నన్ను తీవ్రంగా కొట్టారు

I was Brutually attacked, says bleeding JNUSU president - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం చోటుచేసుకున్న హింసలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం ముసుగులు ధరించి చేతిలో కర్రలతో క్యాంపస్‌లోకి చొరబడిన దుండగులు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్‌ ఆయిషీ ఘోష్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె తల పగిలింది. ప్రస్తుతం ఆమె ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

జేఎన్‌యూ క్యాంపస్‌లో దుండగుల దాడి సందర్భంగా తల నుంచి తీవ్రంగా రక్తం కారుతుండగా.. ఆయిషీ ఘోష్‌ విలపిస్తూ మాట్లాడిన వీడియో  ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దుండగులు తనను కిరాతకంగా కొట్టారని ఈ వీడియోలో ఆమె విలపిస్తూ పేర్కొన్నారు. ‘తీవ్రంగా రక్తస్రావం అవుతోంది. నేను మాట్లాడే స్థితిలో కూడా లేను. దాడులు జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న నన్ను తీవ్రంగా కొట్టారు’ అని ఆమె వీడియోలో పేర్కొన్నారు.

జేఎన్‌యూలో సబర్మతి దాబా వద్ద ఆదివారం సాయంత్రం 6.45 గంటలకు అలజడి ప్రారంభమై.. కొద్దిసేపట్లోనే మొత్తం హాస్టల్‌ అంతా హింస చెలరేగింది. ముసుగులు ధరించిన వ్యక్తులు దాడులు చేయడం, పోలీసులు రావడంతో క్యాంపస్‌ అంతా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. ఏబీవీపీ, ఆరెస్సెస్‌ గూండాలు దాడి చేసినట్టు వామపక్షవాద విద్యార్థులు ఆరోపిస్తుండగా.. ఏఐఎస్‌ఏ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులే దాడులకు దిగారని రైట్‌వింగ్‌ విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

ముసుగు మూక వీరంగం
జేఎన్‌యూలో మసుగు మూకల వీరంగానికి సంబంధించి తాజా వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ముసుగులు ధరించిన దుండగులు క్యాంపస్‌లోకి విద్యార్థులపై, టీచర్లపై విచక్షణారహితంగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. దాడుల అనంతరం ముసుగులు ధరించిన వ్యక్తులు క్యాంపస్‌లో సంచరిస్తున్న వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ముఖానికి ముసుగులు తొడిగి.. జీన్స్‌ప్యాంట్లు, జాకెట్లు ధరించి.. చేతిలో కర్రలతో గుంపుగా దుండగులు క్యాంపస్‌లో సంచరిస్తూ.. కర్రలతో బెదిరిస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి.
చదవండి: సిగ్గుతో తలదించుకుంటున్నా!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top