
'ముగిసిన టూర్.. స్వదేశానికి మోదీ'
ప్రధాని నరేంద్రమోదీ తిరిగి స్వదేశానికి బయలుదేరారు. విజయవంతంగా ఐదు రోజుల అమెరికా పర్యటనను ముగించుకొని వస్తున్నారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ తిరిగి స్వదేశానికి బయలుదేరారు. విజయవంతంగా ఐదు రోజుల అమెరికా పర్యటనను ముగించుకొని వస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సర్వసభ్య సమావేశానికి ప్రధాని మోదీ న్యూయార్క్ వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన ఐర్లాండ్ ప్రధానితో తొలుత భేటీ అయ్యి అనంతరం నేరుగా కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీకి వెళ్లారు. అక్కడ ఫేస్ బుక్ అధినేత జూకర్ బర్గ్ను కలిసి, ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడమే కాకుండా గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్తో భేటీ అయ్యారు.
డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రత్యేకతను అటు జూకర్ బర్గ్కు, సుందర్ పిచాయ్కు తెలియజేయడమే కాకుండా వారి సంపూర్ణ మద్దతు కోరి ఆ ప్రయత్నంలో విజయం సాధించారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయ్యి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. భారత్కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి మద్దతు కోరగా అందుకు ఒబామా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ ఆయనకు ధన్యవాదాలు కూడా తెలిపారు.
మొత్తానికి అంతర్జాతీయ వేదికల్లో మోదీ మరోసారి భారత్ ఘనతను గట్టిగానే చాటి చెప్పారు. భారత్ అభివృద్ధిలో దూసుకెళుతున్న తీరు, ఆహ్వానిస్తున్న మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం సాధిస్తున్న తీరు, పర్యావరణ హితమైన కార్యక్రమాలు, రక్షణ సంబంధ అంశాలు, ఉద్యోగాల కల్పన, ముఖ్యంగా అంతర్జాతీయంగా ఇరు దేశాలమధ్య ఉన్న సహకారం, శాంతి, యుద్ధ పరిణామం తదితర అంశాలను వివరించారు. ఈ టూర్ సందర్భంగా ఆయన పలువురు దేశాల ప్రధానులను, అధ్యక్షులను కలిశారు.