వైఎస్‌ జగన్‌ నిర్ణయం చరిత్రాత్మకం : బొత్స | Botsa Satyanarayana Slams Cm Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ నిర్ణయం చరిత్రాత్మకం : బొత్స

Feb 18 2019 6:03 PM | Updated on Feb 18 2019 6:07 PM

Botsa Satyanarayana Slams Cm Chandrababu Naidu - Sakshi

అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగానే వైఎస్సార్‌సీపీ బీసీ డిక్లరేషన్‌

సాక్షి, విశాఖపట్నం : సంచార కులాల పిల్లల కోసం రెసెడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పడం చరిత్రాత్మకమని ఆ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. బీసీల అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ కంకణం కట్టుకుందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇన్నాళ్లు చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారన్నారు. సుదీర్ఘ పాదయాత్ర ద్వారా తమ అధినేత అన్నివర్గాల ప్రజల స్థితిగతులను తెలుసుకున్నారని, బీసీల జీవన ప్రమాణలు పెంచే దిశగా డిక్లరేషన్‌ ప్రకటించారని తెలిపారు. అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగానే వైఎస్సార్‌సీపీ బీసీ డిక్లరేషన్‌ ఉందన్నారు.

బీసీలంటే బ్యాక్‌ వార్డ్‌ క్యాస్ట్‌ కాదు.. భారత్‌ కల్చరని జగన్‌ చెప్పారని, ఈ డిక్లరేషన్‌పై బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు ఇప్పుడు బీసీ సబ్‌ప్లాన్‌ పెట్టారని, ఎంత బడ్జెట్‌​ కేటాయించారో కూడా చెప్పలేదన్నారు. పిల్లలను బడికి పంపితే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని జగన్‌ చెప్పారని, నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించేలా చట్టబద్ధత తీసుకొస్తామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా బొత్స గుర్తు చేశారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో అన్నిరకాలుగా బీసీలకు మేలు జరిగిందని తెలిపారు. చంద్రబాబు మోసాలు, అబద్ధాలను ఎవరు నమ్మొద్దని, వచ్చే ఎన్నికల్లో తగిన బద్ధి చెప్పాలని బొత్స పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement