ఆస్పత్రి మరుగుదొడ్డిలో ప్రసవం!
చెన్నై , టీ.నగర్: ఆస్పత్రి మరుగుదొడ్డిలో పండంటి శిశువుకు జన్మనిచ్చింది ఓ గర్భిణి. ఏమైందో తెలీదు ఆ శిశువుకు అక్కడే వదిలివెళ్లింది. ఈ సంఘటన చెన్నై సమీపంలో గురువారం జరిగింది. వివరాలు.. చెన్నై చూలైమేడులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి గురువారం రాత్రి ఓ నిండు గర్భిణి వచ్చింది. ఆమెతోపాటు ముగ్గురు స్త్రీలు, ఒక పురుషుడు ఉన్నారు.ఆమె పేరు, చిరునామా నమోదు చేసిన తర్వాత డాక్టర్ పరీక్షలు జరిపారు. తర్వాత ఆ గర్భిణి మరుగుదొడ్డికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లింది. ఆమె అక్కడే బిడ్డను ప్రసవించింది.
తర్వాత ఒక బకెట్ను శిశువుపై మూసి అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది. ఆమె వెంట వచ్చినవారు వైద్య సిబ్బందితో ఉదయం మళ్లీ వస్తామని చెప్పి వెళ్లిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున మరుగుదొడ్డిలో నుంచి శిశువు కేకలు వినిపించాయి. ఆస్పత్రిలో ఉన్న జెమిమా అనే మహిళ మరుగుదొడ్డికి వెళ్లి చూసింది. అక్కడ బక్కెట్ కింద మగ శిశువు ఉండడంతో చూలైమేడు పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు అక్కడికి వచ్చి విచారణ జరిపారు. శిశువు ఆస్పత్రి సిబ్బంది సంరక్షణలో ఉన్నాడు. విచారణలో శిశువు తల్లికి వివాహం కాలేదని, ఆమె మహిళా న్యాయవాదని తెలిసింది.