రేవంత్‌ రాజకీయ నాయకుడా.. రౌడీ షీటరా : జీవీఎల్‌

BJP MP GVL Narasimharao Fires On Congress Party - Sakshi

దక్షిణాదిపై కాంగ్రెస్‌ వివక్ష.. పీవీని అవమానించింది

మహిళలు బతుకమ్మ అడితే కేసులు పెడతారా

పాతబస్తీనా.. పాకిస్తానా : జీవీఎల్‌

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చాయని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. ల్యాండ్‌ సెటిల్‌మెంట్ల్‌తో, భూ కబ్జాలతో రేవంత్‌ రెడ్డి కోట్లు సంపాదించారని ఆయన ఆరోపించారు. ఐటీ దాడులకు సంబంధించిన రిపోర్టులను శనివారం జీవీఎల్‌ మీడియాకు వెల్లడించారు. సెటిల్‌మెంట్ల్‌తో రూ.11 కోట్ల నల్లధనం వచ్చిందని రేవంత్‌ బావమరిది చెప్పారని.. రేవంత్‌ మామ వద్ద 11 లక్షల నగదు, 1.2 కిలోల బంగారం సీజ్‌ చేసినట్లు ఐటీ తెలిపిందని అన్నారు. కేఎల్‌ఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ డైరెక్టర్‌ వద్ద 1.40 కోట్లు దొరినట్ల ఐటీ వెల్లడించిందని పేర్కొన్నారు. జీవీఎల్‌ మాట్లాడుతూ.. ‘‘రేవంత్‌ సోదరుడి కంపెనీ భుపాల్‌ ఇన్‌ఫ్రాటెక్‌ సబ్‌ కాంట్రాక్టు పనులు చేసింది. కూలీలకు డబ్బులు ఇచ్చామని అనేక రెట్లు పెంచి చూపించారు. భూ లావాదేవీలతో నల్లధనాన్ని సంపాధించి అక్రమాలకు పాల్పడ్డారు. రేవంత్‌ ఓటుకు కోట్ల కుంభకోణానికి కూడా పాల్పడ్డారు. రేవంత్‌ రెడ్డి రాజకీయ నాయకుడిలా లేడు.. రౌడీ షీటర్‌లా ఉన్నాడు. సీఎం రమేష్‌, రేవంత్‌ రెడ్డిలు అనేక వాటికి ట్యాక్స్‌లు ఎగకొట్టారు’’ అని అన్నారు.

పీవీని అవమానించిన కాంగ్రెస్‌..
పన్నులు ఎగొట్టేవారికి కాంగ్రెస్‌ పార్టీలో గుర్తింపు బాగా ఉంటుందని జీవీఎల్‌ ఎద్దేవా చేశారు. యంగ్‌ ఇండియా పేరుతో రాహుల్‌ గాంధీ కూడా కోట్ల రూపాయలు కొల్లగొట్టారని.. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కూడా రాహుల్‌ పాత్ర ఉందని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆయన చెప్పుకున్నంత ఉత్తముడు కాదని.. దేశం కోసం సేవ చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి విషయంలో రాహుల్‌ గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దక్షిణాది రాష్ట్రాలను అవమానించిన పంజాబ్‌ మంత్రి సిద్దూపై కాంగ్రెస్‌ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. దక్షిణాది అంటే కాంగ్రెస్‌కే వివక్ష అని.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మృత దేహాన్ని కూడా కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌లోకి తీసుకెళ్లలేదని ధ్వజమెత్తారు. సోనియా గాంధీ అదేశాల వల్లనే పీవీకి అవమానం జరిగిందని.. రాజీవ్‌ కూడా అంజయ్యపై వివక్ష చూపించారని అన్నారు. 

రూ.100 కోట్లు ఎగ్గొట్టినట్లు ఆధారాలు

టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ రూ.100 కోట్ల టాక్స్‌ ఎగ్గొట్టినట్లు ఆధారాలు ఉన్నాయని జీవీఎల్‌ పేర్కొన్నారు. నిజాయితీ పరులం అని బుకాయించారని, పెద్ద ఎత్తులో నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. ప్రగల్బాలు పలికి బయటపడొచ్చు అనుకున్నారని తెలిపారు. అసలు మీకు వందల కోట్ల రూపాయలు ఎక్కడివి అని ప్రశ్నించారు.  మీదేమైనా అంతార్జాతీయ సంస్థనా అని సీఎం రమేష్‌ను సూటిగా ప్రశ్నించారు. నీటి పారుదల రంగంలో ప్రాజెక్టుల పేరుతో అవినీతిని ఏరులై పారించారని తీవ్రంగా దుయ్యబట్టారు.

పాతబస్తీనా.. పాకిస్తానా
తెలంగాణలో బతుకమ్మ అడుతున్న మహిళపై కేసులు పెట్టడం దారుణమన్నారు. ఓల్డ్‌ సిటీ ఏమైనా పాకిస్తానా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ పాతబస్తీని ఒవైసీకి రాసిచ్చారా? అని అన్నారు. కేసీఆర్‌, కవిత తెలంగాణ ఆడపడుచులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఓవైసీకి తలవంచిన కేసీఆర్‌, విమోచన దినోత్సవం జరపకపోవడం సిగ్గుచేటని జీవీఎల్‌ అన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top