ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు | democracy is being murdered, says d srinivas | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు

Jul 2 2014 11:22 AM | Updated on Sep 2 2017 9:42 AM

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా అధికార పక్షం ప్రవర్తిస్తోందని, ఇప్పటికిప్పుడు ఇంత హడావుడిగా మండలి ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఏముందని డి.శ్రీనివాస్ నిలదీశారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా అధికార పక్షం ప్రవర్తిస్తోందని, ఇప్పటికిప్పుడు ఇంత హడావుడిగా మండలి ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం.. అది కూడా రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించాల్సిన అవసరం ఏముందని తెలంగాణ శాసన మండలి సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి.శ్రీనివాస్ నిలదీశారు. మండలి ఛైర్మన్ ఎన్నిక కోసం మొదలైన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. తనకు కూడా నిబంధనలు తెలుసని, అయినా సంప్రదాయాలను బట్టి నిబంధనలు ఎన్నిసార్లు మార్చుకోలేదని అడిగారు. ఇంత దౌర్జన్యంగా సభ నడిపించాలా అని ఆయన అనడంతో సభలో గందరగోళం నెలకొంది.

శాసనసభా వ్యవహారాల శాఖ హరీశ్ రావు మంత్రి అడ్డు తగలడంతో డీఎస్ ఆవేశానికి లోనయ్యారు. ఇది పద్ధతి కాదన్నారు. తాను ఉదాహరణలు కూడా చెప్పానని అన్నారు. స్పీకర్ పదవికి ఓపెన్ ఎలక్షన్ ఉండటం బాగుంటుందని, దాన్నే తాము ఇప్పుడు చెబుతున్నామని, సీక్రెట్ బ్యాలెట్ పెట్టడానికి వెనక ఉద్దేశం ఏంటని అడిగారు. ఎన్నికను వాయిదా వేయాలని కోరారు. నాయకులంతా స్థానిక ఎన్నికల్లో నిమగ్నమై ఉన్నారని చెప్పారు. తర్వాత ఎప్పుడు పిలిచినా తామంతా నిర్మాణాత్మక సహకారం అందిస్తామని తెలిపారు.

అయితే, మండలి చైర్మన్ ఎన్నికను గవర్నర్ షెడ్యూలు చేశారని, ఇది మనమెవరం పెట్టుకున్నది కాదని హరీశ్ రావు చెప్పారు. పోటీలో ఒకరి కంటే ఎక్కువమంది ఉంటే బ్యాలెట్ ద్వారానే ఛైర్మన్ను ఎన్నుకోవాలని కూడా నిబంధనలో ఉందంటూ ప్రస్తావించారు. దాంతో కాంగ్రెస్ సభ్యులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ప్రతి సభ్యుడికీ ఎన్నిక ప్రక్రియ మీద సమాచారం అందించామని, దానికి ఒప్పుకొనే నామినేషన్లు దాఖలు చేసి, ఇప్పుడు వాయిదా వేయాలనడం హాస్యాస్పదమని హరీశ్ అన్నారు. 1980లో రాజ్యసభలో హిదయతుల్లా ఛైర్మన్గా ఉన్నప్పుడు ఆయనిచ్చిన రూలింగ్ను ఈ సందర్భంగా ప్రస్తావించారు. పెద్దల సభ గౌరవం పెరిగేలా ఎన్నిక ప్రక్రియకు సహకరించాలని కోరారు.

హరీశ్ చక్కగా చిలక్కి చెప్పినట్లు చెప్పారని, అయితే ప్రభుత్వ సూచనల ప్రకారమే గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చారని డీఎస్ అన్నారు. గవర్నర్ ఎప్పుడూ ప్రభుత్వ సూచనలను బట్టే చెబుతారని గుర్తుచేశారు. గవర్నర్కు కూడా తాము ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగట్లేదన్న విషయం చెప్పామని, అయితే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టే తాము నామినేషన్ వేశామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement