పాక్‌తో ఘర్షణపై ఏం చేద్దాం? | Sonia Gandhi asked President Pranab suggestions on Pakistan Issue | Sakshi
Sakshi News home page

పాక్‌తో ఘర్షణపై ఏం చేద్దాం?

Aug 19 2013 4:13 AM | Updated on Sep 1 2017 9:54 PM

భారత్, పాకిస్థాన్‌ల మధ్య నియంత్రణ రేఖ వెంబడి తలెత్తుతున్న ఘర్షణలు, భారత సైనికుల హత్యల అంశంపై చర్చించేందుకుగాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్‌ల మధ్య నియంత్రణ రేఖ వెంబడి తలెత్తుతున్న ఘర్షణలు, భారత సైనికుల హత్యల అంశంపై చర్చించేందుకుగాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ సమావేశమయ్యారు. భారత సైనికుల హత్యలపై బీజేపీ నేతృత్వంలోని ప్రతిపక్షం అధికార కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న నేపథ్యంలో సోనియా ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రపతిని కలిసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతితో సుమారు గంటన్నరపాటు సమావేశమైన సోనియా జాతీయ ప్రాముఖ్యం గల పలు అంశాలపై చర్చించా రు.
 
 వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నియంత్రణ రేఖ వద్ద పరిస్థితి దిగజారుతుండటంపై సోనియా ఆందోళన వ్యక్తంచేశారని తెలుస్తోంది. అదేవిధంగా పాకిస్థాన్‌పై కఠిన వైఖరి అవలంబించాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా న్యూయార్క్‌లో జరగబోయే భారత్, పాక్ ప్రధానమంత్రుల భేటీపై ఆలోచించాలని కూడా కాంగ్రెస్ భావిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పాక్ పట్ల ప్రధాని వైఖరి అంత కఠినంగా లేకపోవడంపై కూడా సోనియా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ పార్లమెంటు చేసిన తీర్మానానికి ప్రతిగా భారత్ కూడా పార్లమెంటు ఉభయసభల్లో తీర్మానం ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement