మనమే ‘పుర’పాలిద్దాం! | All Parties Focus On Municipal Elections In Telangana | Sakshi
Sakshi News home page

మనమే ‘పుర’పాలిద్దాం!

Jul 11 2019 1:36 AM | Updated on Jul 11 2019 5:10 AM

All Parties Focus On Municipal Elections In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఈనెల 15 తర్వాత ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్‌ వస్తుందని భావిస్తున్న మున్సి పల్‌ ఎన్నికల కోసం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. మరో నాలుగైదు రోజు ల్లో నగారా మోగుతుందన్న సంకేతాల నేపథ్యంలో.. అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌తోపాటు బీజేపీ కూడా పురపోరుకు కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో పరిషత్‌ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మళ్లీ పునరావృతం కావాలనే వ్యూహంతో టీఆర్‌ఎస్, కనీస సీట్లను దక్కించుకుని గౌరవాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్, పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఇచ్చిన కిక్‌ను కొనసాగిస్తూ వీలున్నన్ని స్థానాలను కైవసం చేసుకోవాలనే ఆలోచనతో కమలనాథులు ఎవరి వ్యూహాలతో వారు ముందుకెళ్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రావడానికి సమయం కూడా లేకపోవడంతో ఇప్పుడు ఈ మూడు పార్టీలు రంగంలోకి దిగాయి. వామపక్షాలతో పాటు టీజేఎస్, టీడీపీ లాంటి పార్టీ్టలు కూడా అక్కడక్కడా పోటీ చేసే అవకాశాలున్నా కార్యాచరణతో ముందుకెళుతున్నట్టు కనిపించడం లేదు.

కాంగ్రెస్‌ కసరత్తు షురూ
మున్సిపల్‌ ఎన్నికలపై రాష్ట్రంలోని అన్ని పార్టీల కన్నా కాంగ్రెస్‌ పార్టీనే ముందుగా కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో ఎన్నికల కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంది. పొన్నం ప్రభాకర్, సంపత్, వంశీచందర్‌రెడ్డిలతో కూడిన ఈ కమిటీ రెండు సార్లు భేటీ అయి మున్సిపల్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించింది. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ సూచనల మేరకు ఇప్పటికే జిల్లా స్థాయిలో సమావేశాలు కూడా పూర్తయ్యాయి. ఈనెల 13, 14, 15 తేదీల్లో మున్సిపాలిటీల స్థాయిలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, మాజీలంతా హాజరు కావాలని, వార్డుల వారీగా చర్చించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని కూడా ఆయన ఆదేశాలిచ్చారు. కేవలం ఇద్దరు ఆశావహుల పేర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే జిల్లాల వారీ ఇంచార్జీలను నియమించి వారికే సమావేశాల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. మొత్తంమీద ఈసారి ఎట్టి పరిస్థితుల్లో.. కనీస స్థాయిలో మున్సిపాలిటీల్లో పాగా వేసేలా నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు క్షేత్రస్థాయి యంత్రాంగమంతా మున్సిపల్‌ ఎన్నికల్లో నిమగ్నమయింది.

కమలనాథులూ కదిలారు!
పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో మంచి ఊపు మీదున్న రాష్ట్ర బీజేపీ నేతలు మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటాలని యోచిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బోణీ కొట్టడం ద్వారా తెలంగాణలో తాము రాజకీయ శక్తిగా అవతరించామనే సంకేతాలిచ్చే వ్యూహం తో పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే బూత్‌ కమిటీలను కూడా ఏర్పాటు చేసుకున్న కమలనాథులు కీలక నేతలకు జిల్లాల వారీ బాధ్యతలు అప్పజెప్పారు. వీరంతా ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ మున్సిపాలిటీల వారీగా పార్టీ నేతలను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు.  నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో గౌరవప్రదమైన స్థాయిలో వార్డులు, చైర్మన్‌ పీఠాలు దక్కించుకోవాలని ఆశిస్తోంది. అందు లో భాగంగానే అసంతుష్టులు, ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తూ వారిని పార్టీలో చేర్చుకుంటోంది. మొత్తంమీద మున్సిపల్‌ ఎన్నికల్లో వచ్చే ఓట్లు, సీట్లు ఆధారంగానే తెలంగాణలో పార్టీ పటిష్టత కోసం అడుగులు వేయొచ్చనే అంచనాతో వ్యూహాలు రచి స్తూ లక్ష్మణ్‌ సేన మున్సిపల్‌ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఇక,  మిగిలిన పక్షాలైన వామపక్షాలు, టీజేఎస్, టీడీపీలు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయా లని భావిస్తున్నాయి. వీటిలో కొన్ని పార్టీలు కాంగ్రెస్‌ కు మద్దతు ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదు.  
మళ్లీ స్వీప్‌ చేయాల్సిందే!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement