breaking news
Archaeological treasures
-
‘చరిత్ర’ను చదును చేసేశారు
► బృహత్ శిలాయుగం నాటి జనావాస ఆనవాళ్లు ధ్వంసం ► రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ శివార్లలో పురావస్తు సంపద ► ఆ రక్షిత ప్రాంతం సబ్స్టేషన్కు కేటాయింపు సాక్షి, హైదరాబాద్: ఉత్తర ఆఫ్రికాకు తెలంగాణకు సంబంధం ఏమైనా ఉంటుందా?.. మూడు వేల ఏళ్ల క్రితమే మధ్యధరా సముద్ర ప్రాంతం నుంచి తెలంగాణకు వలసలుండేవన్న విషయం తెలుసా?.. ఇనుముకు కార్బన్ను జోడిస్తే అది దృఢంగా మారుతుందన్న విషయాన్ని గుర్తించి దక్కన్ పీఠభూమి ప్రాంతంలో నివసించిన ఆనాటి వారు రెండున్నర వేల ఏళ్ల కిందే ఉక్కును రూపొందించారని తెలుసా?.. నిజమే ఇనుపయుగం నాటి మానవుల సమాధులున్న ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి, పరిశోధనలు చేసినప్పుడు బయటపడ్డ విషయాలివి. హైదరాబాద్ శివార్లలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పక్కనున్న కేతిరెడ్డిపల్లి గ్రామంలో ఈ పురాతన సంపద ఉంది. కానీ మూడు వేల ఏళ్ల నాటి పెద్ద జనావాసమున్న ఈ పురాతన సంపద ఆనవాళ్లు అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాశనమైపోయాయి. నిజాం హయాంలో గుర్తింపు కేతిరెడ్డిపల్లి గ్రామం వెలుపల వందల సంఖ్యలో బృహత్ శిలాయుగం నాటి సమాధులున్నాయి. నిజాం హయాంలో నాటి పురావస్తు నిపుణులు దీనిని గుర్తించారు. దాంతో ఈ ప్రాంతాన్ని పరిరక్షించాలని భావించిన నిజాం.. సమాధులు విస్తరించి ఉన్న దాదాపు 40 ఎకరాల స్థలాన్ని పురావస్తుశాఖకు అప్పగించారు. స్వాతంత్రం అనంతరం పురావస్తు శాఖ దానిని రక్షిత స్థలంగా ప్రకటిస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. పురావస్తు రక్షిత ప్రాంతంగా గుర్తిస్తూ 1953లో గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. భవిష్యత్తులో వాటిని తవ్వి సమాధుల్లో లభించే వస్తువుల ఆధారంగా పరిశోధనలు చేయాలని అప్పట్లో నిర్ణయించినా తర్వాత పట్టించుకోలేదు. ఆ స్థలం ప్రభుత్వ ఆధీనంలోనిదే కావడంతో అలాగే ఖాళీగా ఉండిపోయింది. సబ్స్టేషన్ కోసం ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ కారిడార్ నిర్మాణంలో భాగంగా.. హైదరాబాద్ శివార్లలో 400 కేవీ సామర్థ్యం గల సబ్స్టేషన్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ట్రాన్సకో మొయినాబాద్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని, అక్కడ స్థలం కావాలని రెవెన్యూ శాఖను కోరింది. దీంతో అధికారులు సరిగ్గా పురావస్తు సంపద ఉన్న చోటే 71 ఎకరాల స్థలాన్ని ట్రాన్సకోకు అప్పగించారు. ట్రాన్సకో రెండు నెలలుగా ఈ ప్రాంతాన్ని చదును చేసే పని చేపట్టింది. అక్కడ పురావస్తు సంపద ఉన్న విషయాన్ని రెండు శాఖలూ గుర్తించలేదు. ఈ క్రమంలో సమాధులకు గుర్తుగా భారీ రాళ్లతో వృత్తాకారంలో ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగించేశారు. కొన్ని వందల నిర్మాణాలు ధ్వంసమయ్యాక గ్రామస్తుల సమాచారంతో మేల్కొన్న పురావస్తు శాఖ అధికారులు... హడావుడిగా వెళ్లి పనులను ఆపివేయించారు. దీంతో 18 ఎకరాల ప్రాంతం మాత్రం మిగిలింది. ఇందులో ఉన్న కొన్ని సమాధులను పరిరక్షించాలని పురావస్తు శాఖ అధికారులు నిర్ణయించారు. -
రాష్ట్రానికి కన్నన్ సేవలు
♦ పురావస్తు సంపద వెలికితీతలో దిట్ట ♦ తమిళనాడులో త్వరలో పదవీ విరమణ చేయనున్న సీనియర్ ఐఏఎస్ ♦ రాష్ట్రంలో కన్సల్టెంట్గా నియమించేందుకు సన్నాహాలు సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలోనే అద్భుతమనదగ్గ చక్రాకార బౌద్ధస్తూపం ఎక్కడుందో తెలుసా...? అది మన రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో భూమిలో కూరుకుపోయి మగ్గుతోంది. దాదాపు 180 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ స్థూపాన్ని ఇంతవరకు వెలికి తీయలేదు. శాతవాహనకాలం కంటే దాదాపు రెండు శతాబ్దాలకుముందే అద్భుత పట్టణంగా విలసిల్లిన నాటి రాజధాని నగరం కోటిలింగాల. ఆ రాజధాని అందాలన్నీ భూగర్భంలో పదిలంగా ఉన్నాయి. వాటిని చూసే భాగ్యం ఇంకా మనకు దక్కలేదు. ఇలాంటి అద్భుత చారిత్రక ఔన్నత్యాన్ని భావితరాల కళ్లముందుంచాలంటే శాస్త్రీయ పద్ధతిలో తవ్వకాలు జరగాల్సి ఉంది. కానీ అంత సామర్థ్యం ప్రస్తుతం మన పురావస్తు శాఖకు లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు సిద్ధమవుతోంది. పురావస్తు సంపదను వెలుగులోకి తేవటంలో ప్రత్యేక నిపుణుడిగా ముద్రపడ్డ డాక్టర్ కన్నన్ సేవలను తీసుకోబోతోంది. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి త్వరలో పదవీవిరమణ చేయబోతున్నారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కన్సల్టెంట్గా సేవలందించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ఆయనతో సంప్రదించింది. తంజావూరు చిత్రాలు, కుంభకోణం దేవాలయాలు... ఇలా తమిళనాట ఎన్నో చారిత్రక అద్భుతాలను వెలికితీసి కళ్లముందు నిలపటంలో ఆయన కృషి ఎనలేనిది. దాదాపు 15 సంవత్సరాలుగా పురావస్తు శాఖను పర్యవేక్షిస్తున్న ఆయన అక్కడి పర్యాటకరంగ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. చారిత్రక అద్భుతాలున్నాయని రూఢీ అయితే చాలు శాస్త్రీయ పద్ధతిలో తవ్వకాలు జరిపి వాటిని వెలుగులోకి తెచ్చేందుకు ఆయన పట్టుదలగా పనిచేస్తారన్న పేరుంది. ఇప్పుడు పదవీ విరమణ ముంగిట ఉన్న ఆయన సేవలను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి తవ్వకాలతో అద్భుత విశేషాలు వెలుగులోకి దేశంలో గొప్ప బౌద్ధ స్తూపాలు, ఆరామాలకు బిహార్, ఉత్తరప్రదేశ్ తర్వాత తెలంగాణ రాష్ట్రమే ప్రసిద్ధి గాంచింది. మెదక్ జిల్లా కొల్చారం, కొండాపూర్, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, ఫణిగిరి, నల్లగొండ జిల్లా చాడ, నాగార్జునసాగర్ పరిసరాలు... ఇలా ఎన్నో ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాల్లో కొంతమేర మాత్రమే తవ్వకాలు జరిగాయి. అవి పూర్తిచేస్తే ఎన్నో అద్భుత విశేషాలు వెలుగుచూస్తాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అందుకు సరైన మార్గనిర్దేశకత్వం అవసరం. దాన్ని కన్నన్లాంటి వారితో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన స్వదేశీ దర్శన్, ప్రసాద్ పథకాల ద్వారా వీటికి నిధులు తెచ్చే ప్రయత్నంలో ఉన్న ప్రభుత్వం ఇటీవలే మహబూబ్నగర్ జిల్లాకు రూ.95 కోట్లు సాధించింది. వచ్చే సంవత్సరం బద్ధిస్ట్ సర్క్యూట్ కోసం కనీసం రూ.100 కోట్లు పొందే ప్రయత్నం చేస్తోంది. అప్పటికల్లా ఓ రూట్ మ్యాప్ను సిద్ధం చేయబోతోంది. దానికి డాక్టర్ కన్నన్ నేతృత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.