breaking news
Caitanyaraju
-
నువ్వా..నేనా!
ఏలూరు సిటీ :ఉభయగోదావరి జిల్లాల శాసనమండలి సభ్యుల ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి..ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రెండురోజులు ఉంటే...అభ్యర్థుల ప్రచారాలు నేటి సాయంత్రం 5గంటలతో ముగియనున్నాయి. ఇప్పటివరకూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇక ఓటర్లకు తాయిలాలు సమర్పించుకునే పనిలో కొందరు అభ్యర్థులు, మద్దతుదారులు బిజీగా ఉన్నారు. బరిలో 15మంది అభ్యర్థులు ఉన్నా ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), ప్రగతి ఇంజినీరింగ్ కాలేజీ అధినేత డాక్టర్ పరుచూరి కృష్ణారావు, సామాజిక, విద్యావేత్త రాము సూర్యారావు నువ్వానేనా అన్న రీతిలో పోటీపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 9,375 మంది ఓటర్లు ఉండగా, వారికోసం 49 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఈనెల 22న ఆదివారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఆ ‘ముగ్గురు’ అధికార పార్టీ అండదండలతో సిట్టింగ్ ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల మద్దతుతో ప్రగతి ఇంజినీరింగ్ కాలేజీ అధినేత డాక్టర్ పరుచూరి కృష్ణారావు, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్, యూటీఎఫ్ మద్దతుతో సామాజిక వేత్త రాము సూర్యారావు మండలి పోటీలో ఉన్నారు. వీరితోపాటు మరో 12మంది అభ్యర్థులు ఉన్నా పోటీ మాత్రం ఆ ముగ్గురి మధ్యే ఉంది. టీడీపీ శ్రేణులన్నీ చైతన్యరాజు గెలుపు కోసం పనిచేస్తున్నాయి. పాఠశాలలకు వెళ్లి ఆయనకు ఓటు వేయాల్సిందిగా టీడీపీ శ్రేణులు ఒత్తిడి చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అందరి సహకారం ఉంది కాబట్టి విజయం తమదేనంటున్నారు చైతన్యరాజు. పరుచూరి కృష్ణారావు తనదైన శైలిలో ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి ప్రభుత్వ విద్యారంగం పటిష్టతకు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. ఆర్భాటాలకు దూరంగా ఉండే పరుచూరి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల మద్దతుతో ఉపాధ్యాయులను కలిసి తానేం చేస్తానో చెబుతూ ఓట్లు అభ్యర్థించటం వల్ల ఉపాధ్యాయుల్లో ఆయనపై సానుకూల ధృక్పథం ఏర్పడిందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన గెలుపు ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. విద్యావేత్త, సామాజిక వేత్త రాము సూర్యారావుకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల్లో పెద్దన్నగా ఉన్న యూటీఎఫ్ విసృ్తత ప్రచారం చేసింది. సూర్యారావు తన విజయంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ముక్కోణపు పోటీలో గెలుపు గుర్రం ఎక్కేదెవరనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. గురువులు ఎవరి వైపు ఉపాధ్యాయ, అధ్యాపకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరి పక్షాన ఉన్నారనే అంశంలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. సమస్యలపై పోరాటాలు చేసే సమయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే ఉపాధ్యాయ సంఘాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నత ఓటర్లు చూపించిన విజ్ఞతను విద్యావంతులైన ఇక్కడి ఉపాధ్యాయులు ప్రదర్శిస్తారా లేక సొమ్ములకే దాసోహమంటారా అనేది ఫలితాలు వెలువడితే గాని తేటతెల్లం కాదు. -
ఫస్ట్ మార్కు ఎవరికో!
శాసనమండలి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్ల నాడి అంచనాలకు అందడంలేదు. మేధావి వర్గంగా పిలిచే ఉపాధ్యాయులే ఓటర్లు కావడంతో ఈ పరిస్థితి కనిపిస్తోంది. బడిలో పిల్లలకు వేసినట్టే.. అభ్యర్థుల్లో ఎవరికి ఉపాధ్యాయులు ఎన్ని మార్కులు వేస్తారు? ఎవరిని పాస్ చేస్తారు? ‘ఫస్ట్ మార్క’ ఎవరికి వేస్తారు అనే విషయాలు తెలియక బరిలో ఉన్న అభ్యర్థులు ఉత్కంఠకు గురవుతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఈ నెల 22న జరగనున్న ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. బరిలో నిలిచిన అభ్యర్థుల బలాబలాల మాట ఎలా ఉన్నా.. ఎవరికి వారే గెలుపు తమదంటే తమదని అంటున్నారు. తెలివైన ఉపాధ్యాయులు ఎవరి పక్షాన నిలుస్తారనేదానిపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. అయ్యవార్ల మూడ్ను తెలుసుకునేందుకు బంధువులు, శ్రేయోభిలాషులు, వేగులను వినియోగించుకుంటున్నారు. ఎన్నికల ఘట్టం చివరి అంకానికి చేరడంతో అభ్యర్థులు చివరి ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. రెండున్నర నెలలుగా టీచర్లను ప్రసన్నం చేసుకునేందుకు వేసిన ఎత్తులు, పై ఎత్తులు ఎంతవరకూ ఫలితాన్నిస్తాయనేదానిపై అంచనాలు వేసుకుంటున్నారు. ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు నిలిచినా ప్రధానంగా ముగ్గురి మధ్యనే పోటీ కనిపిస్తోంది. కార్పొరేట్ విద్యారంగం నుంచి కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), పరుచూరి కృష్ణారావు పోటీలో ఉన్నారు. చైతన్యరాజు అధికార టీడీపీ అభ్యర్థిగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అదే పార్టీకి చెందిన కృష్ణారావు రెబల్గాను, యుటీఎఫ్ బలపరిచిన అభ్యర్థిగా రాము సూర్యారావు పోటీ పడుతున్నారు. వీరితోపాటు మరో 12 మంది కూడా బరిలో నిలిచారు. ఉపాధ్యాయులే ఓటర్లుగా ఉన్నప్పటికీ పరోక్షంగా పలు వర్గాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించనున్నాయి. రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు, వాటికి అనుబంధంగా ఉన్న పలు ఇతర సంఘాలు తెరవెనుక, బయట ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. గతంలో రాజ్యసభ సీటు కోసం గట్టి ప్రయత్నం చేసి చివరి నిమిషంలో ఆ అవకాశం కోల్పోయిన సిట్టింగ్ ఎమ్మెల్సీ, శాసన మండలిలో టీడీపీ విప్ చైతన్యరాజు గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు. రెండోసారి మండలిలో అడుగు పెట్టడాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీగా తాను సాధించిన జీఓలు తనకు ప్లస్ పాయింట్ అవుతాయని, అలాగే, గతానికి భిన్నంగా టీడీపీ మద్దతుతో బరిలోకి దిగడం సానుకూల అంశమవుతుందని చైతన్యరాజు అంచనా వేస్తున్నారు. తాను, తన కుమారుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ రవికిరణ్వర్మ రెండు జిల్లాల్లో పలు వర్గాలతో మమేకమవడం, మూడు దశాబ్దాలుగా ఉన్న రాజకీయ పరిచయాలు తనకు కలసివస్తాయనే ధీమాతో ఉన్నారు. టీడీపీ రెబల్గా బరిలోకి దిగిన ప్రగతి కృష్ణారావు కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ప్రగతి విద్యాసంస్థల సమర్థ నిర్వహణ, పీఈటీ సహా ఉపాధ్యాయ సంఘాల మద్దతు ఉండటం సానుకూలమవుతుందనే అభిప్రాయంతో ఆయనున్నారు. టీడీపీ సభ్యత్వం నుంచి అధిష్టానం తొలగించినా ఉపాధ్యాయులను నేరుగా ప్రసన్నం చేసుకోగలిగానని ఆయన భావిస్తున్నారు.పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాము సూర్యారావు ప్రచారం యూటీఎఫ్ మద్దతుతో చాపకింద నీరులా సాగుతోంది. ఉపాధ్యాయుడిగా ఉన్న నేపథ్యం, ప్రాంతీయ అభిమానం పశ్చిమ గోదావరిలో సానుకూలంగా మారుతాయని ఆయన అంచనా వేస్తున్నారు. ఇలా ఎవరిధీమాలో వారుండగా ప్రత్యర్థులపై బురదజల్లే ఎత్తులు వేయడంలో కూడా ఒకరిని మించి మరొకరు వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికల పుణ్యమా అని పీఆర్టీయూ వంటి ఉపాధ్యాయ సంఘాలు నిట్టనిలువునా చీలిపోయాయి. అందుకే గతంలోకంటే ఈసారి సామాన్యులు సైతం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.