పెట్రోల్‌తో తహసీల్దార్‌ కార్యాలయానికి రైతు  | Farmer to tahsildar office with petrol | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌తో తహసీల్దార్‌ కార్యాలయానికి రైతు 

Nov 14 2019 3:17 AM | Updated on Nov 14 2019 10:04 AM

Farmer to tahsildar office with petrol - Sakshi

రైతు లింగయ్య చేతిలో ఉన్న బాటిల్‌

కల్హేర్‌(నారాయణఖేడ్‌): అబ్దుల్లాపూర్‌మెట్‌ ఘటన మరువకముందే భూమి పట్టా చేయడం లేదని బాటిల్‌లో పెట్రోల్‌ పోసుకుని వచ్చి మరో రైతు రెవెన్యూ ఉద్యోగులకు షాక్‌ ఇచ్చాడు. సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని మహదేవుపల్లికి చెందిన రైతు జి.లింగయ్య, వీఆర్‌ఓగా పనిచేసిన లాలయ్య తన పట్టా పాసుపుస్తకం నుంచి రెండు ఎకరాల భూమిని తీసేసి ఇతరుల పేరిట మార్చారని ఆరోపించాడు.

గ్రామ శివారులోని 49 సర్వే నంబర్‌లో తన తల్లి శివమ్మ పేరిట ఉండాల్సిన భూమికి హక్కులు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వీఆర్‌ఓ లాలయ్య తమకు అన్యాయం చేశారని సోదరులతో కలసి వచ్చి కార్యాలయం వద్ద కలకలం సృష్టించాడు. బాటిల్‌లో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ మీద పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అక్కడున్న వారు లింగయ్య చేతిలోంచి పెట్రోల్‌ బాటిల్‌ లాక్కున్నారు. అనంతరం లింగయ్య ఠాణాకు వెళ్లి వీఆర్‌ఓపై ఫిర్యాదు చేశాడు. దీనిపై వీఆర్‌ఓ లాలయ్యను ప్రశ్నించగా, సదరు 2 ఎకరాల భూమిని ఎవరిపేరుపై నమోదు చేయకుండా పెండింగ్‌లో పెట్టినట్లు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement