breaking news
Arundhatiray
-
కూతురి ఒడిలో అమ్మ
ఏమయింది ఆ తల్లికి! మొండిగా, నిక్కచ్చిగా పెరిగింది. తల్లిదండ్రులపై కోపం. భర్తపై అసంతృప్తి. బిడ్డను తీసుకుని వెళ్లిపోయింది. బిడ్డనూ పట్టించుకోలేదు. బిడ్డే తల్లిని ఒడిలోకి తీసుకుంది! ‘బుకర్’ పోటీలో ఓ నవల ఇది. బహుమతికి వడపోత మొదలైంది. పదమూడు మందిలో... తొమ్మిది మంది రచయిత్రులే! ఒకరిని మించిన థీమ్ ఒకరిది. జడ్జిలకు పెద్ద పరీక్షే పెట్టారు. చిన్నప్పుడు తార మొండిగా ఉండేది. పెద్దయ్యాక, పెళ్లయ్యాక కూడా! అయితే కారణం ఉండేది ఆ మొండితనానికి. భర్త తనతో ప్రేమగా ఉండటం లేదని అతyì నుంచి విడిపోయింది. ఒడిలో చిన్న బిడ్డ. అంత బిడ్డ ఉన్న తల్లి ఎంత జాగ్రత్తగా ఉండాలి! ఉండదు. సంపన్నులైన తన తల్లిదండ్రులకు చెడ్డపేరు తేవడానికి ఆశ్రమ జీవితం గడుపుతూ, పనిగట్టుకుని యాచకురాలిగా కొన్నాళ్లు గడుపుతుంది. తైల సంస్కారం ఉండదు, మంచి బట్టలు వేసుకోదు. కూతురు పెద్దదవుతుంటుంది. తారకూ వయసు మీద పడి అన్నీ మర్చిపోతుంటుంది. కూతురే ఆమెను జాగ్రత్తగా చూసుకోవలసిన స్థితికి వస్తుంది. తల్లి.. కూతురి ఒడిలో బిడ్డవుతుంది! తల్లి తనకేదైతే ‘కేరింగ్’ను ఇవ్వలేదో, అదే కేరింగ్ను కూతురు తన తల్లికి ఇవ్వవలసి వస్తుంది. ఆ తల్లీకూతుళ్ల మధ్య ప్రేమ, ద్వేషాలే.. ‘బరన్ట్ షుగర్’ నవల. పోటీలో గెలిస్తే 50 లక్షల రూపాయల నగదు బహుమతి వచ్చే ‘బుకర్ ప్రైజ్’ రేస్లో ఉంది ‘బరన్ట్ షుగర్’! దుబాయ్లో ఉంటున్న అవనీ దోషీ ఈ పుస్తక రచయిత్రి. అవని కనుక ఈ ఏడాది విజేత అయితే.. అరుంధతీరాయ్, కిరణ్ దేశాయ్ల తర్వాత బుకర్ ప్రైజ్ పొందిన మూడో భారతీయురాలు అవుతారు. లండన్లోని ‘బుకర్ ప్రైజ్’ కమిటీ మంగళవారం విడుదల చేసిన తొలి వడపోత (లాంగ్ లిస్ట్) ఆంగ్ల భాషా నవలా రచయితల జాబితాలో (పుస్తకాల జాబితా అనాలి) 165 మందికి 13 మంది మిగిలారు. వారిలో ఒకరు అవనీ దోషీ. ఈ పదమూడు మందిలోంచి ఆరుగురిని రెండో విడతగా (షార్ట్ లిస్ట్) వడకడతారు. నవంబరులో అంతిమ విజేతను ప్రకటిస్తారు. అవని తొలి నవల ‘గర్ల్ ఇన్ ది వైట్ కాటన్’. గత ఏడాది ఆగస్టులో ఇండియాలో పబ్లిష్ అయింది. అందుకనే పోటీకి పంపించలేక పోయింది. యు.కె., ఐర్లండ్లలో ప్రచురణ అయిన నవలలను మాత్రమే బుకర్ కమిటీ పోటీకి స్వీకరిస్తుంది. ‘బరన్ట్ షుగర్’ అవని రెండో నవల. లండన్లోని పెంగ్విన్ బుక్స్ సంస్థ ఈ రోజు (జూలై 30) ఆ పుస్తకాన్ని విడుదల చేస్తోంది. ముందరి ఏడాది అక్టోబర్ 1 నుంచి.. అవార్డు ప్రకటించే ఏడాది సెప్టెంబర్ 30 లోపు వచ్చిన పుస్తకాలను బుకర్ కమిటీ పోటీకి పరిగణనలోకి తీసుకుంటుంది కనుక ‘బరన్ట్ షుగర్’ పోటీలో చోటు చేసుకుంది. ఏడాది బుకర్ ప్రైజ్ లాంగ్ లిస్ట్లో ఒక విశేషం ఉంది. పోటీకి నిలిచిన పదమూడు మందిలో తొమ్మిది మంది మహిళా రచయితలే. అవనితో పాటు.. డయేన్ కుక్ (ది న్యూ వైల్డర్నెస్), ట్సిట్సీ డాన్గరేంబ్గా (దిస్ మార్నబుల్ బాడీ), హిలరీ మాంటెల్ (ది మిర్రర్ అండ్ ది లైట్), మాజా మాంగిస్ట్ (ది షాడో కింగ్), కైలీ రీడ్ (సచ్ ఎ ఫన్ ఏజ్) యాన్ టైలర్ (రెడ్హెడ్ బై ది సైడ్ ఆఫ్ ది రోడ్), సోఫీ వార్డ్ (లవ్ అండ్ అదర్ థాట్ ఎక్స్పెరిమెంట్స్), పామ్ జాంగ్ (హౌ మచ్ ఆఫ్ దీజ్ హిల్స్ ఈజ్ గోల్డ్).. ఒకరికొకరు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ తొమ్మిది పుస్తకాలలో ‘ది మిర్రర్ అండ్ ది లైట్’కి కనుక ప్రైజ్ వస్తే.. పుస్తక రచయిత్రి హిలరీ మాంటెల్కి ఇది మూడో ‘బుకర్’ అవుతుంది. 2009లో, 2012లో ప్రైజ్ గెలుచుకున్న ‘ఉల్ఫ్ హాల్’, ‘బ్రింగ్ అప్ ద బాడీస్’ ఆమె రాసిన నవలలే. ఏమైనా ఈ ఏడాది పోటీ ‘టఫ్’గా ఉండబోతోంది. ఈ ‘నవ’లామణులు ఒకరిని మించిన థీమ్తో ఒకరు న్యాయ నిర్ణేతలకు గట్టి పరీక్షే పెట్టబోతున్నారు. నవలల సారాంశం ‘ది న్యూ వైల్టర్నెస్’ వాతావరణ మార్పులకు నివాసయోగ్యం కాని ప్రపంచం నుంచి కూతుర్ని కాపాడుకునే తల్లి కథ. ‘దిస్ మార్నబుల్ బాడీ’ జీవితానికి ఆశల రెక్కలు తొడుగుతుంది. ‘ది మిర్రర్ అండ్ ది లైట్’ ఎనిమిదవ హెన్రీ చక్రవర్తి ముఖ్య సలహాదారు థామస్ క్రాంవెల్ చరమాంకం. ‘ది షాడో కింగ్’ ఒక సైనికాధికారి ఇంట్లోకి పనమ్మాయిగా వచ్చిన అనాథ.. నియమ నిబంధనలతో కూడిన తన కొత్త జీవితానికి అలవాటు పడలేకపోవడం. ‘సచ్ ఎ ఫన్ ఏజ్’.. తగని చోట తగిన విధంగా ఉంటే ఏం జరుగుతుందన్నది! ‘రెడ్హెడ్ బై ది సైడ్ ఆఫ్ ది రోడ్’ అసంఖ్యాకంగా అక్కచెల్లెళ్లు, అత్తమామల కుటుంబ సభ్యులతో విసురుగా మెసిలే ఒక మొరటు మనిషి హృదయ నైర్మల్యం. ‘లవ్ అండ్ అదర్ థాట్ ఎక్స్పెరిమెంట్స్’ పిల్లలు పుట్టడం ఎదురు కోసం చూస్తూ, భవిష్యత్తును అల్లుకుంటున్న ఓ జంట జీవితంలోని హటాత్పరిణామం. ‘హౌ మచ్ ఆఫ్ దీజ్ హిల్స్ ఈజ్ గోల్డ్’ గూడు కోసం, అదృష్టం కోసం వెదకులాడే ఒక వలస కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన అనూహ్య ఘర్షణ. -
గీటురాయ్
బయోగ్రఫీ ‘ఆడవాళ్లు అభిప్రాయం కలవారు’ అని ఒప్పుకోడానికి మగవాళ్లకి ఎన్ని శకాలైనా సరిపోవు. సమాజం మాట దేవుడెరుగు.. ఇంట్లో కూడా వారి అభిప్రాయాలకు విలువ కష్టమే. కానీ.. అరుంధతీరాయ్ తన అభిప్రాయాలను తెగువతో రాసి వడబోస్తోంది. బండరాయి మీద బట్టల్ని బాది బాది ఉతికినట్టు తన విమర్శలతో సమాజాన్ని కడిగి ఆరేస్తోంది. మహిళలకు అభిప్రాయాలు ఉండకూడదు అన్న అభిప్రాయం ఇప్పుడు చెల్లదు. ‘ఊహు.. కుదరదు.. చెల్లాల్సిందే’ అనుకున్నవాళ్లు రాయ్తో కొట్టుకోవాల్సిందే. అరుంధతీరాయ్.. దీటైన వ్యక్తిత్వానికి గీటురాయి. ‘మంచి’ అనే మాటను గనుక ‘విమర్శించ ని’ అనే అర్థంలో చూస్తే.. అరుంధతీరాయ్ గురించి చెప్పుకోడానికి మంచి విషయాలేమీ ఉండవు! ‘విమర్శ’ అనే మాటను గనక ‘మంచి’ అనే అర్థంలో చూస్తే అరుంధతీరాయ్ గురించి మాట్లాడుకోడానికి ఒక్క వ్యతిరేక విషయం కూడా కనిపించదు! ఎందుకంటే.. ‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ పుస్తకంతో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బుకర్ ప్రైజ్ గెలుచుకున్న ఈ భారతీయ రచయిత్రి ఇంతవరకు ఏ ఒక్క పెద్ద మనిషిని గానీ, ఏ ఒక్క పెద్ద వ్యవస్థనిగానీ విమర్శించకుండా వదల్లేదు. అరుంధతి కోసం ప్రస్తుతం దేశమంతటా పోలీసు యంత్రాంగం అప్రమత్తమై ఉంది. ఆమె గనుక ఈ నెల 25 లోగా తన ఆరోపణలపై వివరణ ఇవ్వకపోతే ముంబై హైకోర్టు ఆదేశాలపై ఆమెను కోర్టు ధిక్కార నేరం కింద అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణతో ముంబై కోర్టు ఆయనకు బెయిలు ఇవ్వకపోవడాన్ని ఖండిస్తూ, గత ఏడాది మే నెలలో ప్రముఖ ఆంగ్ల వార పత్రిక ‘ఔట్లుక్’లో అరుంధతి రాసిన వ్యాసంలో పోలీసుల మీద, ప్రభుత్వం మీద, న్యాయ వ్యవస్థ మీద తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. దానిపైనే ఇప్పుడు ఆమె కోర్టుకు వివరణ ఇవ్వవలసి ఉంది. డెవిల్ ఆఫ్ బిగ్ థింగ్స్ అరుంధతికి వ్యతిరేకంగా ఎవరైనా ఆమె బయోగ్రఫీని రాయదలిస్తే బహుశా ఆ పుస్తకానికి వారు పెట్టాలని అనుకునే పేర్లలో ‘డెవిల్ ఆఫ్ బిగ్ థింగ్స్’ అనేది కూడా ఒకటి అయ్యే అవకాశాలున్నాయి. అంతగా ఆమె ఈ సమాజాన్ని ‘విసిగిస్తున్నారు’. ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ని అరుంధతి 1997లో రాశారు. ఆ తర్వాత ఆమె మళ్లీ ఆ స్థాయి ఫిక్షన్ రాయలేదు. ఇప్పటి వరకు రాసినవీ, రాస్తున్నవీ అన్నీ వ్యాసాలే. చిన్న చిన్న విషయాలు మానవ జీవితాల్లో ఎలా పెనుమార్పులను తెస్తాయో ఆ నవలలో రాశారు అరుంధతి. పౌరస్వేచ్ఛను, మానవ హక్కులను, పర్యావరణాన్ని రాజకీయ నిర్ణయాలు ఎలా ధ్వంసం చేస్తున్నాయో ఒక సామాజిక, ఉద్యమ కార్యకర్తగా ఇప్పుడామె తన వ్యాసాలలో, ప్రసంగాలలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అనుకూలవాది.. అరుంధతి అరుంధతి ప్రజానుకూలవాది. గత రెండు దశాబ్దాలుగా ఆమె పార్లమెంటు బయట.. ‘ఏకవ్యక్తి విపక్షం’గా వ్యవహరిస్తున్నారు! ఆమెలో బెరుకుదనం ఉండదు. ఆమె మాటలో మొహమాటం ఉండదు. మంచి అనుకున్నదాన్ని ఎంత బలంగా ప్రచారం చేస్తారో.. చెడు అనుకున్న దాన్ని అంత ఘాటుగా విమర్శిస్తారు. నరేంద్రమోదీ ప్రధాని అభ్యర్థిగా నామినేషన్ వేశారన్న వార్త తెలియగానే అరుంధతి మొదట అన్న మాట... ‘ట్రాజెడీ’ అని! ‘అతడు సైనికప్రియత్వం గల దుడుకుమోతు’ అని కూడా అమె అన్నారు. అన్నా హజారే కూడా అరుంధతి విమర్శలనుంచి తప్పించుకోలేకపోయారు. ‘అన్నా అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని వెనుక నుండి ్రైపైవేటు రంగ సంస్థలు నడిపిస్తున్నాయి’ అని ఆమె అన్నారు. మావోయిస్టులపై భారత ప్రభుత్వం చేపట్టిన సాయుధ చర్యను ‘దేశంలో అతి నిరుపేదలైన వారిపై చేస్తున్న యుద్ధం’గా అరుంధతి అభివర్ణించారు. కాశ్మీర్ విషయంలోనైతే అత్యంత దుస్సాహమైన ప్రకటననే ఆమె చేశారు. ‘కాశ్మీర్ ఏనాడూ ఇండియాలోని భాగం కాదు. ఈ సంగతి భారత ప్రభుత్వానికి కూడా తెలుసు’ అని అన్నారు! శ్రీలంక ప్రభుత్వాన్నైతే తమిళుల ఊచకోతపై ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ‘స్వయంగా శ్రీలంకే ఈ మారణహోమం జరిపించింది’ అని వ్యాఖ్యానించారు అరుంధతీ రాయ్. ఆంటోనీకి బహిరంగ లేఖ అన్నిటికన్నా పెద్ద ఎటాక్... 2008 నాటి ముంబై దాడులపై అరుంధతి వెలిబుచ్చిన అభిప్రాయం. ‘దేశ విభజన, కాశ్మీర్ వివాదం, గుజరాత్ హింస, దేశంలో ముస్లింలకు అందని న్యాయం... ఇన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే ముంబై దాడుల కేసును విచారించాలి’ అని అరుంధతి అన్నారు. పార్లమెంటు భవనంపై జరిగిన దాడిలో ప్రధాన నిందితుడైన మహమ్మద్ అఫ్జల్ ఉరిశిక్షపై స్టే ఇవ్వాలని కూడా ఆమె బహిరంగంగానే డిమాండ్ చేశారు! ఆ ఘటనలో దర్యాప్తు సజావుగా జరగలేదని అరుంధతి ఆరోపణ. ఇక కేరళలో 2003 నాటి ‘మాథుంగ సంఘటన’లో 48 ఏళ్లుగా ఆక్రమణలో ఉన్న తమ భూములను స్వాధీనం చేసుకోడానికి స్థానిక ఆదివాసీలు ప్రాణాలకు తెగించినప్పుడు వారి నాయకులను జైల్లో పడేయడంపై అరుంధతి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. నాటి కేరళ ముఖ్యమంత్రి ఎ.కె.ఆంటోనీకి బహిరంగ లేఖ రాశారు. ‘మీ చేతులకు రక్తం అంటింది. చూసుకున్నారా?’ అని ప్రశ్నించారు. ఇలా భారతదేశంలో జరుగుతోందనుకున్న ప్రతి తప్పునూ అరుంధతి ఖండించారు. అమెరికా సహా ప్రతి దేశాన్ని వేలెత్తి చూపించారు. మన న్యూక్లియర్ విధానాలను, నర్మద ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకించారు. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా యుద్ధాన్ని, ఇజ్రాయెల్ ‘ప్రభుత్వ ఉగ్రవాదాన్నీ’ తప్పుపట్టారు. ఎవరీ అమ్మాయి? మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో జన్మించారు అరుంధతి. తండ్రి రజిబ్ రాయ్ బెంగాలీ హిందువు. తేయాకు తోటల మేనేజర్. తల్లి మేరీ రాయ్. మలయాళీ సిరియన్ క్రిస్టియన్. కేరళలో మహిళల హక్కుల కార్యకర్త. ఇద్దరిదీ ప్రేమ వివాహం. వీళ్ల కుటుంబం కోల్కతాలో ఉండేది. అరుంధతికి రెండేళ్లప్పుడు అమ్మానాన్న విడిపోయారు. నాన్నను వదిలి తమ్ముడితో పాటు తల్లితో కేరళ వచ్చేసింది. తర్వాత కొన్నాళ్లు ఊటీలో అరుంధతి తాతగారి ఇంట్లో ఉంది ఆ కుటుంబం. అక్కడి నుంచి మళ్లీ కేరళకు. అరుంధతి చదువు కూడా ఆమె కుటుంబం లాగే ఒక చోట స్థిరంగా సాగలేదు. కొట్టాయంలో కొంత, నీలగిరులలో కొంత పూర్తయింది. ఢిల్లీ ‘స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్’ నుంచి పట్టా తీసుకుంది. అక్కడే ఆమెకు సహ ఆర్కిటెక్ట్ గెరాడ్ డకున్హాతో పరిచయం అయింది. ఇద్దరూ కొన్నాళ్లు ఢిల్లీలో, గోవాలో సహజీవనం చేశారు. తర్వాత విడిపోయారు. తిరిగి ఢిల్లీ వచ్చాక, 1984లో ఆమెకు ప్రదీప్ క్రిషన్ కలిశారు. ప్రదీప్కు సినిమాలు తీయాలని. ఈమెకు సమాజాన్ని మార్చాలని. ఇద్దరూ కలిసి సమాజాన్ని మార్చే సినిమా ఒకటి తీశారు. ‘మెస్సీ సాహిబ్’. దానికి అవార్డు వచ్చింది. అందులో అరుంధతి గొర్రెల కాపరిగా చిన్న పాత్ర వేశారు. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొద్దికాలానికే అరుంధతికి సినిమాలు, టీవీ సీరియళ్లు బోర్ కొట్టేశాయి. వాటిని వదిలేసి రకరకాల ఉద్యోగాలు చేశారు. ఏరోబిక్ క్లాసులు నడిపారు. ప్రదీప్తో విడిపోయారు. ఎక్కడా ఆమెకు సంతృప్తి లభించలేదు. బాల్యంలోని తన జ్ఞాపకాలను రాసుకుంటూ కూర్చున్నారు. ఆ జ్ఞాపకాలే చివరికి ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ అయ్యాయి. డబ్బు తెచ్చి పెట్టాయి. అరుంధతి ఆకాశంలోని ఒక నక్షత్రం. ఈ అరుంధతి మాత్రం భూమి మీది సెలయేరు. అచ్చం సెలయేరులానే ప్రవహిస్తోంది అరుంధతి జీవితం. ఎక్కడా ఆగింది లేదు. ఒకేలా సాగిందీ లేదు. అరుంధతి.. ఎన్డీటీవీ అధినేత ప్రణయ్ రాయ్ మేనకోడలు. ఉండడానికైతే ఇప్పుడు ఆమె ఢిల్లీలో ఉంటున్నారు కానీ, ఉన్నచోటైతే ఉండడం లేదు. ప్రపంచంలోని ప్రజాసమస్యలన్నీ ఆమెవే! ప్రపంచంలోని ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలన్నీ ఆమెకు శత్రువులే. నేనెందుకు తిరిగి ఇచ్చేశానంటే... (అరుంధతి రాయ్కి బుకర్ ప్రైజ్ కంటే ముందు 1989లో ‘ఇన్ విచ్ యానీ గివ్స్ ఇట్ దోజ్ ఒన్స్’ అనే టీవీ ఫిల్మ్కు బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డు వచ్చింది. దేశంలోని మతపరమైన అసహనంపై నిరసన వ్యక్తం చేస్తూ ఇటీవల ఆ అవార్డును ఆమె ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు.) మొదట నేనొక మాట చెప్తాను. ‘అసహనం’ అనేది చిన్నమాట. సాటి మనిషిని కొట్టి చంపడం, తుపాకీతో కాల్చేయడం, తగలబెట్టడం అనేవి అసహనం అనే మాట సరిపోనంత అమానుషమైనవి. రెండో మాట. ముందు ముందు మనం ఇంతకన్నా ఘోరమైన పరిణామాలను చూడ్డానికి సిద్ధం కావాలి! మెజారిటీ ఉన్న ప్రభుత్వం కదా, ఏమైనా జరగొచ్చు. దేశంలోని లక్షలాది మంది దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, క్రిస్టియన్లు.. భవిష్యత్తులో భయం నీడలో గడపవలసిన రోజులకు ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు సంకేతాలు. బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కూడా లేదు. ఘటనా స్థలం నుంచి నేరం జరిగిన ఆధారాలను సేకరించడం అంటే ఈ ప్రభుత్వానికి ఫ్రిజ్లో గొడ్డు మాంసం ఉందా లేదా అని చూడడం తప్ప, చావుదెబ్బలకు మరణించిన వ్యక్తి దేహాన్ని ఫోరెన్సిక్ పరీక్షకు పంపడం కాదు! ఈ ధోరణిపై దేశంలోని సృజనశీలురంతా...రచయితలు, సినీదర్శక నిర్మాతలు, విద్యావేత్తలు... కలిసి తమ అవార్డులు తిరిగి ఇచ్చేయడం ద్వారా తమ ధర్మాగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. వారికి మద్దతు పలకడం నా ప్రథమ ధర్మం. అందుకే నా అవార్డును తిరిగి ఇచ్చేయడం సబబు అనిపించింది. కోపం రాలేదంటే మనుషులం కాదని..! (నా జీవితమే నా సందేహం అని గాంధీజీ అన్నట్లు... అరుంధతి రాయ్ మాటలే ఆమె జీవనశైలి)ఉద్వేగాన్ని, కోపాన్ని, ఆగ్రహాన్ని ప్రదర్శించే శక్తిని కోల్పోయామంటే మనం మనుషులం కాదు. రోబోలం. నేను చేసేది చేస్తాను. నేను రాసేది రాస్తాను. ఏదీ లెక్కేసుకుని చేయను.నాకేం గొప్పదాన్నైపోవాలని లేదు. మనిషిగా నాకు ఉండాల్సిన స్వేచ్ఛ నాకు ఉంటే చాలు. ఇంకేదీ కోరుకోను. సంపద వద్దు. సత్కారాలు వద్దు. మావోయిస్టులంటే నాకు సానుభూతి ఉంది. అలాగని మావోయిస్టు సిద్ధాంతానికి మద్దతు ఇవ్వలేను. పెట్టుబడిదారీ విధానంలా చరిత్రలోని కమ్యూనిస్టు విధానాలు కూడా విధ్వంసకరమైనవే. -
మహాత్ముడిని తప్పుపట్టడం సరికాదు
పీవీ స్మారకోపన్యాసంలో రాజ్మోహన్గాంధీ గాంధీజీపై అరుంధతీరాయ్ రాసినవన్నీ అవాస్తవాలు చారిత్రక అంశాలను ఆమె వక్రీకరించారని విమర్శ సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ, అంబేద్కర్ వంటి ప్రఖ్యాత వ్యక్తుల మధ్య జరిగిన సంవాదం విషయంలో రచయిత్రి అరుంధతీ రాయ్ బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని గాంధీ మనవడు, ప్రముఖ రచయిత రాజ్ మోహన్గాంధీ ఆరోపించారు. మహాత్ముడిని తప్పుపట్టడం సరికాదని పేర్కొన్నారు. ఉపన్యాసాల కోసం అంబేద్కర్ తయారు చేసుకున్న ‘కుల నిర్మూలన’ పత్రాన్ని ఈ ఏడాది మార్చిలో ఒక సంస్థ పుస్తకంగా ప్రచురించగా... దానికి అరుంధతీరాయ్ ‘డాక్టర్ అండ్ సెయింట్’ పేరిట 153 పేజీల ముందుమాటను ప్రచురించారు. ఈ ముందుమాట వివాదాస్పదమైంది కూడా. ఆ ముందుమాటలోని పలు అంశాలను రాజ్మోహన్గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ అంశాలనే ఆదివారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ‘స్వాతంత్య్రం మరియు సామాజిక న్యాయం’ పేరిట జరిగిన పీవీ స్మారకోపన్యాసంలో రాజ్మోహన్ ప్రస్తావించారు. పీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అధ్యక్షత వహించగా.. పత్రికా సంపాదకులు, ప్రముఖులు కె.శ్రీనివాస్, తెలకపల్లి రవి, ఎమ్మెస్కో విజయ్ కుమార్ మాట్లాడారు. అవి చారిత్రక వాస్తవాలు కావు.. గాంధీజీలో ద్వంద్వ వైఖరి ఉందంటూ దళితుల హక్కుల పట్ల ఆయన చిత్తశుద్ధిని ప్రశ్నిస్తూ, దక్షిణాఫ్రికాలో ఉన్నపుడు మహాత్ముడు నల్ల జాతీయుల పట్ల సానుభూతి చూపలేదంటూ.. అరుంధతీరాయ్ చేసిన ఆరోపణలు అవాస్తవాలని రాజ్మోహన్గాంధీ తెలిపారు. గాంధీజీని చివరిదాకా బిర్లాలే పోషించారని రాయ్ చేసిన ఆరోపణలకు ఆధారాల్లేవన్నారు. గాంధీజీని అపఖ్యాతి పాలు చేసేందుకు పలు సందర్భాల్లో అంబేద్కర్ను అరుంధతీరాయ్ పావుగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. సత్యాగ్రహం విషయంలోనూ తప్పుపట్టడం సరికాదని, 1927లో జరిగిన ఈ సంఘటనలను కావాలనే రాయ్ మార్చారని చెప్పారు. రాయ్ రాతలకు స్ఫూర్తి ఎవరు, ఆమె ఎవరిని హీరోగా చేయాలనుకున్నారు, ఆమె ఆకాంక్ష ఏమిటో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాగా.. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని తన సంస్కరణలతో గట్టెక్కించిన వ్యక్తిగా పీవీ నర్సింహారావు చిరస్మరణీయుడని రాజ్మోహన్గాంధీ పేర్కొన్నారు. దక్షిణాది నుంచి కాంగ్రెస్ ప్రధానిగా పీవీ ప్రజలందరి మనసులో ఉంటారని, ఆయన స్మారకంగా ఉపన్యాసం చేసే అవకాశం రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. రెండు పుస్తకాల ఆవిష్కరణ.. రాజ్మోహన్ గాంధీ రాసిన ‘ఇండిపెండెన్స్ అండ్ సోషల్ జస్టిస్’ పుస్తకాన్ని సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వ్యక్తిత్వం గురించి సీనియర్ జర్నలిస్ట్ గోపరాజు నారాయణరావు రాసిన ‘లో లోపలి మనిషి’ పుస్తకాన్ని రాజ్మోహన్గాంధీ ఆవిష్కరించారు. పీవీ సంస్కరణలే ఆదర్శం.. పీవీ నర్సింహారావు చేపట్టిన సంస్కరణలను కాదన్న వాళ్లు అధికారం నుంచి తప్పుకున్నారని సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి పేర్కొన్నారు. ఆయన సంస్కరణలను కొనసాగిస్తూ.. దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కంకణం కట్టుకున్నారని చెప్పారు. ఆర్థిక సంస్కరణల ద్వారా సంపదను సృష్టించడాన్ని నేర్పిన, వెనుకబడిన తరగతులకు రాజకీయ అవకాశాలు కల్పించాలన్న మొదటి వ్యక్తి పీవీ నర్సింహారావు అని ప్రశంసించారు. సీనియర్ జర్నలిస్టు మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ... బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించడం ద్వారా పీవీ వేసిన బాటనే ఎన్టీ రామారావు కూడా ఎంచుకున్నారని చెప్పారు. దళితులు, బీసీల సంక్షేమం కోసం తన జీవితాన్ని పీవీ నర్సింహారావు ధారపోశారని ఆయన కుమార్తె వాణి అన్నారు. ఆయన సంస్కరణల ఫలితంగానే రైతుకూలీ యజమాని అయ్యాడని వ్యాఖ్యానించారు.