సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సూపర్ సక్సెస్
రాష్ట్ర సమస్యలను ఢిల్లీ పెద్దలకు కూలంకషంగా వివరించిన సీఎం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక రోజు గ్యాప్తో రెండుసార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రవిశంకర్ ప్రసాద్తో సుదీర్ఘంగా సంప్రదింపులు జరపడం ఈ వారంలో చోటుచేసుకున్న ముఖ్యమైన పరిణామం. బుధవారం ప్రధానమంత్రి మోదీతో, శుక్ర, శనివారాల్లో అమిత్ షా, రవిశంకర్ ప్రసాద్తోనూ ముఖ్యమంత్రి సంప్రదింపులు జరిపిన తీరు, వీటికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యం అటు దేశ రాజధాని ఢిల్లీలో, ఇటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సీఎం వైఎస్ జగన్తో ప్రధానమంత్రి మోదీ గంటన్నరకు పైగా (100 నిమిషాలు) సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి ముఖ్యమంత్రి జగన్కు ఇచ్చిన ప్రాధాన్యంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని సఎం జగన్ చాలా చక్కగా వినియోగించుకోవడం ద్వారా తన ఢిల్లీ పర్యటనలను బాగా విజయవంతం చేసుకున్నారనే భావన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. సీఎం ఢిల్లీ టూర్ను అధికార, రాజకీయ వర్గాలు సూపర్ సక్సెస్గా పేర్కొంటున్నాయి. ప్రధాని, కేంద్ర మంత్రులు సీఎంతో సుదీర్ఘ సంప్రదింపులు జరిపారంటే రాష్ట్రానికి ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో రచ్చబండలు, గ్రామ సచివాలయాల దగ్గర ప్రజలు కూడా ఇదే విషయం చర్చించుకుంటున్నారు.
క్లుప్తంగా విస్పష్టంగా విశదీకరణ
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన పోర్టులు, స్టీల్ప్లాంటు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు లాంటివన్నీ త్వరితగతిన సమకూర్చాలని సీఎం జగన్ ప్రధానికి, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ప్రధానిని కలిసిన సీఎం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా స్పష్టంగా గణాంకాలతో సహా వివరించారు. విభజన చట్టంలో ఏమి చెప్పారు? కేంద్రం ఇప్పటి వరకూ చేసిందేమిటి? ఇంకా చేయాల్సినవేమిటి? అనే అంశాలపై విస్పష్టమైన గణాంకాలతో సీఎం జగన్ ప్రధానికి నివేదికలు సమర్పించారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు పూర్తికి సవరించిన అంచనాలను ఆమోదించి నిధులు కేటాయించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించి ఇతోధిక సాయం అందించి రాష్ట్ర ప్రగతికి చేయూత ఇవ్వాలని కోరారు.
వికేంద్రీకరణ ఎజెండా..
రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించదలచిన విధానాన్ని కూడా ప్రధానికి సీఎం వివరించి కేంద్ర సహకారం కోరారు. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాల మేరకు అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల ప్రకారం హైకోర్టు ప్రధాన కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడానికి సహకరించాలని కోరారు. అభివృద్ధికి ప్రతిబంధకాలు కలిగిస్తున్న శాసనమండలి రద్దు చేయాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్ర ఆమోదం కోసం పంపినందున దీనిని పార్లమెంటులో పెట్టి త్వరగా ఆ మోదించాలని కోరారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని చెప్పారు.