రోహిత్‌, జడేజాలను ఆటపట్టించిన ధావన్‌

Dhawan Introduced Rohit And Jadeja As Loving And Caring Fathers - Sakshi

మొహాలీ: దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో టీ20లో భారత్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి టీ20 వర్షం కారణంగా టాస్‌ కూడా పడకుండానే రద్దు కాగా, రెండో టీ20లో భారత్‌ సమష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. రెండో టీ20లో కెప్టెన్‌ కోహ్లి అజేయంగా 72 పరుగులు చేయగా, శిఖర్‌ ధావన్‌ 40 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక మూడో టీ20 బెంగళూరులో ఆదివారం జరుగనుంది. దీనిలో భాగంగా వీరు బెంగళూరుకు పయనమైన సందర్భంలో రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజాలను ధావన్‌ ఆట పట్టించాడు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

ఇంతకీ విషయం ఏమిటంటే.. రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజాలు తమ పిల్లలకు బొమ్మలు కొని తీసుకెళ్లడాన్ని ప్రశ్నించాడు. ‘నీ చేతిలో ఉన్నవి ఏమిటి. అవి ఎవరి కోసం’ అని ధావన్‌ అడిగాడు. దానికి సమాధానంగా రోహిత్‌.. ‘నా కూతురు కోసం బొమ్మలు కొన్నాను. నేను ఏ వస్తువు తీసుకెళ్లినా నా కూతురికి నచ్చుతుంది.  నా భార్య, కూతురు బెంగళూరుకు వస్తున్నారు. నేను కొన్న బొమ్మలను కూతురికి ఇస్తా. ఆమెకు కచ్చితంగా నేను ఇచ్చింది ఇష్టపడుతుంది’ అని అన్నాడు.

మరొకవైపు వెనుక సీట్లో ఉన్న రవీంద్ర జడేజాను రోహిత్‌-ధావన్‌లు ఆట పట్టిస్తూ.. ‘నీ కూతురికి ఎప్పుడైనా బొమ్మలు కొన్నావా’ అంటూ నిలదీశారు. ‘నేను కూడా కొన్నాను బాస్‌’ అంటూ ఆల్‌ రౌండర్‌ జడేజా నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ధావన్‌.. తమ జట్టులో ‘లవింగ్‌-కేరింగ్‌ ఫాదర్స్‌ వీరే’ అనే క్యాప్షన్‌ ఇచ్చాడు. మూడో టీ20 ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగనుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top