
వాషింగ్టన్ : ఉత్తర కొరియాపై ఎలాంటి అదనపు షరతులు లేవని అమెరికా స్పష్టం చేసింది. చాలా ఏళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య బలమైన చర్చలకు ముందడుగుపడటం, మున్ముందు ఇక అణు పరీక్షలు నిర్వహించబోమని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఉత్తర కొరియాపై ఎలాంటి షరతులు లేకుండానే ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు అమెరికా వైట్ హౌస్ అధికారిక ప్రతినిధి రాజ్ షా ప్రకటించారు. అంతేకాదు.. దక్షిణ కొరియా, అమెరికాలు సంయుక్తంగా నిర్వహించుకునే సైనిక విన్యాసాలపై కూడా ఎలాంటి వ్యంగ్యాస్త్రాలు విసరకుండా, ప్రత్యక్ష విమర్శలు చేయకుండా ఉంటామని ఉత్తర కొరియా తమకు చెప్పినట్లు వెల్లడించారు.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్తో తాను మే నెలలో చర్చలు జరిపేందుకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. 'ఈ సమావేశం ముఖ్యలక్ష్యం ఏమిటనేదానిపై మా అధ్యక్షుడు ట్రంప్కు చాలా స్పష్టత ఉంది. ఒత్తిడి చేయడమే మా విధానం.. అయితే, ఈసారి ఆ ఒత్తిడి మా భాగస్వామ్య దేశాల నుంచి, ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వంగల దేశాల నుంచి చైనా నుంచి కూడా వచ్చింది. ఇది కిమ్ జాంగ్ ఉన్పై, అతడి ప్రవర్తను చాలా ప్రభావితం చేసింది. అయితే, జరగబోయే సమావేశంలో దౌత్యపరమైన అంశాలే ముందు వరుసలో ఉంటాయి. సమస్యకు పరిష్కారాలు ఉంటాయి. ఈ సమావేశంలో ఏప్రిల్లో నిర్వహిస్తారా? మేలోనా అనేది ఇప్పుడే చెప్పలేం.. అప్పటి వరకు ఉత్తర కొరియా కూడా ఎలాంటి అణుపరీక్షలు నిర్వహించకుండా ఉండటం అనేది కూడా ముఖ్యమైన అంశం' అని రాజ్ చెప్పారు.