
కొత్త రాష్ట్రంలో ఆర్థిక ఆంక్షలు షురూ!
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఆమోదంపొందిన నెల రోజుల్లోనే ఆర్థిక ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నాల్గవ త్రైమాసికం ప్రారంభం నుంచే వాటిని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
* 70 శాతంపైగా వ్యయం చేసిన శాఖలకు నిధుల చెల్లింపులు బంద్
* జనవరి ఒకటి నుంచి అమల్లోకి ఆంక్షలు
* రూ.1,850 కోట్ల మేరకు పెండింగ్ బిల్లులు
* ముందస్తు జాగ్రత్తతో నాలుగో త్రైమాసికం నిధులు నిలిపివేత..
* ఎఫ్ఆర్బీఎం సడలింపు అంశంపై సన్నగిల్లుతున్న ఆశలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఆమోదంపొందిన నెల రోజుల్లోనే ఆర్థిక ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నాల్గవ త్రైమాసికం ప్రారంభం నుంచే వాటిని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. బడ్జెట్లో ప్రతిపాదించిన మొ త్తం నుంచి 70 శాతం మించి నిధులు ఖర్చు చేసిన సంస్థలపై ఈ ఆంక్షలు అమలు చేయనున్నారు. రాబోయే మాసాల్లో అధిక మొత్తంలో నిధులు కావాల్సిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా వీటిని అమలు చేయనున్నారు. భారీగా బడ్జెట్ ప్రతిపాదించినా.. ఆ మేరకు ఆదాయం సమకూర్చుకునే అవకాశాలు కనిపించని నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆంక్షల అమలుకు చర్యలు చేపట్టారు.
జాతీయ స్థూల ఉత్పత్తిలో మూడుశాతం మేరకు రుణాలు తీసుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంతకంటే అధికంగా 4.79 శాతం మేర రుణాలు తీసుకునే విధంగా బడ్జెట్లో పొందుపరిచిన విషయం విదితమే. దీనిపై కేంద్రం ఇప్పటి వరకూ సానుకూలంగా స్పందించకపోవడంతో 4 వేల కోట్ల రూపాయల మేరకు రుణం తెచ్చుకోవడానికి వీలుకానట్లే. దీంతో ఆ మేరకు సర్దబాటు చేయ డం తలకుమించిన భారమవుతోందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఏడాది కాలంలో ఖాజానాకు రావాల్సిన ఈ ఆదాయంలో రూ.500 కోట్ల మేర తగ్గిందని అంచనా వేశారు. దీనికితోడు సీఎం కేసీఆర్ వివిధ బహిరంగసభల్లో ప్రకటిస్తున్న వరాల వల్ల కూడా ఖజానాపై భారం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో జనవరి నుంచి ప్రారంభమయ్యే నాల్గో త్రైమాసికంలో నిధులపై ఆంక్షలు విధించనున్నారు.
ఇప్పటికే రూ. 4,600 కోట్ల రుణం : ఎఫ్ఆర్బీ ఎంకు లోబడి రాష్ట్రానికి దాదాపు రూ. 8,600 కోట్ల మేర రుణం తెచ్చుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం రూ. 4,600 కోట్ల రుణం తెచ్చుకుంది. జనవరిలో రూ.800 కోట్లు, ఫిబ్రవరిలో రూ.800 కోట్ల రుణం తెచ్చుకునేలా ప్రణాళికలు సి ద్ధంచేసింది. మార్చి చివరలో బిల్లులు మొత్తం చెల్లిం చాల్సి రావడంతో ఆ నెలలో రుణమొత్తాన్ని తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. నిధుల ఆంక్షలు ప్రధానంగా ప్రణాళిక వ్యయంపైనే పడుతుందని అధికారవర్గాలు వివరించాయి. ప్రస్తుతం జరిగిన పనులకు సంబంధించి సుమారు రూ.1,850 కోట్ల మేరకు బిల్లులు చెల్లించాల్సి ఉన్నట్లు తెలిసింది.