18న భారత్‌–అమెరికా 2+2 చర్చలు | India US Dialogue to be Held on Dec 18 in Washington | Sakshi
Sakshi News home page

18న భారత్‌–అమెరికా 2+2 చర్చలు

Dec 13 2019 8:40 AM | Updated on Dec 13 2019 8:42 AM

India US Dialogue to be Held on Dec 18 in Washington - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌–అమెరికాల మధ్య రెండో విడత 2+2  మంత్రుల స్థాయి చర్చలు 18వ తేదీన జరగనున్నాయి. రెండు దేశాల వ్యూహాత్మక సంబంధాలను సమీక్షించే ఈ భేటీ వాషింగ్టన్‌లో జరుగనుందని విదేశాంగ శాఖ గురువారం తెలిపింది. మన దేశం తరఫున విదేశాంగ మంత్రి ఎస్‌.జై శంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ ఇందులో పాల్గొంటారని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్‌ వెల్లడించారు. తాజాగా పార్లమెంట్‌ ఆమోదం పొందిన పౌరసత్వ బిల్లుపై వ్యక్తమైన అభ్యంతరాలపై అమెరికా ప్రజాప్రతినిధులతో మాట్లాడామన్నారు. భారత్‌ వైఖరిని వారు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామన్నారు.

ఈ బిల్లుపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో గువాహటిలో 15వ తేదీ నుంచి 17 వరకు జరగాల్సిన భారత్‌–జపాన్‌ భేటీ వేదికపై ప్రస్తుతానికి ఎలాంటి మార్పూ లేదన్నారు. బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్‌ మొమెన్‌ భారత్‌ పర్యటన వాయిదా వేసుకోవడంపై ఆయన స్పందిస్తూ.. బంగ్లాదేశ్‌లో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మత పరమైన హింస జరుగుతున్నట్లు భారత్‌ ఎన్నడూ విమర్శించలేదన్నారు. పౌరసత్వ బిల్లుపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. భారత్‌ అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకునే ముందు సొంత దేశంలో మైనారిటీలపై ఎలాంటి వివక్ష కొనసాగుతోందో తెలుసుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement