స్పీకర్ మధుసూదనాచారి | Speaker madhusudana chari | Sakshi
Sakshi News home page

స్పీకర్ మధుసూదనాచారి

Jun 10 2014 1:34 AM | Updated on Oct 8 2018 3:44 PM

తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభాపతిగా వరంగల్ జిల్లా భుపాలపల్లి ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి ఎన్నికయ్యారు. స్పీకర్ అభ్యర్థిగా సోమవారం ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు.

అన్ని పార్టీల మద్దతుతో ఏకగ్రీవమైన ఎన్నిక
నేడు అధికారిక ప్రకటన...అనంతరం బాధ్యతల స్వీకరణ

 
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభాపతిగా వరంగల్ జిల్లా భుపాలపల్లి ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి ఎన్నికయ్యారు. స్పీకర్ అభ్యర్థిగా సోమవారం ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా విపక్షాల ఫ్లోర్‌లీడర్లు ఆయనకు మద్దతుగా నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. మంగళవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే మధుసూదనాచారి స్పీకర్‌గా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ జానారెడ్డి ప్రకటిస్తారు. ఆ తరువాత సీఎం సహా వివిధ పార్టీల ఫ్లోర్‌లీడర్లంతా మధుసూదనాచారిని స్పీకర్ స్థానం వరకూ గౌరవంగా తీసుకెళతారు. అనంతరం స్పీకర్‌కు అభినందనలు తెలిపే కార్యక్రమంతో సభ మరుసటిరోజుకు వాయిదా పడుతుంది.

 ఫలించిన టీఆర్‌ఎస్ మంతనాలు: శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు టీఆర్‌ఎస్ నేతలు గత రెండ్రోజులుగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు శని, ఆదివారాల్లో కాంగ్రెస్, టీడీపీ, మజ్లిస్, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ ఫ్లోర్‌లీడర్లను కలసి స్పీకర్ ఎన్నికపై మాట్లాడారు. మధుసూదనాచారిని స్పీకర్ అభ్యర్ధిగా బరిలో దింపుతున్నందున మద్దతివ్వాలని కోరారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆయా పార్టీల నేతలకు ఫోన్లు చేసి ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేయడంతో అన్ని పార్టీలు సానుకూలంగా స్పందించాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement