
సాక్షి, శ్రీకాకుళం : ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేసిన స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశముందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ సభ్యుల సమావేశాలకు పార్టీ నేత ధర్మాన ప్రసాదరావుతో కలసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ విధానాలు, నిర్లక్ష్యం కారణాంగానే ఉత్తరాంధ్ర వెనుకబడిందని విమర్శించారు.
నాలుగేళ్లయినా వంశధార ఫేజ్ 2 పనులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీడీపీ నేతలు అవినీతికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ప్రాజెక్టులు పూర్తి కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్ అవినీతి ధనార్జనతో 3 లక్షల కోట్లు దోచుకుని, విదేశాల్లో దాచుకున్నా.. సంతృప్తి చెందడం లేదని.. అందుకే రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడొచ్చిన వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉందని తెలిపారు.
ధర్మాన మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత లేదని విమర్శించారు. శ్రీకాకుళంలో హుద్హుద్ తుఫాన్లో ఇళ్లు కోల్పోయిన వారికి.. ఇళ్లు కేటాయించలేని అసమర్ధత టీడీపీ ఎమ్మెల్యేల సొంతమన్నారు. ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరగడంతో.. అవి బయటపడకూడదనే పేదలకు ఇళ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు.