స్పీకర్గా సుమిత్రా మహాజన్ ఏకగ్రీవ ఎన్నిక | Sumitra Mahajan unanimously elected Speaker of Lok Sabha | Sakshi
Sakshi News home page

స్పీకర్గా సుమిత్రా మహాజన్ ఏకగ్రీవ ఎన్నిక

Jun 6 2014 11:40 AM | Updated on Mar 29 2019 9:24 PM

16వ లోక్సభ స్పీకర్గా బీజేపీ సీనియర్ నేత సుమిత్రా మహాజన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

న్యూఢిల్లీ : 16వ లోక్సభ స్పీకర్గా బీజేపీ సీనియర్ నేత సుమిత్రా మహాజన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా అన్ని పార్టీలకు చెందిన సీనియర్ నేతలు 16వ లోక్‌సభ స్పీకర్‌గా మహాజన్ పేరును ప్రతిపాదించగా అన్ని పార్టీలు మద్దతు పలికాయి. శుక్రవారం ఆమె స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. ఎనిమిది సార్లు ఇండోర్ నుంచి ఎంపికైన సుమిత్రా మహాజన్ లోక్సభకు రెండో మహిళా స్పీకర్ కావటం విశేషం.

లోక్ సభ స్పీకర్ పదవి కోసం గురువారం మధ్యాహ్నంలోగా నామినేషన్లు దాఖలు చేయూల్సి ఉండగా.. ఆ గడువులోగా కేవలం సుమిత్రా మహాజన్ పేరుకు మాత్రమే ప్రతిపాదనలు వచ్చాయి. దాంతో ఆమె ఎన్నిక లాంఛనప్రాయమే అయ్యింది. డెబ్బై రెండేళ్ల సుమిత్ర మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నియోజకవర్గం నుంచి వరుసగా 8సార్లు ఎన్నికైన మహిళా పార్లమెంటేరియన్‌గా  రికార్డు సృష్టించారు.

మృదు స్వభావి అయిన, ప్రేమతో ‘తాయి’ (మరాఠీలో పెద్ద సోదరి)గా పిలుచుకునే ఆమెకు.. దాదాపు అన్ని పార్టీల్లోనూ స్నేహితులు, అభిమానులు ఉన్నారు. ఈమె న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేశారు. తన సతీమణి ఏనాటికైనా మధ్యప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావాలని సుమిత్ర భర్త దివంగత జయంత్ వామన్ మహాజన్ కోరుకున్నారు. కాగా ఆమె 8 సార్లు లోక్‌సభకు ఎన్నిక కాగలిగారు కానీ ముఖ్యమంత్రి కాలేకపోయారు.
 

Advertisement
 
Advertisement
Advertisement