ఆ హీరోలు మీ పార్టీ వాళ్లేగా.. కత్తి వ్యంగ్యాస్త్రాలు! | Kathi Mahesh Mocks TDP over Tollywood Heros | Sakshi
Sakshi News home page

Mar 20 2018 8:35 PM | Updated on Aug 28 2018 5:06 PM

Kathi Mahesh Mocks TDP over Tollywood Heros - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీకి ప్రత్యేక హోదా సాధన​ కోసం ముమ్మరంగా ఉద్యమం కొనసాగుతున్నప్పటికీ.. టాలీవుడ్‌ హీరోలు ఎవరు పెద్దగా స్పందించకపోవడంపై ప్రముఖ విమర్శకుడు కత్తి మహేశ్‌ స్పందించారు. ఈ విషయంలో ఏపీ అధికార పార్టీ టీడీపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టాలీవుడ్‌ హీరోలంతా మీ పార్టీ వాళ్లేగా.. నంది అవార్డులు పంచుకున్న మీ బ్యాచ్‌ ఎక్కడ అంటూ టీడీపీని నిలదీశారు. మీరు వైజాగ్‌లో భూములు ఇచ్చిన స్టార్లు ఎక్కడ.. బోయపాటి శ్రీను ఎక్కడ అంటూ ప్రశ్నించారు. ‘నిన్నటికి నిన్న కళ్ళు తెరిచి హోదా రాగం ఎత్తుకున్న టీడీపీ నాయకుల కళ్ళు నెత్తికెక్కినట్టు ఉన్నాయి.. మాటలు జాగ్రత్త’ అని హెచ్చరించారు.

‘ఉన్న హీరోలందరూ ఎదో ఒక రకంగా మీ పార్టీకి సంబంధించిన వాళ్లేగా! బాలకృష్ణ ఒకరు చాలడా? అవార్డులు పంచుకున్న బ్యాచ్చి ఎక్కడ? మీరు వైజాగ్‌లో భూములు ఇచ్చిన స్టార్లు ఎక్కడ? బొడ్డు, జఘనాల డైరెక్టర్ తిరుమలలోనే ఉన్నారుగా? బోయపాటి శీను ఎక్కడా?’ అని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశారు.

టాలీవుడ్‌ హీరోలు ప్రత్యేక హోదా ఉద్యమం గురించి స్పందించడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో కత్తి మహేశ్‌ ఈ మేరకు ట్వీట్లు చేశారు.  ‘ఏపీ ప్రత్యేక హోదా కోసం అన్నీ వర్గాల వారు మద్దతు ఇస్తుంటే సినీ పరిశ్రమ ఎందుకు ముందుకు రావడం లేదు. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమాన్ని అక్కడి పరిశ్రమ ముందుండి నడిపించింది. తెలుగు చిత్రపరిశ్రమకు చేవ చచ్చిపోయిందా?  పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఎంపీ కవిత, మంత్రులంతా మద్దతు ఇస్తుంటే.. సినీ ప్రముఖులకు ఏమైంది?’ అని రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement