బాధితులకు బాసటగా... మేము సైతం | Tollywood Film Industry Support to Hudhud Cyclone Victims | Sakshi
Sakshi News home page

బాధితులకు బాసటగా... మేము సైతం

Nov 19 2014 10:46 PM | Updated on Aug 28 2018 4:30 PM

బాధితులకు బాసటగా... మేము సైతం - Sakshi

బాధితులకు బాసటగా... మేము సైతం

ఎప్పుడు, ఎక్కడ ప్రకృతి విపత్తు సంభవించినా ప్రజలను ఆదుకోవడానికి తెలుగు సినిమా పరిశ్రమ ముందుంటుంది.

‘‘ఎప్పుడు, ఎక్కడ ప్రకృతి విపత్తు సంభవించినా ప్రజలను ఆదుకోవడానికి తెలుగు సినిమా పరిశ్రమ ముందుంటుంది. ఇటీవల హుదుహుద్ తుపాను బీభత్సంతో గ్రీన్ సిటీ లాంటి వైజాగ్ కాస్తా బ్రౌన్ సిటీ అయిపోయింది. వైజాగ్ తుపాను బాధితుల కోసం సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కతాటిపై ‘మేము సైతం’ అంటూ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది’’ అని సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అన్నారు. ఈ నెల 30న ‘మేము సైతం’ పేరుతో తెలుగు చిత్రపరిశ్రమ ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
 
  పలు రకాల వినోద కార్యక్రమాల ద్వారా విరాళాలు సేకరించి ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయనుంది. ఈ వివరాలు తెలియజేయడానికి హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు నాగార్జున, వెంకటేశ్, శ్రీకాంత్, మురళీ మోహన్, అల్లు అరవింద్, డి. సురేశ్‌బాబు, కేఎల్ నారాయణ, అశోక్ కుమార్, జీవిత, మద్దినేని రమేశ్ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
 
 రెండు రోజుల తారాసందోహం...
 ‘మేము సైతం’ కార్యక్రమంలో భాగంగా 29వ తేదీ శనివారం రాత్రి హైదరాబాద్‌లో ‘తారలతో విందు’ నిర్వహించనున్నారు. విందులో పాల్గొనదలిచిన ఒక్కో జంట టికెట్ ఖరీదు కింద రూ. లక్ష వంతున విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. అలా మొత్తం 250 జంటలకు అవకాశం ఉంటుంది. ఇక, 30వ తేదీ ఆదివారం ఉదయం నుంచి రాత్రి దాకా అన్నపూర్ణా స్టూడియోలో వినోద కార్యక్రమాలుంటాయి.
 
 అదే రోజున తారల క్రికెట్ మ్యాచ్, తంబోలా మొదలైనవి కూడా జరుగుతాయి. ఆదివారం నాటి కార్యక్రమానికి రూ. 500 చెల్లించి టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మొత్తం లక్ష టికెట్లు అమ్మి, కేవలం 104 మందిని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేస్తారు. అలా ఎంపికైన వారికే ఆ కార్యక్రమంలో ప్రవేశం ఉంటుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement