రెండో టెస్ట్‌: విహారి దూరం.. ఉమేశ్‌కు అవకాశం

Vihari Out Umesh Comes India Vs South Africa 2nd Test At Pune - Sakshi

పుణే: విశాఖ టెస్టులో ఇరగదీసిన టీమిండియా మరో టెస్టు గెలుపుపై కన్నేసింది. బుధవారం మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా- టీమిండియాల మధ్య రెండో టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌ జరిగే కొద్ది పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో సారథి విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌ వైపే మొగ్గు చూపాడు. అయితే ఈ మ్యాచ్‌కు తెలుగు కుర్రాడు హనుమ విహారి అనూహ్యంగా దూరమయ్యాడు. అతడి స్థానంలో ఉమేశ్‌ యాదవ్‌ను తుదిజట్టులోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికా కూడా ఒక్క మార్పుతో బరలోకి దిగుతోంది. తొలి టెస్టులో ఏమాత్రం ఆకట్టుకోలేని ఆఫ్‌స్పిన్నర్‌ పీట్‌ను పక్కకు పెట్టి పేసర్‌ అన్రిచ్ నార్ట్జేను తుది జట్టులోకి తీసుకున్నారు. 

ఇక రెండో టెస్టు ఎంపికలోనూ రిషభ్‌ పంత్‌కు నిరాశే ఎదురైంది. తొలి టెస్టులో అంతగా ఆకట్టుకోని సాహాకు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మరో అవకాశం కల్పించింది. అయితే సాహా విఫలమవ్వడంతో తనను ఎంపిక చేస్తారని భావించిన పంత్‌కు నిరాశే మిగిలింది. ఇక హనుమ విహారిని పక్కకు పెట్టడానికి గల కారణాలను టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తెలపలేదు. తొలి టెస్టులో దుమ్ము దులిపిన ఓపెనర్‌ రోహిత్‌ శర్మపై అందరి దృష్టి ఉంది. ఇక ఈ టెస్టులోనే అతడు అదరగొడి​తే టెస్టుల్లో ఓపెనర్‌గా సెటిల్‌ అయినట్టేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక కెప్టెన్‌గా కోహ్లికి 50వ టెస్టు కావడంతో విశేషం. నేటి నుంచి జరిగే పోరులో పైచేయి సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని కోహ్లి సేన భావిస్తోంది. అయితే రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను కాపాడుకోవాలని సఫారీ జట్టు ఆరాటపడుతోంది. 

తుది జట్లు: 
టీమిండియా:  విరాట్‌ కోహ్లి (కెప్టెన్), రోహిత్, మయాంక్, పుజారా, రహానే, సాహా, జడేజా, అశ్విన్, ఇషాంత్, షమీ, ఉమేశ్‌ యాదవ్‌
దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్‌ (కెపె్టన్‌), ఎల్గర్, మార్క్‌రమ్, డి బ్రూయిన్, బవుమా, డి కాక్, ఫిలాండర్, రబడ, అన్రిచ్ నార్ట్జే , ముత్తుసామి, మహరాజ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top