భారత్‌లో నిర్మాణ రంగం అభివృద్ధి | El desarrollo del sector de la construcción en la India | Sakshi
Sakshi News home page

భారత్‌లో నిర్మాణ రంగం అభివృద్ధి

Nov 14 2013 2:56 AM | Updated on Sep 2 2017 12:34 AM

భారత దేశంలో నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతోందని ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కెమికల్స్ తయారీ సంస్థ ఆర్డెక్స్ ఎండ్యూరా సంస్థ సీఈఓ మార్క్ ఎస్‌లమ్‌లూ...

సాక్షి, బెంగళూరు: భారత దేశంలో నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతోందని ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కెమికల్స్ తయారీ సంస్థ ఆర్డెక్స్ ఎండ్యూరా సంస్థ సీఈఓ మార్క్ ఎస్‌లమ్‌లూ వెల్లడించారు. తద్వారా గృహ నిర్మాణ రంగంలో వినియోగించే టైల్స్, స్టోన్ ఫ్లోరింగ్ తదితర ఉపకరణాల రంగం కూడా దినదినాభివృద్ధి చెందుతోందని ఆయన పేర్కొన్నారు. టైల్స్, స్టోన్ ఫ్లోరింగ్‌ల తయారీ కోసం ఆర్డెక్స్ ఎండ్యూరా సంస్థ నగరంలో ‘స్టేట్ ఆఫ్ ది ఆర్ట్’ పేరిట ఏర్పాటు చేసిన సరికొత్త ప్లాంట్‌ను బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గృహ నిర్మాణ రంగంలో ఉపయోగించే కన్‌స్ట్రక్షన్ కెమికల్స్ (టైల్స్, స్టోన్ ఫ్లోరింగ్ తదితరాలు)రంగం భారతదేశంలో ప్రస్తుతం రెండు వేల కోట్ల షేర్ మార్కెట్‌ను కలిగి ఉందని పేర్కొన్నారు. మరో ఐదారేళ్లలో ఈ రంగం ఐదు వేల కోట్ల షేర్ మార్కెట్‌ను అందుకోగలదని తెలిపారు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటక రాజధాని బెంగళూరు కూడా నిర్మాణరంగానికి హబ్‌గా తయారైందని అందుకే తమ ప్లాంట్‌ను బెంగళూరులో ఏర్పాటు చేశామని ఆర్డెక్స్ ఎండ్యూరా సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ గోపినాథ్ క్రిష్ణన్ వెల్లడించారు.

నగరంలో ఏర్పాటైన ఈ ప్లాంట్‌ను గంటకు 60 టన్నుల నాణ్యమైన టైల్స్‌ను తయారుచేసే సామర్ధ్యాన్ని కలిగి ఉందని తెలిపారు. ఈ ప్లాంట్‌లో తయారయ్యే టైల్స్, ఫ్లోరింగ్ ఉపకరణాలను శ్రీలంకతో పాటు అరేబియా దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు గోపినాథ్ తెలిపారు. తమ సంస్థ ప్రస్తుతం 100 కోట్ల మార్కెట్ షేర్‌ను కలిగి ఉందని, రానున్న ఆర్థిక సంవత్సరం ముగింపునాటికి మరో 20 శాతం పెరుగుదలను సాధించే దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

2014 పూర్తయ్యే నాటికి పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో మరో ప్లాంట్‌ను ఏర్పాటుచేసే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు గోపినాథ్ చెప్పారు. కార్యక్రమంలో ప్రిజమ్ సిమెంట్స్ మేనేజింగ్ డెరైక్టర్ విజయ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement