2,119 మంది చిన్నారుల రెస్క్యూ | Rescue of 2119 children | Sakshi
Sakshi News home page

2,119 మంది చిన్నారుల రెస్క్యూ

Feb 2 2019 2:09 AM | Updated on Feb 2 2019 2:09 AM

Rescue of 2119 children - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బాల కార్మికులుగా, బెగ్గింగ్‌ మాఫియాలో బలిపశువులుగా బాల్యాన్ని కోల్పోతున్న చిన్నారులను రెస్క్యూ చేసేందుకు ప్రారంభించిన ఐదో దఫా ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. జనవరి 1న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 2,119 మంది చిన్నారులను బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతిలక్రా శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

తెలంగాణ పోలీస్‌తోపాటు మహిళా శిశుసంక్షేమ శాఖ, ఆరోగ్యశాఖ, కార్మిక శాఖ, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమం ద్వారా ఆ చిన్నారులను ఫేస్‌ రికగ్నైజేషన్‌ టూల్‌ దర్పన్‌ ఉపయోగించి తల్లిదండ్రుల చెంతకు చేర్చినట్లు తెలిపారు. వీరిలో  బాలురు 1,653 మంది,  బాలికలు 466 మంది ఉన్నారని పేర్కొన్నారు. 1,303 మంది చిన్నారులను తల్లిదండ్రులు, సంరక్షకులకు అప్పగించగా, 816 మందిని రెస్క్యూ హోంకు తరలించామని వెల్లడించారు. గుర్తించిన చిన్నారుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 763 మంది ఉన్నారని తెలిపారు.  చిన్నారులతో వెట్టిచాకిరి చేయిస్తున్న వారిపై 58 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement