
సాక్షి, హైదరాబాద్: సమైక్య ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రా ప్రాంతంలో పని చేసిన కాంట్రాక్ట్ తెలంగాణ వైద్యాధికారులకు ఊరట లభించింది. వారికి వెయిటేజీ మార్కులిచ్చి సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత ఇస్తామని ఉమ్మడి హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్రెడ్డి హైకోర్టుకు తెలిపారు. ఈ సమాచారాన్ని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కె.విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం నమోదు చేసి రిట్పై విచారణ ముగిస్తున్నట్లు ప్రకటించింది.
ఉమ్మడి రాష్ట్రమప్పుడు ఆంధ్రా ప్రాంతంలో పనిచేశామని, ఇప్పుడు తెలంగాణలో పనిచేస్తున్నా తమకు వెయిటేజీ మార్కులు ఇవ్వడం లేదని తెలంగాణ కాంట్రాక్టు వైద్యాధికారులు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్టాఫ్ నర్సులు, ఇంజనీరింగ్ పోస్టుల్లో కాంట్రాక్టు పద్ధతిపై చేస్తున్నవారికి వెయిటేజీ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్లపై వచ్చే సోమవారం విచారణ చేస్తామని న్యాయమూర్తి ప్రకటించారు.