టీవీ చర్చ: అనూహ్య పరిణామం.. యాంకర్‌పై నీళ్లు!

Congress Neta Throws Water at BJP Leader on Live TV Debate - Sakshi

న్యూఢిల్లీ : ఓ టీవీ చానెల్‌లో సీరియస్‌గా చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్‌ నాయకుడు ఒకరు సహనం కోల్పోయారు. బీజేపీ నేత తనను ఉద్దేశించి ‘దేశద్రోహి’ అనడంతో కోపంతో ఊగిపోయిన ఆయన.. ఎదురుగా ఉన్న నీళ్ల గ్లాస్‌ను ప్రత్యర్థిపైకి విసిరేశారు.  దీంతో బీజేపీ నేతతోపాటు మధ్యలో ఉన్న టీవీ యాంకర్‌ మీద కూడా నీళ్లు పడ్డాయి. లైవ్‌ టీవీ చర్చలో భాగంగా చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ప్రస్తుత ఎన్నికల్లో భారత ఆర్మీని రాజకీయం చేయడంపై ఓ ప్రైవేటు చానెల్‌ లైవ్‌ చర్చ నిర్వహించింది. ఈ చర్చలో కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అలోక్‌ శర్మ, బీజేపీ నుంచి కేకే శర్మతోపాటు పలు పార్టీల నేతలు, విశ్లేషకులు పాల్గొన్నారు. చర్చ జరుగుతుండగా అలోక్‌ శర్మను ఉద్దేశించి బీజేపీ నేత కేకే శర్మ ‘దేశద్రోహి’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో సహనం కోల్పోయిన అలోక్‌ శర్మ ఆవేశంతో ఊగిపోయారు. నోటికొచ్చిన మాటలంటూ ప్రత్యర్థిపైకి ఎదురుగా ఉన్న నీళ్ల గ్లాస్‌ను విసిరేశారు. దీంతో బీజేపీ నేతతోపాటు యాంకర్‌పైనా నీళ్లు పడ్డాయి. ఈ పరిణామంతో యాంకర్‌తోపాటు మిగతా ప్యానెలిస్టులు బిత్తరపోయారు. రౌడీల్లా ప్రవర్తించిన ఇద్దరు నేతలను చర్చను బహిష్కరించి యాంకర్‌ మిగతా చర్చను కొనసాగించారు. అయితే, యాంకర్‌ మీద నీళ్లు పడటంతో ఆయన తన దుస్తులను మార్చుకొని చర్చను కొనసాగించాల్సి వచ్చింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top