విశాల్, అనీశారెడ్డిల పెళ్లి జరుగుతుంది

GK Reddy Confirms Vishal Marriage With Anisha Reddy - Sakshi

విశాల్‌ తండ్రి, నిర్మాత జీకే.రెడ్డి

చెన్నై ,పెరంబూరు:  నిర్ణయించిన విధంగా నటుడు విశాల్, అనీశారెడ్డిల వివాహం జరుగుతుందని, విశాల్‌ తండ్రి, సినీ నిర్మాత జీకే.రెడ్డి స్పష్టం చేశారు. విశాల్, అనీశారెడ్డి పెళ్లి గురించి ఇటీవల రకరకాల వదంతులు ప్రచారం అయిన విషయం తెలిసిందే. నటుడు విశాల్, హైదరాబాద్‌కు చెందిన నటి అనీశారెడ్డిల పెళ్లి నిశ్చితార్థం గత మార్చి 18న కుటుంబసభ్యులు, ముఖ్యమైన బంధుమిత్రుల సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే. అదే విధంగా విశాల్‌ తన వివాహం నడిగర్‌ సంఘం నూతన భవనంలో జరుగుతుందని ప్రకటించారు. అదేవిధంగా అక్టోబరు 9న వీరి వివాహం జరగనుందనే ప్రచారం జరిగింది. అయితే అందుకు సంబంధించిన వార్తలు రాకపోవడంతో పాటు, విశాల్, అనీశారెడ్డిల పెళ్లి రద్దయ్యిందనే ప్రచారం ఇటీవల సామాజికమాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. విశాల్,అనీశారెడ్డిల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విశాల్‌ ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌ నుంచి అనీశారెడ్డి తొలగించినట్లు వదంతులు దొర్లాలి.

అయితే ఈ విషయం గురించి విశాల్‌ గానీ, అనీశారెడ్డి గానీ ఇప్పుటి వరకూ స్పందించలేదు. అలాంటిది గురువారం చెన్నైలో జరిగిన దమయంతి చిత్ర మీడియా సమావేశంలో పాల్గొన్న విశాల్‌ తండ్రి జీకే.రెడ్డిని ఈ విషయం గురించి ప్రశ్నించగా, ఆయన విశాల్, అనీశారెడ్డిల వివాహం నిర్ణయించిన ప్రకారం జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే వివాహ తేదీని ఇంకా నిర్ణయించలేదని అన్నారు. నడిగర్‌ సంఘం నూతన భవనంలో తన పెళ్లి జరగనున్నట్లు విశాల్‌ ప్రకటించారని, అయితే ఇటీవల జరిగిన నడిగర్‌సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపును కోర్టు నిలిపివేసిందని, ఆ ఫలితాలు వెల్లడయితే విశాల్‌ జట్టు గెలవడం ఖాయం అని పేర్కొన్నారు. ఆ తరువాత నడిగర్‌ సంఘం భవన నిర్మాణాన్ని విశాల్‌ పూర్తి చేస్తారని, తను ప్రకటించిన విధంగా ఆదే నూతన భవనంలో పెళ్లి జరుగుతుందని అన్నారు. అదే విధంగా నటుడు శరత్‌కుమార్, రాధిక శరత్‌కుమార్‌ తన చిత్రాల్లో నటించారని, వారు, నటి వరలక్ష్మీ తమ కుటుంబసభ్యులేనని పేర్కొన్నారు. వారితో తమకు ఎంలాంటి శత్రుత్వం లేదని జీకే.రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top