breaking news
Adusumilli jayaprakash ready
-
అడుసుమిల్లి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, విజయవాడ: ఇటీవల కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా జయప్రకాశ్ చిత్రపటానికి పూలు సమర్పించి, నివాళులర్పించారు.విజయవాడ మొగల్రాజపురంలోని జయప్రకాష్ నివాసానికి వెళ్ళిన వైఎస్ జగన్.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. జయప్రకాష్ కుమారుడు తిరుమలేష్తో పాటు, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జయప్రకాష్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ క్రమంలో మాజీ శాసనసభ్యుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా జయప్రకాష్ తనదైన ముద్ర వేసుకున్నారని వైఎస్ జగన్ గుర్తుచేసుకున్నారు. మరోవైపు.. అడుసుమిల్లి ఇంటికి వైఎస్ జగన్ వస్తున్నారన్న సమాచారంతో భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ అభిమానులు జయప్రకాశ్ ఇంటి వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నేత జగనన్నకు ఘన స్వాగతం పలికారు. -
తెలుగువారి ఆగ్రహం ప్రమాదకరం
విజయవాడ, న్యూస్లైన్: తెలుగువారి ఆగ్రహం చాలా ప్రమాదకరమని పలువురు వక్తలు పేర్కొన్నారు. తెలంగాణ విభజనవాదులు చెబుతున్నవన్నీ అవాస్తవాలు, వక్రీకరణలేనని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత అడుసుమిల్లి జయప్రకాష్ రచించిన ‘ధర్మాగ్రహం’ పుస్తకం గణాంకాలతో రుజువు చేస్తోందన్నారు. పీవీపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సభలో ధర్మాగ్రహం పుస్తకాన్ని సీనియర్ జర్నలిస్టు సి.రాఘవాచారి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలవారికి సమస్యలు ఉన్నాయని, అందర్నీ ఒకచోటకు చేర్చి సమస్యను పరిష్కరించాలే గానీ, విభజనకు ఇది సమయం కాదని చెప్పారు. విభజన ద్వారా వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనేది అపోహ మాత్రమేనని స్పష్టంచేశారు. గ్రంథ రచయిత అడుసుమిల్లి జయప్రకాష్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజన దేశ విచ్ఛినానికి దారితీసే ప్రమాదం తలెత్తుతుందని హెచ్చరించారు. 2009 డిసెంబర్ 9న రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన తర్వాత తాను అన్నిశాఖల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఈ పుస్తకం రూపొందించినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి. కోటేశ్వరమ్మ, పీవీపీ ఫౌండేషన్ సీఈఓ పీవీ ప్రసాదరావు, ప్రముఖ వైద్యుడు కామినేని పట్టాభిరామయ్య, రిటైర్డ్ న్యాయమూర్తి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఓటమి కాదు... ఎదురు దెబ్బే...
ఆంధ్రప్రదేశ్ సహా, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది తెలుగు ప్రజలు మనస్తాపానికి గురైన రోజు... కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయం ప్రక టించిన రోజు. తద్వారా వచ్చే పరిణామాలను అంచనా వేయ కుండా, అనాలోచితంగా, అన్యా యంగా, నిర్దాక్షిణ్యంగా రాజ కీయ లబ్ధి కోసమే కేంద్రం ఆ ప్రకటన చేసింది. రాజకీయంగా ఇతర పార్టీలను దెబ్బ తీయాలన్న కాంగ్రెస్ ఢిల్లీ సుల్తానుల పన్నాగానికి తెలుగు వారు బలయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు బీజం పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సింహావలోకనం చేసుకుంటే ప్రస్తుతం తెలుగు ప్రజలపై ఎంతటి ప్రాణాంతక కుట్ర జరుగు తున్నదో తెలుస్తుంది. అందరి అభీష్టంతోనే... 1913లో బాపట్ల నుంచి ప్రస్థానం ప్రారంభించిన ఆంధ్ర మహాసభ ఉద్యమం మలుపులు తిరుగుతూ, ఎన్నో ప్రాణ త్యాగాలతో 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణను సాధ్యం చేసింది.. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో అటు ఆంధ్ర ప్రాంత శాసనసభ్యులు, ఇటు హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ్యుల్లో 2/3 వంతు సభ్యులు ఆంధ్రప్రదేశ్ వైపే మొగ్గారు. కె.వి. రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి వంటి కొంత మంది విభజన వాదం వినిపించినా, తొలి ప్రధాని జవ హర్లాల్ నెహ్రూ కలుగజేసుకొని సమన్వయపరిచారు. దానితో వారు కూడా సమైక్య రాష్ట్రానికి అనుకూలుర య్యారు. అయితే 1957లో జరిగిన ఎన్నికలలో విభజన వాదులు ఘోర పరాజయాన్ని చవిచూశారు. అటుపై 1968వ సంవత్సరం వరకు ఎటువంటి ఉద్యమాలు, ఆం దోళనలు జరగలేదు. కనీసం బంద్ పిలుపులు కూడా లేవు. ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. సానుకూల కోణం ఏదీ? 1969లో మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో కేవలం 10 నెలలు ఉద్యమం జరిగింది. అనంతరం 2000వ సంవత్సరం వరకు తెలంగాణ ఊసే లేదు. నిరాశా, నిస్పృహలతో ఉన్న కొంత మంది నాయకుల ద్వారా మాత్రమే తెలంగాణ డిమాండ్ ఊపిరి పోసుకుంటున్నది. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు 2000- 2001 సంవత్సరాలలో మంత్రి పదవి ఇవ్వని ఒకే ఒక కారణంతో కేసీఆర్ తన అసంతృప్తి నుంచి మళ్లీ తెలంగాణ అంశాన్ని తెరపైకి తెచ్చారు. వైఎస్ హయాంలో... 2004 నుంచి 2009 ఎన్నికల తరువాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అన్ని ప్రాంతాలలో పరిస్థితులను పూర్తిగా అదుపులో ఉంచారు. ఆయన బతికి ఉన్నంత కాలం ప్రత్యేక తెలంగాణ అంటూ ఎవరూ మాట్లా డలేదు. అయితే వైఎస్ సాధించిన అపూర్వ విజయాలను ఆయన మరణించిన నాలుగేళ్లలోనే నిష్క్రియాపరత్వానికి మారు పేరుగా మారిన మన పరిపాలనా యంత్రాంగం నిష్ఫలం చేయగలిగింది. మానని గాయాలను మాన్పిం చిన మన కాలపు ధన్వంతరి డాక్టర్ వైఎస్. వైఎస్ రాజకీయ వైద్యశాలలో చికిత్సకు అవకాశం లేని మొండివ్యాధి లేనే లేదని రుజువైంది. కేంద్రం తెలంగాణ విషయంలో నిర్ణ యం తీసు కోవాలని చెప్పిన సందర్భంలో కూడా ఆయన నిర్ద్వంద్వంగా, నిర్దిష్టంగా తన నిర్ణయాన్ని ప్రజల ఆకాం క్షను ఢిల్లీ పెద్దలకు నయాన భయాన చెప్పి ఒప్పించార నడం నిర్వివాదాంశం. వైఎస్ మరణానంతరం పరిస్థితులు పూర్తిగా మారిపో యాయి. ఎటువంటి ఒత్తిడులు లేకపోయినా 2009 డిసెం బర్ 9 రాత్రి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తరఫున చిదంబరం చేసిన తెలంగాణ ప్రకటన తెలుగు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. కొన్ని గంటల వ్యవధిలో సమై క్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి, ఉగ్రరూపం దాల్చ డంలో కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మాత్రం విభజనకు నిశ్శబ్దంగా పావులు కదుపుతూనే ఉంది. ఫలితంగా ఇప్పు డు మరోసారి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ సుల్తానులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు తెగించారు. గతంలో 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటన సమ యంలో అన్ని పార్టీల నాయకులు తిరగబడటంతో కేంద్రం వెనక్కితగ్గింది. ఈసారి వ్యూహాత్మకంగా వివిధ పార్టీల నాయకులు తిరగబడలేని విధంగా అదనుచూసి దెబ్బ కొట్టింది కాంగ్రెస్. కాని అనూహ్యంగా ఈసారి తెలుగు ప్రజలే అప్రతిహతంగా మహోగ్ర ఉద్యమాన్ని అత్యంత శాంతియుతంగా నిర్వహిస్తున్నారు. గాంధీ మార్గంలోనే... నిజానికి ప్రజాస్వామిక పోరాటాల శక్తి ప్రజల సంకల్ప బలంలో ఉంది. విభజన ప్రకటనతో తెలుగు ప్రజలు ఐక్యంగా గాంధీ చూపిన మార్గంలో ఉద్యమిస్తున్నారు. అన్ని ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు, న్యాయవా దులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఆటోమొబైల్ సంఘాలు ఇంకా ఎన్నో సంఘాలు ఐకమత్యంతో గాంధీ చూపిన శాంతి మార్గంలో నడుస్తున్నందుకు ఈ సందర్భంగా అందరినీ పేరు పేరునా అభినందించాల్సిందే. ఢిల్లీ మెడలు వంచాలి... ఇప్పటి వరకూ జరుగు తున్న పరిణామాలు తెలుగుజాతికి తగిలిన ‘ఎదురు దెబ్బలే’. కాని ఓటమి కాదు. ఇక ముం దు కూడా సహాయ నిరాకరణ, శాంతి, సంయమనం పాటిస్తూ పోరు సల్పితే అతి త్వరలో విజయం ఖాయం. ఢిల్లీ సుల్తానుల మెడలు వంచి అనుకున్నది సాధిద్దాం. అదే జరిగితే భారతదేశం మొత్తం తెలుగు జాతికి రుణపడి ఉంటుంది. ఎందుకంటే ఇకముందు భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని అన్యాయంగా, అనాలోచితంగా విభజించడానికి కాంగ్రెస్ ఢిల్లీ సుల్తానులు సాహసించరు. రాజకీయ రంగం లోనే కాదు, ఏ రంగంలోై నెనా సంకల్పబలం ప్రధానం. ప్రజల మహాసంకల్పం ముందు ఏదీ నిలబడదు. తెలం గాణ విషయంలో కేంద్రం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం కూడా అంతే. కేంద్రాలు, రాష్ట్రాలు కాదు. ప్రజలే అంతిమ నిర్ణాయక శక్తులు. తెలంగాణ రాష్ట్రం అనేది మెజారిటీ ప్రజల తీర్పు కాదు. -అడుసుమిల్లి జయప్రకాష్, మాజీ శాసన సభ్యులు