తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ ఎన్నికల బరినుంచి కాంగ్రెస్ పార్టీ తప్పుకొంది.
తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ ఎన్నికల బరినుంచి కాంగ్రెస్ పార్టీ తప్పుకొంది. చైర్మన్ ఎన్నిక ప్రజాస్వామ్యబద్దంగా జరగడంలేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పోడియంలోకి దూసుకెళ్లారు. రహస్య బ్యాలెట్కు ఏ పద్ధతిలో వెళ్లారని, ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని సీనియర్ సభ్యుడు డి. శ్రీనివాస్ మండిపడ్డారు. ఈ వాదోపవాదాల మధ్యనే తెలంగాణ శాసనమండలిలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి ఓటు హక్కును తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ వినియోగంచుకున్నారు. దీంతో చైర్మన్ పోడియం వద్ద కాంగ్రెస్ సభ్యులు నిరసనకు దిగారు. ఎన్నిక ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నిక ప్రక్రియను నిరసిస్తూ తాము ఎన్నికల బరిలోంచి తప్పుకొంటున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ సమయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సభలో అవాంఛనీయ పరిణామాలు జరుగుతున్నాయని, అసెంబ్లీ కార్యదర్శి చేతుల్లోని కాగితాలను తీసుకుని చించేయడం సభ్యత కాదని శాసనభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ సభ్యులు సభకు క్షమాపణ చెప్పాలని హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేసిన తర్వాత మండలి ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియను యథాతథంగా కొనసాగించారు.