్యానం ఇస్తూ, నువ్వు అర్థం చేసుకునేలా గీయడం ఉంటుంది. అలా సూక్ష్మంగా చేస్తే కార్టూన్ కాదు. విపులీకరించే చిత్రం మాత్రం కాగలదు. ఈ దేశంలో కార్టూనిస్టులకు గౌరవం ఇస్తున్నారా? ఆర్.కె: సారీ! ఇస్తున్నారు అనే అంటాను. నేను ఇందిరాగాంధీని ప్రతిరోజూ దాడి చేస్తూనే వచ్చాను. ‘పద్మభూషణ్’ గౌరవం ఇచ్చారు. మర్యాద చేసినట్లే కదా! ఎన్నో బహుమతులు, గౌరవాలు నాకు లభించాయి. నేను వారి పట్ల మర్యాదగా ఉన్నందుకు కాదు... వాళ్లను గౌరవించనందుకు లభించాయి. మీ కార్టూన్ బాగులేదని తోచి మీకు మీరే మీ కార్టూన్ బయటకు రాకుండా చూసుకున్నారా? ఆర్.కె: నాకో చిత్రమైన పని చేసే పద్ధతి ఉంది. ఆఫీసుకెళ్లి రెండు మూడు గంటలు పేపర్లు చదువుతాను. ప్రతీదీ విశ్లేషిస్తాను. ఆలోచన వచ్చేదాకా సతమతమవుతాను. అయిడియా కుదిరాక ఫ్రేములో ఎలా దృశ్యంగా దాన్ని మలచడం అనే బాధ మొదలవుతుంది. అంటే ఆ ఆరాటం సినిమా దర్శకుడి చిత్రీకరణ లాంటిది. సీతారామ్ కేసరిని ఇక్కడ నిలబెట్టాలా, లేక లాలూప్రసాద్ని మరోచోట ఉంచాలా, లేదా లాలూని శిఖరాగ్రం మీద పెట్టి, కేసరి శిఖరం మీదకు పరిగెడ్తూ ఇద్దరూ పడిపోతారా - ఇలా సినీ దర్శకుడిలా ఆలోచిస్తాను. చివరికి ఓ ఏర్పాటు చేస్తా. ఒక చోట కేసరి, ఒక చోట రబ్రీదేవి, మరొక చోట లాలూప్రసాద్ని పెట్టి - అప్పుడు నేపథ్యం వగైరాలు చిత్రిస్తాను. తర్వాత వ్యాఖ్యానం తయారవుతుంది. ఎవరు ఏమంటారు అనే విషయం... అటువంటివి. మొన్న ఒక కార్టూన్ వేశాను. కేసరిగారి గదిలో కాంగ్రెస్ నాయకులు బయటకు పోదామని చూస్తూ ఉంటారు. గది తలుపు సగం తెరచి ఉంటుంది. తలుపు మీద ‘కేసరి’గారి పేరు. పైన మామూలు మనిషి పత్రిక చదువుతూ నిలబడి ఉంటాడు. ఆ పత్రిక మీద ‘కాంగ్రెస్ నుండి వలసలు’ అని రాసి ఉంటుంది. తలుపు నుండి బయటకు మహాత్మాగాంధీ లాంటివాడు బయటకు వస్తూంటాడు. తలుపులో నుండి ఒక గొంతు వినబడుతుంది. ‘బెంగపడకండి... చాలామంది గతంలో కాంగ్రెస్ నుండి వెళ్లిపోయారు’ అని! ఇలా కార్టూన్ను చిత్రించడానికి చాలా సమయం పడుతుంది. వ్యంగ్యంతో ఏమీ చేయలేము అని భావంతో నిండి ఉంటుంది. నా మెదడులో పూర్తిగా ఈ ఆలోచన చిత్రరూపం పొందేవరకు పెన్సిల్, కాగితం చేత పట్టను. అప్పుడే కార్టూన్ గీయడం ఆరంభిస్తాను. అంతవరకూ చేయను. ఆలోచన ఒకటి నడవకపోతే, ఇంకొకటి ఆలోచిస్తాను. అలా అశాంతితో ఉంటాను. మీరు అందర్నీ కార్టూన్ల ద్వారానే వేళాకోళం చేస్తారు, విమర్శిస్తారు. మరి మీలోని కార్టూనిస్టు మిమ్మల్ని ఎప్పుడైనా విమర్శించాడా? ఆర్.కె: ప్రతిదాన్నీ, ప్రతివాడినీ నేను విమర్శిస్తాను - నన్ను తప్ప. మీ కార్టూనుని, మీ సంపాదకుడు ఎప్పుడైనా కాదన్నాడా? తిరస్కరించాడా? ఆర్.కె: ఎవడూ, నా కార్టూన్ని ఎడిట్ చేయడు. నాకు ఎడిటర్ లేడు. నేను చిత్రించిన కార్టూన్ని మొదట చూసేవాడు నా దగ్గర పనిచేసే వ్యక్తి. నేను ఇచ్చింది తీసుకొని ముద్రణశాఖకు వెళ్తాడు. అక్కడి నుంచి ఆ కార్టూన్ పదకొండు కేంద్రాలకు వెళుతుంది. ఎడిటర్లు, మిగతావాళ్లు తరువాత ప్రింట్లో చూస్తారు. అంతే! అమ్మయ్యో! ఎవరో నా కార్టూన్ను కాదనడమే!!