‘అంటరానితనం చంద్రబాబు ఒంట్లో ఉంది’

Merugu Nagarjuna Slams On Chandrababu And Lokesh - Sakshi

చంద్రబాబు రాజధానిలో రైతులకు ఒక ప్యాకేజీ, దళితులకు ఒక ప్యాకేజీ ఇచ్చి వివక్ష చూపించారు

సాక్షి, తాడేపల్లి: ఎంపీ నందిగం సురేష్‌పై పెయిడ్‌ ఆర్టిస్టులతో టీడీపీ దాడి చేయించిందని.. దాడికి చంద్రబాబునాయుడు, లోకేష్‌ బాధ్యత వహించాలని ఎమ్మెల్యే మేరుగు నాగార్జున అన్నారు. ఆయన సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ దిశగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చేస్తుంటే చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దళిత ప్రజా ప్రతినిధులపై దాడులకు ప్రేరేపిస్తున్న చంద్రబాబు, లోకేష్‌పై కేసు నమోదు చేయాలని ఆయన అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఎంపీ సురేష్‌పై వ్యూహం ప్రకారం దాడి చేయించారని నాగార్జున ధ్వజమెత్తారు.

ఎంపీ నందిగం సురేష్‌పై దాడి వెనుక పెద్ద కుట్ర ఉందని.. దాడులతో రాజధానిలో దళితులను మభ్యపెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు పరిపాలనలో దళితులు అస్పృశ్యత, అంటరానితనాన్ని ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. ఎంపీ సురేష్‌పై దాడి చంద్రబాబు అకృత్యాలకు నిదర్శనమని నాగార్జున దుయ్యబట్టారు. దళిత ఎమ్మెల్యేలుపై వరుసుగా టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని విమర్శించారు. చదవండి: బాపట్ల ఎంపీ సురేశ్‌పై టీడీపీ నేతల దాడి

పామర్రు ఎమ్మెల్యే అనిల్, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నేతలు దాడులు చేశారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు రాజధానిలో రైతులకు ఒక ప్యాకేజీ, దళితులకు ఒక ప్యాకేజీ ఇచ్చి వివక్ష చూపించారని నాగార్జున విరుచుకపడ్డారు. దళితులు కోసం చంద్రబాబు ఒక మంచి పథకమైన పెట్టావా అని ఆయన ప్రశ్నించారు. తన చెంచా మీడియా ద్వారా సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై దుష్ప్రచారం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని తెలిపారు. అంటరానితనం అనేది చంద్రబాబు ఒంట్లో ఉందని.. దళితులను భయపెట్టడం చంద్రబాబు తరం కాదని  ఆయన అన్నారు. మేము ఉద్యమం చేస్తే చంద్రబాబు, టీడీపీ నేతలు పారిపోతారని ఎమ్మెల్యే మెరుగు నాగార్జున ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top