
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియ ముగింపుతో కీలక ఘట్టం ముగిసింది. ఇక ఈ స్థానిక సంస్థలన్నీ కళకళలాడనున్నాయి. ఆరునెలల్లోనే కీలకమైన పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) విజయవంతంగా ముగించింది. తాజాగా జెడ్పీపీ చైర్పర్సన్, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియను ముగించి గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పాలనకు మార్గం సుగమం చేసింది.
ఇక పట్టణాభివృద్ధికి పట్టుగొమ్మలుగా మారిన పురపాలక సంఘాల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధమవుతోంది. మున్సిపల్ చట్టానికి సవరణల్లో భాగంగా గతంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వేర్వేరుగా చట్టాలుండగా, రెండింటికి వర్తించే కొత్త చట్టం సిద్ధం కాబోతోంది. ఆర్డినెన్స్ రూపంలో నూతన మున్సిపల్ చట్టం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. దీంతోపాటు మున్సిపల్ వార్డుల పునర్వ్యవస్థీకరణ, రిజర్వేషన్ల ఖరారు, ఇతరత్రా అంశాలపై ప్రభుత్వపరంగా స్పష్టత రావా ల్సి ఉంది. తదనుగుణంగా జూలై లేదా ఆగస్టులో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధమవుతోంది.
గ్రామీణ సంస్థల పరిపుష్టం..
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు క్షేత్రస్థాయిలో ఆయా అంశాల వారీగా ప్రజలకు మెరుగైన పాలనను అందించేందుకు పంచా యతీల మొదలు జిల్లా పరిషత్ల వరకు పాలక మండళ్లు సిద్ధమవుతున్నాయి. ప్రత్యేకాధికారుల పాలనలోనే నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చినా... పంచాయతీల్లో కొత్త పాలకమండళ్లు ఎన్నికయ్యాక కొత్త చట్టంలోని అంశాల వారీగా బాధ్యతలను అప్పగించారు. గత ఫిబ్రవరి నుంచి నూతన చట్టం అమలు చేస్తూ గ్రామాల్లో పాలకవర్గాలు పాలన చేపట్టాయి. 12,751 గ్రామపంచాయతీల ఆవిర్భావంతో పాటు చట్టం ఏర్పడ్డాక తొలి పాలకవర్గాలుగా పంచాయతీ బోర్డుల్లో కొలువుతీరాయి. వీటి కోవలోనే పరిషత్లు కూడా ఇప్పుడు వచ్చి చేరుతున్నాయి.
కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా గతంలో 9 జిల్లాల స్థానంలో మొత్తం 32 జిల్లాలు ఏర్పడ్డాయి. ఇందులో కొత్త ప్రాదేశిక నియోజకవర్గాలు ఏర్పాటు కావడంతో... 5,857 ఎంపీటీసీ స్థానాలు, 538 మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, 538 మంది జెడ్పీటీసీ సభ్యులు, 8న ముగిసిన ఎన్నికల్లో 32 జిల్లాల పరిషత్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు ఎన్నికయ్యారు. వీరంతా కొత్త జెడ్పీపీల్లో తొలి పాలకవర్గాలుగానే తమదైన రికార్డును సొం తం చేసుకుంటున్నారు.