‘ ఉన్నావ్’ బాధితురాలి అంత్యక్రియలు పూర్తి

Not Cremating The Body Says Unnav Victim Parents - Sakshi

లక్నో: కుటుంబసభ్యులు, గ్రామస్థుల అశ్రునయనాల మధ్య ఉన్నావ్ లైంగికదాడి బాధితురాలి అంతిమసంస్కారాలు ముగిశాయి. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రావాల్సిందేనని పట్టుబట్టిన బాధిత కుటుంబం... అధికారులు మాట ఇవ్వడంతో అంత్యక్రియలు పూర్తిచేసింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉ‍న్నావ్ బాధితురాలి మృతిపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ప్రజాసంఘాలు ధర్నాలు చేపడుతున్నారు. మరోవైపు బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ వెంటనే స్పందించి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌ ఘటన మాదిరిగా తమ కూతురును దారుణంగా హత్య చేసిన.. రాక్షసులను ఎన్‌కౌంటర్‌ చేయాలని కుంటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. వారికి స్థానికులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు మద్దతు ప్రకటించారు.

మహిళలపై అత్యాచార ఘటనలు జరగకుండా ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయలేకపోయిందని విమర్శించారు. తనపై జరిగిన అత్యాచారం కేసులో కోర్టు విచారణకు హాజరయ్యేందుకు వెళ్తున్న బాధితురాలిపై గురువారం ఉదయం నిందితులు పెట్రోల్‌ పోసి, నిప్పంటించిన విషయం తెలిసిందే. దాదాపు 40 గంటల పాటు మృత్యువుతో పోరాడి, ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. 90 శాతం కాలిన గాయాలతో ఢిల్లీలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూసింది.

కుటుంబసభ్యులు శనివారం రాత్రి స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో ఈ కేసు విచారణ చేపట్టి, త్వరలోనే బాధితులకు శిక్షలు పడేలా చూస్తామని సీఎం తెలిపారు. మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారంతోపాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వం తరుఫున తమకు ఎలాంటి సహాయం అవసరంలేదని, నిందితులకు కఠినంగా శిక్షిస్తే చాలని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top