‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ఏర్పాటు: మోదీ

PM Modi Announces Trust  Formation For Ram Mandir Construction Ayodhya - Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన సభలో మాట్లాడుతూ... ‘‘నవంబరు 9న వచ్చిన తీర్పు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరోసారి నిరూపించింది. అయోధ్య ట్రస్టు ఏర్పాటు చేస్తూ ఈరోజు ఉదయం కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తున్నా. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి.. ట్రస్టును ఏర్పాటు చేశాం. దీనికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రగా నామకరణం చేశాం. మందిర నిర్మాణం కోసం 67.703 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించాం. ఈ ట్రస్టు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది’’అని స్పష్టం చేశారు. అదే విధంగా.. భారతదేశంలో నివసిస్తున్న అన్ని మతాల ప్రజలు వసుదైక కుటుంబంలో భాగమేనని పేర్కొన్నారు. 

కాగా దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సర్వోన్నత న్యాయస్థానం గతేడాది నవంబరులో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందని పేర్కొన్న సుప్రీంకోర్టు.. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికై సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీల్లో భాగమైన రామ మందిర నిర్మాణానికి ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేస్తూ కేంద్ర కేబినెట్‌ బుధవారం నిర్ణయం తీసుకంది. ఇక ఈ చారిత్రాత్మక తీర్పును భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఏకగ్రీవంగా వెలువరించిన విషయం తెలిసిందే. (అయోధ్య తీర్పుపై సుప్రీం కీలక నిర్ణయం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top