
మచిలీపట్నం కోనేరు సెంటర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి
సాక్షి, మచిలీపట్నం: ఏపీకి సీఎం కాగానే చంద్రబాబు నాయుడు బెల్టు షాపులు రద్దు చేస్తామని మొదటి సంతకం పెట్టారని, కానీ బెల్టు షాపులకు మంత్రే దగ్గరుండి వేలం వేయిస్తున్నారని.. ఊరూరా బెల్టు షాపులుగా రాష్ట్రాన్ని మార్చేశారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ప్రజలను తాగించి ఆదాయం చేసుకుంటూ వ్యవస్థలను కాపాడాల్సిన వారే నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. హోదా విషయంలో నాలుగేళ్లు మభ్యపెట్టి ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. ఈ మోసాలు ఇక చాలు. ఇవాళ మనం దారుణ స్థితిలో ఉన్నామంటే అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ. పొత్తులపై ఎవరి ప్రచారాలు నమ్మొద్దు.. 25 మంది వైఎస్సార్సీపీ ఎంపీలను గెలిపించండి. ఏపీకి ప్రత్యేక హోదా ఎవరు ఇస్తామంటే వారికే మద్దతు తెలుపుతాం. కేంద్రంతో పోరాడి హోదా సాధిస్తాం.
నాలుగేళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు. పిల్లలకు ఉద్యోగాలు లేవు. తిరుపతికి వెళ్లి ధర్మ పోరాటం చేస్తున్న చంద్రబాబును చూస్తే.. రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. 150వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్లో నిర్వహించిన భారీ బహిరంగలో పాల్గొన్న వైఎస్ జగన్ ఏపీలో నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తారు. భూ కబ్జాకు డిగ్రీలుంటే టీడీపీ నేతలకు పట్టాలు ఇవ్వొచ్చని స్థానిక మహిళలు చెబుతున్నారు. గతంలో ఇచ్చిన స్థలాలను మళ్లీ కబ్జా చేసి ఆక్రమించుకుంటూ.. ఆఖరికి శ్మశానాలు, టాయిలెట్లను కూడా టీడీపీ నేతలు వదలడం లేదన్నారు.
ఎన్టీఆర్ బంధువులదీ అదే ఆవేదన!
శివలీలమ్మ.. దివంగత నేత ఎన్టీఆర్ మొదటి భార్య బసవ తారకం బంధువు. ఆమె నన్ను కలిసి వాళ్ల బాధలు చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. అన్నా.. మాకు కొన్ని భూములున్నాయి. ఆ భూములు అమ్మే, కొనే విషయంలో వివాదాలొచ్చాయి. టీడీపీ నేతలు చెప్పిన వాటికి మేం ఒప్పుకోలేదని నాలుగు రోజులపాటు స్టేషన్లో పెట్టారు. పొద్దునపూట స్టేషన్కు.. రాత్రిపూట ఓ ఇంటికి, లేక లాడ్జీలకు తీసుకెళ్తారు. ఇలా నాలుగు రోజులు పోలీస్ స్టేషన్లు, లాడ్జీలు.. ఇలా మారుస్తూ ఆడవాళ్లని కూడా చూడకుండా వేధింపులకు గురిచేశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
దివంగత నేత వైఎస్సార్ హయాంలో లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారు కానీ, నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క ఇళ్లు కూడా కట్టించ లేదని, ఇంకా చెప్పాలంటే అసలు ఇళ్ల స్థలాలే కేటాయించలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అడుగుకు రూ.2వేలు చొప్పున 300 అడుగుల ఫ్లాట్కు 6 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. మూడు లక్షలకు బదులుగా రెట్టింపు ధరలు వసూలు చేస్తూ పేదవాడిని మోసం చేస్తున్నారు. రూ.3 లక్షలు ప్రభుత్వాలు ఇస్తే.. పేదవాడి ఖాతాలో మరో 3 లక్షల రూపాయల అప్పు రాసుకుంటారట. ఆ పేదవాళ్లు జీవితాంతం కట్టిన ఆ అప్పు తీరదు. మీ అందరి ఆదరణతో అధికారంలోకొస్తే ప్రతి పేదవాడికి ఉచితంగా ఇళ్లు కట్టించి, ఉచితంగా రిజిస్ట్రేషన్ చేపించి ఇస్తామని భరోసా కల్పించారు. ఎప్పుడైనా అవసరమైన ఆ అక్కాచెల్లెమ్మలు ఆ ఇంటిని తనఖా పెట్టి పావలా వడ్డీకే అప్పులు ఇప్పిస్తాం.
వలసల బందర్గా మారింది
దివంతగ ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో రెండు పంటలకు నీళ్లిచ్చేవారు. కానీ చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో రెండో పంటకు నీళ్లే లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి వేస్తే గిట్టుబాటు ధర రాదు, ఏ పంట వేసిన కొనే నాథుడే లేడు. బందరులో ఉద్యోగాలు ఉండవు, ఉపాధి ఉండదు. 2011 లెక్కల ప్రకారం చూస్తే గతంతో పొల్చితే బందరులో 10వేల ఓట్లు తగ్గాయంటే పరిస్థింతి ఏంటో తెలుస్తుంది. బందరు టౌన్ను అభివృద్ధి చేయాలని వైఎస్సార్ ఆకాంక్షించేవారు.
లక్షా 42 వేల ఉద్యోగాలు భర్తీ
కచ్చితంగా బందర్ పోర్ట్ కడతాం. అవసరమైన 4,800 ఎకరాలు మాత్రమే తీసుకుంటామని చెబుతున్నా. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం తీసుకొస్తాం. అధికారంలోకి రాగానే వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తాం. లక్షా 42 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తా. ఏటా ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. గ్రామ సచివాలయాల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చి.. పెన్షన్, రేషన్ కార్డులు, ఆరోగ్య, ఫీజు రీయింబర్స్ మెంట్లను 72 గంటల్లో మంజూరు చేస్తాం. పథకాల అమలులో కులాలు, మతాలు, పార్టీలు అంటూ వ్యత్యాసం లేకుండా పేదలందరికీ న్యాయం చేసే పాలన అందిస్తా.
ప్రతి ఒక్కరి ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు నవరత్నాలు ప్రకటించాం. అందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వాలని.. తాను రాత్రి ఎక్కడ బస చేస్తానో అందరికీ తెలుసునని అక్కడకు వచ్చి తనకు మార్పులు సూచించాని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.