ఈజిప్టులో ఆత్మాహుతి దాడి, 9 మంది మృతి | Suicide Bombs Hit Egypt Military in Sinai, Kill 9 | Sakshi
Sakshi News home page

ఈజిప్టులో ఆత్మాహుతి దాడి, 9 మంది మృతి

Sep 11 2013 10:24 PM | Updated on Nov 6 2018 8:35 PM

ఈజిప్ట్‌లోని సినాయ్ ప్రాంతంలో సైనిక స్థావరాలు లక్ష్యంగా బుధవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో తొమ్మిది మంది సైనికులు మరణించారు.

ఈజిప్ట్‌లోని సినాయ్ ప్రాంతంలో సైనిక స్థావరాలు లక్ష్యంగా బుధవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో తొమ్మిది మంది సైనికులు మరణించారు. 17 మంది గాయపడ్డారు. వీరిలో పదిమంది సైనికులు, ఏడుగురు పౌరులున్నారని భద్రతా అధికారులు తెలిపారు. గాయపడిన పౌరుల్లో ముగ్గురు మహిళలని వివరించారు. పేలుడు పదార్థాలతో కూడిన కార్లతో ఆత్మాహుతి బాంబర్లు ఈ విధ్వంసానికి పాల్పడ్డారు.

ఒక ఆత్మాహుతి బాంబర్ రఫా పట్టణంలోని సైనిక ఇంటెలిజెన్స్ స్థానిక కార్యాలయమున్న రెండంతస్తుల భవనంలోకి దూసుకుపోవడంతో అది పూర్తిగా ధ్వంసమైంది. సమీపంలోని మరో ఐదు ఇళ్లు కూడా బాగా దెబ్బతిన్నాయి. మరో ఆత్మాహుతి బాంబర్ ఆర్మీ చెక్‌పాయింట్‌ను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డాడు.

వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండో దాడి ఇది. గతవారం తూర్పు కైరో జిల్లాలోని తన నివాసం నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈజిప్ట్ అంతర్గత మంత్రి మహమ్మద్ ఇబ్రహీంపై ఆత్మాహుతి కారు బాంబు దాడి జరగ్గా.. ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈజిప్ట్‌లో రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో జరిగిన తాజా ఆత్మాహుతి దాడులతో సినాయ్ ప్రాంతంలో పరిస్థితి మరింత క్షీణించింది.

Advertisement
 
Advertisement
Advertisement