26 నుంచి టీజీటీ, పీజీటీ పరీక్షలు | Tgt and Pgt exams from 26th | Sakshi
Sakshi News home page

26 నుంచి టీజీటీ, పీజీటీ పరీక్షలు

Sep 7 2018 2:21 AM | Updated on Sep 7 2018 8:06 AM

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల పాఠశాలల్లో పోస్టుల భర్తీకి సంబంధించి టీజీటీ (ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌), పీజీటీ (పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌) అర్హత పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. సబ్జెక్టుల వారీగా తేదీలను తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) గురువారం ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యాశాఖ గురుకులాల్లో 960 టీజీటీ, 1,972 పీజీటీ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా టీజీటీ కేటగిరీలో 56,421 మంది, పీజీటీ కేటగిరీలో 62,604 మంది దరఖాస్తు చేసుకున్నారు.

దరఖాస్తుల స్వీకరణ పూర్తికావడంతో పరీక్షల ఏర్పాట్లకు బోర్డు ఉపక్రమించింది. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 14 వరకు సబ్జెక్టుల వారీగా పరీక్షలు నిర్వహించనుంది. పరీక్ష తేదీకి పది రోజుల ముందే హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని బోర్డు కన్వీనర్‌ నవీన్‌ నికోలస్‌ తెలిపారు. అర్హత పరీక్షలను మూడు పేపర్లుగా విభజించారు. పేపర్‌–1 పరీక్ష కామన్‌గా ఒకేరోజు (అక్టోబర్‌ 6న) నిర్వహిస్తుండగా పేపర్‌–2, పేపర్‌–3 పరీక్షలు మాత్రం సబ్జెక్టుల వారీగా వేర్వేరు తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement