షరియత్‌ చట్టాల్లో మార్పులను సహించం  | womens representatives fires on sharia laws changes | Sakshi
Sakshi News home page

షరియత్‌ చట్టాల్లో మార్పులను సహించం 

Feb 5 2018 3:21 AM | Updated on Sep 2 2018 5:20 PM

womens representatives fires on sharia laws changes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇస్లామీ షరియత్‌ చట్టాల్లో మార్పుల్ని దేశంలో ప్రతి ముస్లిం మహిళా వ్యతిరేకిస్తోందని ప్రొఫెసర్‌ అష్రఫ్‌ రఫీ చెప్పారు. ముస్లిం మహిళల వ్యక్తిగత, సామూహిక, దాంపత్య జీవితం కోసం ఖురాన్, మహ్మద్‌ ప్రవక్త ప్రవచనాల ఆధారంగా రూపొందించిందే షరియత్‌ చట్టమని ఆమె పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌ ఖిల్వత్‌లో ఉర్దూ మస్కాన్‌లో జమియతుల్‌ మొమినాత్‌ మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘షరియత్‌ చట్టాలు.. ట్రిపుల్‌ తలాక్‌’ అంశంపై ఒక రోజు సదస్సు ఏర్పాటు చేశారు.

ఇందులో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన పలువురు మహిళా ధార్మికవేత్తలు పాల్గొన్నారు. ట్రిపుల్‌ తలాక్‌పై కేంద్రం రూపొందించబోతున్న చట్టంతో మహిళలకే ఎక్కువ నష్టం జరుగుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. పెళ్లి అనేది ఒక పవిత్ర బంధమని.. భార్యాభర్తల మధ్య తగాదాలొస్తే ఇరు పక్షాలవారు సయోధ్య చేయాల్సింది పోయి మరింత జటిలం చేయడం సరికాదన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తే అతని భార్య, పిల్లల జీవనోపాధి ఎలా అని వారు ప్రశ్నించారు.

ట్రిపుల్‌ తలాక్‌ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని.. అలాంటప్పుడు అది నేరమెలా అవుతుందని పలువురు వక్తలు ప్రశ్నించారు. ముస్లిం మహిళలపై కేంద్రానికి సానుభూతి ఉంటే ముస్లిం మతగురువులతో సంప్రదించి ట్రిపుల్‌ తలాక్‌ నివారణకు చర్యలు చేపట్టాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement