రోహిత్‌ వేములకు మళ్లీ అన్యాయం | opinion on rupanvala commission over vemula rohit suicide by Dr. sripathi ramudu | Sakshi
Sakshi News home page

రోహిత్‌ వేములకు మళ్లీ అన్యాయం

Oct 8 2016 1:47 AM | Updated on Sep 4 2017 4:32 PM

రోహిత్‌ వేములకు మళ్లీ అన్యాయం

రోహిత్‌ వేములకు మళ్లీ అన్యాయం

రోహిత్‌ వేముల కులశోధన తన పరిధికి సంబంధించనప్పటికీ అతడి కుల నిర్ధారణే కీలకంగా రూపన్‌ వాలా కమిషన్‌ తన నివేదికను సమర్పించడం దళితులను రగిలిస్తోంది.

సందర్భం
రోహిత్‌ వేముల కులశోధన తన పరిధికి సంబంధించనప్పటికీ అతడి కుల నిర్ధారణే కీలకంగా రూపన్‌ వాలా కమిషన్‌ తన నివేదికను సమర్పించడం దళితులను రగిలిస్తోంది. కేంద్రమంత్రులను, వర్శిటీ అధికారులను ఒక్క దెబ్బతో నిర్దోషులను చేసిపడేసిన అసలైన మెజారిటీ కుల న్యాయమిది.

రోహిత్‌ వేముల మరణానికి కారణాల కంటే అతని కులమే పాలకులకి ప్రధానమైన విష యంగా మారటానికి కారణం, ఆ కేసులో నింది తులను తప్పించటానికేనని దేశంలోని దళితులం దరి అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే రోహిత్‌ దళితుడు కాదని చెప్పిన రూపన్‌వాలా కమిషన్‌ రిపోర్టు దళితుల్లో పలు అనుమానాలను కలిగి స్తోంది. పాలకుల అభీష్టాన్నే ఆ కమిషన్, రిపోర్టు రూపంలో బయటపెట్టిందన్న చర్చ మొదలైంది.
రూపన్‌వాలా దళితుడు కానందువల్ల రోహిత్‌కు న్యాయం జరిగే అవ కాశం లేదని అందుచేత కనీసం మరో దళితుడ్ని ఆ కమిటీలో సభ్యునిగా చేర్చాలని అనేక దళిత సంఘాలు దేశవ్యాప్తంగా డిమాండ్‌ చేశాయి. దళి తులు ఊహించినట్టుగానే అలహాబాద్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎ.కె. రూపన్‌వాలా ఏక సభ్య కమిషన్‌ రోహిత్‌ దళితుడు కాదని చెప్పింది. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదనే సామెతకి ఈ కమిషన్‌ని ఉదాహరణగా పేర్కొనవచ్చు.

అసలు రోహిత్‌ దళితుడో కాదో చెప్పమని రూపన్‌వాలా కమిషన్‌ని మానవ వనరుల శాఖ అడగలేదు. రూపన్‌వాలా కమిషన్‌కి పరిశీలిం చమని చెప్పిన అంశాలు... ఒకటి, రోహిత్‌ చావుకి కారణమైన అంశాలను కనుగొనటం. యూనివర్శిటీలో కులవివక్ష ఉందా లేదా అని తెలుసు కోవడం, రోహిత్‌ ఆత్మహత్యకు ప్రేరణలో అప్పటి హెచ్‌.ఆర్‌.డి మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ప్రమేయం ఉందా లేదా చెప్పడం. భవిష్యత్తులో రోహిత్‌ చావుకి కారణమైన పరిస్థి తుల్ని నివారించే సూచనలు చెయ్యటం. అయితే రూపన్‌వాలా కమిషన్‌ మాత్రం తన పరిధిలో లేని అంశమైనటువంటి రోహిత్‌ దళితుడా? కాదా? అనే విషయం మీదనే ఎక్కువ ఆసక్తి చూపించినట్టు తెలుస్తుంది. ఈ ఆసక్తికి వెనుక ఏదో కుట్ర ఉందని దళితుల అనుమానం.

అసలు రోహిత్‌ దళితుడో కాదో నిర్ణయించే అంశం ఆ కమిషన్‌కిచ్చిన సూచనల్లో (terms of reference)లో లేదు. అది జిల్లా రెవెన్యూ శాఖ పరిధిలో ఉంటుంది. గత నెలలోనే జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్‌ కలెక్టర్‌ని విచారించిన పిమ్మట రోహిత్‌ దళితుడేనని తేల్చి చెప్పింది. ఇక ఈ విషయం మీద చర్చోపచర్చల్ని ఆపెయ్యాలని సూచించింది. ఈ సంద ర్భంలో తన పరిధిలో లేని రోహిత్‌ కులాన్ని గురించి రూపన్‌వాలా కమిషన్‌ అత్యుత్సాహం ప్రదర్శించటం ఈ కేసులో నిందితులకు ఊరట కలిగించటా నికేనని దళిత సంఘాల ఆందోళన.

రూపన్‌వాలా కమిషన్‌ కంటే ముందు రోహిత్‌ మరణానికి కారణాలు కనుగొనాలని మానవ వనరుల శాఖ ద్విసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ యూనివర్శిటీలో పరిస్థితులను పరిశీలించి రోహిత్‌ మరణానికి యూనివర్శిటీ అనుసరించిన అనేక అవకతవకలు  (Procedural Laps), దళితులకి యూనివర్శిటీ పాలనా వ్యవస్థ మీద నమ్మకం కొరవడిన పరిస్థితి (Trust defict) అని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో రూపన్‌వాలా కమి షన్‌ రిపోర్టు రోహిత్‌ మరణం అతని వ్యక్తిగతమని చెప్పటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? పార్లమెంటులో మాయావతి ఈ కమిషన్‌లో మరో దళిత సభ్యుణ్ణి చేర్చాలని డిమాండ్‌ చేసిన తరువాత కూడా అది జరగక పోవడం దళితుల్లో పలు అనుమానాలు రేకెత్తించింది.
హైదారాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో దళితుల్ని వేధించే కంటే వారిని ఉద్దేశిస్తూ, తమకు కాస్త విషంగానీ, ఉరివేసుకోవటానికి తాడుగానీ ఇవ్వమని రోహిత్‌ వేముల గత డిసెంబర్‌‡18న వైస్‌చాన్స్‌లర్‌కి రాసిన ఉత్తరాన్ని రూపన్‌వాలా కమిషన్‌ పరిగణనలోనికి తీసుకోకపోవడం తీవ్రంగా గర్హించదగిన విషయం. రోహిత్‌ చావుకి కారణాల్ని అతన్ని సస్పెండ్‌ చేసినప్పటి నుంచి అతను వెలివాడలో నిరసనకి కూర్చోవటం, వైస్‌ఛాన్సలర్‌కి డిసెంబర్‌ 18న రాసిన ఉత్తరం మొదలైన అంశాల నేప థ్యంలో పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలన్నింటినీ వదిలివేసి కేవలం ఆ కేసులో పేర్లున్న వారికి అనుకూలమైన అంశాల్నే కమిషన్‌ బయటకు తీసినట్లు దళితుల్లో అనుమానాలు ప్రబలుతున్నాయి.
గత ఆగస్టులో మంజూషారెడ్డి కేసులో హైదరాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా రూపన్‌వాలా కమిషన్‌ గౌరవించినట్టు కనపడలేదు. ఈ కేసులో తీర్పునిస్తూ జస్టిస్‌ రామ్‌సుబ్రమణ్యం, జస్టిస్‌ అనీ  ఒక వ్యక్తి పెరిగిన పరిస్థితులు  (Circumstances) అతడు దళితుడా కాదా అని నిర్ణ యిస్తాయని కూడా చెప్పారు. ఈ జడ్జిమెంట్‌ ప్రకారంగా రోహిత్‌ దళితుడు కాదని ఎవరికీ అనుమానంలేదు. కానీ రూపన్‌వాలా దీన్నికూడా పట్టించు కోకపోవడాన్ని ఎలా చూడాలి?

రోహిత్‌ మృతికి సంబంధించి ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని అమలు చేయకపోవటం, యూనివర్శిటీలో దళితుల్ని వేధించటం కొనసా గించడాన్ని దేశంలోని దళితులందరి పరిశీలనలో ఉంది. రోహిత్‌ కేసు మీద హైకోర్టులో ఇంకా వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కమిషన్‌ ఇచ్చిన రిపోర్టు కేసుని వివిధ స్థాయిల్లో ప్రభావితం చేõ¯  అవకాశాలు లేకపోలేదు. రోహిత్‌ మరణం తర్వాత దేశవ్యాప్తంగా రగిలిపోతున్న దళితుల్లో ఈ కమిషన్‌ అగ్నికి ఆజ్యం పోసినట్టు చేసిందని భావించటంలో ఏమాత్రం సందేహం లేదు.

‘ఈ యూనివర్శిటీలో మనిషిని మనిషిగా చూడటం లేదు. నా పుట్టు కను చూస్తున్నారు. కులంపేరుతో ఇంకా ఎన్నాళ్లు చూస్తారు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చా... నా పుట్టుక తప్పా లేక సేవాకులంలో పుట్టడం తప్పా’ అని ఆత్మహత్యా నోట్‌లో పేర్కొన్న రోహిత్‌ వేదనను ఈ దేశం ఇంకా మర్చిపోలేదు. రోహిత్‌ సూసైడ్‌ నోట్‌ను దేశంలోని పత్రికలన్నీ ప్రచురించడమే కాక రోహిత్‌ ఆత్మహత్య వెనుక దత్తాత్రేయ, స్మృతి ఇరానీ చర్యలు దోహదం చేసినట్లుగా అభిప్రాయం వ్యక్తం చేశాయి కూడా. స్పష్టంగా చెప్పాలంటే హత్యాచార చట్టం కింద కేసులు నమోదైనా, మంత్రులను, వర్శిటీ అధికారులను కాపాడే ప్రయత్నాన్ని ఈ నివేదిక విజయవంతంగా నెర వేర్చిందనే చెప్పాలి.

అధికారంలో ఉన్నవారు వ్యవస్థని, దాన్లోని సంస్థల్ని దుర్వినియోగం చేస్తే మొత్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కేవలం డబ్బు, కులం, అధికారమే న్యాయాన్ని నిర్ణయించేటట్లయితే  ఆ న్యాయం ఎప్పటికీ అన్యాయమే అవుతుంది. కేవలం మంది బలమే న్యాయాన్ని నిర్ణయిస్తే  ‘‘కమ్యునల్‌ మెజారిటీ’’ ఎప్పుడూ దళితులకు న్యాయం చేయదని, ఆ మెజారిటీ కుల సామ్యంతో కూడికున్న మెజార్టీ అని అంబేడ్కర్‌ చెప్పిన సత్యం మరొక్కసారి రుజువవుతోంది.



(వ్యాసకర్త   డా.శ్రీపతి రాముడు అసోసియేట్‌ ప్రొఫెసర్, రచయిత, HCU ఎస్సీ, ఎస్టీ ఫ్యాకల్టీ ఫోరమ్‌ సభ్యుడు ‘ మొబైల్‌ : 99638 46163 )

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement