
ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్టులో కొద్దిపాటి వ్యత్యాసంతో ఓడిపోయిన టీమిండియా..
లండన్: ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్టులో కొద్దిపాటి వ్యత్యాసంతో ఓడిపోయిన టీమిండియా.. రెండో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో పరాజయం పాలైంది. ఈ రెండు టెస్టుల్లోనూ మనకు ప్రధానంగా కనిపించింది బ్యాట్స్మెన్ వైఫల్యమే. ఇంగ్లండ్ పర్యటన ఆరంభం నుంచి టీ20 మినహాయించి బ్యాట్స్మెన్ సరిగా ఆడలేకపోయారు. ఇదే క్రమంలో వన్డే సిరీస్ను కోల్పోయిన టీమిండియా.. టెస్టుల్లోనూ అదే తరహా ప్రదర్శన కొనసాగిస్తోంది.
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్కు ఆడిన రోహిత్ శర్మ టెస్టు సిరీస్లో చోటు దక్కించుకోలేకపోయాడు. జట్టులో చోటు కోల్పోయిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే తాజాగా అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫొటోపై నెటిజన్లు మండిపడుతున్నారు. పాపులర్ ఇంగ్లిష్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఆరంభమైన నేపథ్యంలో ఆదివారం రోహిత్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తన ఫ్యాంటసీ ప్రీమియర్ లీగ్ జట్టును షేర్ చేశాడు.
ఇందులో నుంచి స్టార్ ప్లేయర్స్తో జట్టును ఎంపిక చేసి దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ను ఇన్స్టాగ్రామ్లో తన ఫాలోవర్లతో పంచుకున్నాడు. ఎవర్టన్, వాట్ఫోర్డ్, లివర్పూల్, మాంచెస్టర్ యునైటెడ్, టొటెన్హమ్ హాట్స్పర్, మాంచెస్టర్ సిటీలకు చెందిన ఆటగాళ్లకు తను సెలక్ట్ చేసిన టీమ్లో చోటిచ్చాడు. ప్రీమియర్ లీగ్ ఆరంభమైంది. ఈ వారానికి ఇదే ఫేవరెట్ టీమ్, మరి మీ జట్టు? అని రోహిత్ వ్యాఖ్యానించాడు.
దీనిపై ఫ్యాన్స్ తమదైన శైలిలో రోహిత్ను ఆడుకుంటున్నారు. ‘ముందు నీ ఆటపై శ్రద్ధ పెట్టు.. తరువాత మిగతా క్రీడలపై ఆలోచించు అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. లార్డ్స్లో ఇంగ్లండ్తో భారత్ టెస్టు మ్యాచ్ను వీక్షించకుండా ఏం చేస్తున్నావ్? అని మరొకొందరు ప్రశ్నించారు. ఒక క్రికెటర్ ఫుట్బాల్ గురించి చర్చిస్తున్నాడు. ఒక ఫుట్బాలర్ ఎప్పటికీ క్రికెట్ గురించి ఆలోచించడు. నువ్వెవరో కూడా వాళ్లకు తెలియదు. కానీ వాళ్లతో జట్టు ఎంపిక చేసి పెద్ద చర్చకు తెరతీశావు’ అని మండిపడ్డారు.