గ్లామరస్ పాత్రలో లక్ష్మీమీనన్ | Sakshi
Sakshi News home page

గ్లామరస్ పాత్రలో లక్ష్మీమీనన్

Published Wed, Jun 8 2016 3:56 AM

గ్లామరస్ పాత్రలో లక్ష్మీమీనన్

యువతుల దుస్తుల్లో లంగా, ఓణీలనేవి ప్రస్తుతం గ్రామాలకే పరిమితం(అక్కడ కూడా అరుదుగానే)అయ్యి పోయాయని చెప్పవచ్చు.అలాంటిది ఇక మన కథానాయికలు మాత్రం ధరించడానికి ఎలా ఇష్టపడతారు చెప్పండి. యువ నటి లక్ష్మీమీనన్‌కు లంగా ఓణీలు ధరించి బోర్ కొట్టేసిందంటున్నారు. కుంకీ చిత్రంలో కొండవాసి పడుచుగా పరిచయమైన ఈ కేరళ కుట్టి అప్పటి నుంచి తాను నటించిన చిత్రాల్లో అధిక శాతం లంగా ఓణీతోనే కనిపించి మురిపించారు.

కాగా వరుస విజయాలతో దూసుకొచ్చిన లక్ష్మీమీనన్ వేదాళం చిత్రంలో అజిత్‌కు చెల్లెలుగా నటించారు. అయినా నటిగా మంచి మార్కులు కొట్టేశారు. ఆ తరువాత మిరుదన్ చిత్రంలో జయంరవికి జంటగా నటించారు.ఆ చిత్రం బాగానే ప్రజాదరణ పొందింది. కానీ అవకాశాలు రాకో, వచ్చిన వాటిని తను అంగీకరించకో అమ్మడికి చిన్న గ్యాప్ వచ్చింది. దీంతో ప్రైమ్‌టైమ్‌లో ప్లేస్‌ను కోల్పోయారు. తాజాగా లైమ్‌టైమ్‌లోకి వచ్చారు. కారణం సక్సెస్‌ఫుల్ నటుడు విజయ్‌సేతుపతికి జంటగా రెక్క చిత్రంలో నటించే అవకాశాన్ని పొందడమే కావచ్చు.  

వా డీల్ చిత్రం ఫేమ్ రతన్‌శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మదురైలో జరిగిన షూటింగ్‌తో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. విశేషం ఏమిటంటే ఇందులో లక్ష్మీమీనన్ తొలిసారిగా గ్లామరస్ పాత్రను పోషిస్తున్నారట. పాత్ర బాగా నచ్చడంతో ఇష్టపడి మరీ నటిస్తున్నారట. అంతేకాదు ఇకపై లంగా, ఓణీ పాత్రలకు దూరం అంటున్నారని సమాచారం. అయితే తన ఈ మాటపై లక్ష్మీమీనన్ ఎంతవరకు నిలబడతారో వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement