ప్రచారంలో మైకు కోసం​ టీడీపీ నేతలు వాగ్వాదం | TDP Leaders Altercation In Election Campaign | Sakshi
Sakshi News home page

మేము మీలాగా పార్టీలు మారే వాళ్లం కాదు

Apr 1 2019 7:02 AM | Updated on Apr 1 2019 7:02 AM

TDP Leaders Altercation In Election Campaign - Sakshi

 ములుగుందంలో మైకు లాక్కుంటున్న  టీడీపీ నాయకుడు మల్లికార్జునరెడ్డి

ఆస్పరి: అధికారపార్టీలో విభేదాలు తీవ్రమయ్యాయి. మండలంలోని ములుగుందంలో కోట్ల వర్గం,  టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వీరభద్రగౌడ్‌ వర్గీయుల మధ్య చాలా కాలం నుంచి విభేదాలు ఉన్నాయి. మొదటి నుంచి పార్టీలో ఉన్న వీరభద్రగౌడ్‌ను కాదని ఇటీవల పార్టీలో చేరిన కోట్లసుజాతమ్మకు ఆలూరు టికెట్‌  కేటాయించారు. దీంతో ఆయన వర్గీయులు లోలోపల అసంతృప్తితో ఉన్నారు. ఒకానొక దశలో పార్టీ అభ్యర్థికి సహాయ నిరాకరణ చేయాలని భావించారు.  ఇలాంటి  పరిస్థితుల్లో  కోట్ల సుజాతమ్మ..  వీరభద్రగౌడ్‌తో కలిసి ఆదివారం మండలంలోని ములుగుందంలో  ఎన్నికల ప్రచారానికొచ్చారు.

 ప్రచార రథంపై నుంచి  స్థానిక గ్రామ నాయకులు  మాట్లాడుతుండగా కోట్ల వర్గీయుడైన మనోహర్‌రెడ్డి  మొదట మైకు తీసుకున్నాడు. పక్కనే ఉన్న వీరభద్రగౌడ్‌ వర్గీయుడు మాజీ సర్పంచ్‌ మల్లికార్జున రెడ్డి మొదటి నుంచి పార్టీలో ఉన్న తమకే మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని మనోహర్‌రెడ్డి వద్ద ఉన్న మైకును లాక్కున్నాడు. దీంతో ఇద్దరి నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.  సత్తా ఉంటే గ్రామంలో ఎక్కువ ఓట్లు వేయించాలని మనోహర్‌రెడ్డి సవాల్‌ విసరగా..  నీలాగా మేము పార్టీలు మారేవాళ్లం కాదని మల్లికార్జునరెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ఇలా గ్రామస్తుల ఎదుటే ఇద్దరు నాయకులు మధ్య మాటామాటా పెరగడంతో  వీరభద్రగౌడ్‌ కలగజేసుకుని సర్దిచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

Advertisement
 
Advertisement
Advertisement