స్కూల్ నిర్లక్ష్యానికి.. భారీ జరిమానా

స్కూల్ నిర్లక్ష్యానికి.. భారీ జరిమానా - Sakshi


బీజింగ్:

స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి చైనాలోని కోర్టు భారీ జరిమానా విధించింది. వివరాలు.. 2012లో బీజింగ్లో ఉన్న క్విన్ ఫాంగ్ ప్రైమరీ స్కూల్లో తరగతిగదులను డెకరేట్ చేశారు. ఆరునెలల తర్వాత లీ(11) అనే బాలిక పాదాల మీద ఎరుపు రంగులో ఉన్న మచ్చలు వచ్చాయి. దీంతో డాక్టర్లను సంప్రదించగా రక్తకణాలు, ఎముకలోని మజ్జ ఉత్పత్తిపై ప్రభావం చూపించే అప్లాస్టిక్ ఎనీమియా వ్యాధి సోకినట్టు నిర్ధారించారు. అత్యంత భయంకరమైన ఈ వ్యాధికి కారణం పెయింటింగ్, డెకరేషన్లకు వాడిన విషపూరితమైన రసాయనాలే అని నిర్ధారణ అయింది.  



ఆ తర్వాత ఎనిమిది నెలలకే లీ మృతిచెందింది. బాలిక మరణానికి, పాఠశాలకు ఎలాంటి సంబంధం లేదని యాజమాన్యం తెలిపింది. తమ కూతురు మరణంతో కుంగిపోయిన లీ కుటుంబసభ్యులు స్కూలు యాజమాన్యం తీరుపై కోర్టును ఆశ్రయించారు. అయితే స్కూల్ డెకరేషన్ పనులను బయటవారికి ఔట్ సోర్సింగ్కు ఇచ్చినట్టు యాజమాన్యం కోర్టుకు తెలిపింది. తమకు బాలిక మరణానికి ఎలాంటి సంబంధంలేదని విన్నవించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం బాలిక మృతికి స్కూల్ యాజమాన్యానిదే బాధ్యత అని పేర్కొంది. బాలిక వ్యాధికి కారణం పెయింటింగ్, డెకరేషన్ సమయంలో వాడిన విషపదార్థాలు అని తేలింది. దీంట్లో స్కూల్ యాజమాన్యం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది అని ధర్మాసనం తెలిపింది. స్కూల్ నిర్లక్ష్యానికి దాదాపు 42 లక్షల రూపాయల ఫైన్ను కోర్టు విధించింది.


Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top